ఎయిర్టెల్కు ఊరట, 100 శాతం FDIలకు అనుమతి
భారతీ ఎయిర్టెల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) పరిమితిని 49 శాతం నుంచి 100 శాతానికి పెంచుకునేందుకు టెలికం విభాగం (DoT) అనుమతిని ఇచ్చింది. కంపెనీలో 74 శాతం వరకు విదేశీ పెట్టుబడిదారుల వాటా అట్టిపెట్టుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇప్పటికే అనుమతించింది.
ఎయిర్టెల్ పెయిడప్ మూలధనంలో 100 శాతం వరకు FDIలకు డాట్ ఆమోదం లభించినట్లు కంపెనీ ఎక్స్చేంజీలకు ఇచ్చిన సమాచారంలో తెలిపింది. త్వరలో ప్రభుత్వానికి దాదాపు రూ.35,586 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సిన నేపథ్యంలో ఎయిర్టెల్కు ఈ అనుమతి వచ్చింది. FDIలను 100 శాతానికి పెంచుకునేందుకు తమకు DoT 20, జనవరి 2020 తేదీన అనుమతి ఇచ్చిందని పేర్కొంది.
భారతీ ఎయిర్టెల్ ఏజీఆర్, ఇతర డ్యూస్ను ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంది. రూ.35,586 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఈ చెల్లింపులకు ముందు విదేశీ పెట్టుబడుల పెంపుకు ఆమోదం లభించడం ఎయిర్టెల్కు భారీ ఊరట కలిగించే విషయం. ఎయిర్టెల్ బకాయిలలో రూ.21,682 కోట్లు లైసెన్స్ ఫీజు, మరో రూ.13,904 కోట్లు స్పెక్ట్రమ్ బకాయిలు (టెలినార్, టాటా టెలిసర్వీస్ బకాయిలను మినహాయించి) ఉన్నాయి.
ఈ కష్టాల నుంచి బయటపడేందుకు ఎయిర్టెల్ సుమారు రూ.4,900 కోట్ల విదేశీ పెట్టుబడులను రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా సింగపూర్కు చెందిన సింగ్ టెల్ అనే కంపెనీ సహా మరికొన్ని సంస్థల నుంచి ఆ మొత్తాన్ని పెట్టుబడుల రూపంలో సేకరించనుంది. గత ఏడాది ప్రారంభంలోనూ విదేశీ పెట్టుబడుల కోసం ఎయిర్టెల్ టెలికాం శాఖకు దరఖాస్తు చేసుకునన్నప్పటికీ దానిని తిరస్కరించింది. విదేశీ పెట్టుబడులపై పూర్తి స్థాయి సమాచారం అందించకపోవడంతో దరఖాస్తుని నాడు తిరస్కరించింది.