తెలియకుండానే...: డ్యూటీలో ఉండగానే.. ఉద్యోగం నుండి పైలట్ల తొలగింపు!
విమానయానరంగ దిగ్గజం ఎయిరిండియా 48 మంది పైలెట్లను తొలగిస్తూ అర్దరాత్రి నిర్ణయం తీసుకున్నది. కరోనా మహమ్మారి కారణంగా నష్టాల్లో ఉన్న ఎయిరిండియా ఈ పైలెట్లను తొలగించింది. ఉద్వాసనకు గురైన 48 మంది పైలెట్లు గత ఏడాది రాజీనామా చేస్తూ ఆరు నెలల నోటీసు ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత ఉపసంహరించుకున్నారు. ఎయిర్ బస్ 320 విమానాలకు చెందిన పైలెట్లను తొలగించింది. అంతకుముందు రాజీనామాలు అంగీకరించినప్పటికీ, ఆ తర్వాత గురువారం రాత్రి హఠాత్తుగా వెనక్కి తీసుకుంది. వారిని వెంటనే తొలగిస్తున్నట్లు తెలిపింది.
లైసెన్స్ రూల్స్, పండుగ సీజన్లో టీవీ కంపెనీలకు కలవరపాటు
ఉద్యోగం నుండి తొలగించినట్లు తెలియకుండానే.
కరోనా మహమ్మారి ప్రభావం కమర్షియల్ కార్యకలాపాలపై పడటం, ఆదాయ క్షీణతల వంటి వివిధ కారణాలతో వారిని తొలగిస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది. ఇందులో కొంతమంది పైలట్లకు శుక్రవారం ఉదయం కూడా తమను ఉద్యోగం నుండి తొలగించినట్లు తెలియకపోవడం గమనార్హం. అందులో కొంతమంది అప్పటికి విధుల్లో భాగంగా విమాన ప్రయాణంలో ఉన్నారు. ఆ సమయంలోనే వీరికి షాక్ తగిలింది.
అన్యాయంగా.. హఠాత్తుగా తొలగింపు
పైలెట్ల తొలగింపు ఉత్తర్వులను రద్దు చేయాలని ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్(ICPA) ఎయిరిండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బన్సాల్ను కోరింది. పైలట్లను అన్యాయంగా, హఠాత్తుగా తొలగించారని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. పైలట్లు 2019 జూలైలో రాజీనామా చేశారు. ఆ తర్వాత నిబంధనల మేరకు ఆరు నెలల లోపు ఉపసంహరించుకున్నారు. వాటిని యాజమాన్యం కూడా అంగీకరించింది. కానీ వారిని హఠాత్తుగా మొన్న రాత్రి నుండి తొలగించింది.
ఎయిరిండియాపై టాటా సన్స్ ఆసక్తి
ఎయిరిండియాను కొనుగోలు చేసే అంశంపై టాటా సన్స్ దృష్టి సారించినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. ఎయిరిండియాను వశం చేసుకోవడానికి ఈ నెల చివరి వరకు అధికారికంగా బిడ్స్ దాఖలు చేసే అవకాశముందని, ఇప్పటికే ఈ సంస్థకు సంబంధించిన వివిధ అంశాలను టాటా సన్స్ పరిశీలిస్తోందని తెలుస్తోంది.