నిరుద్యోగులకు ఎయిర్ ఇండియా శుభవార్త.. ఆ విభాగాల్లో భారీగా రిక్రూట్ మెంట్
టాటాల చేతిలోకి వచ్చిన తర్వాత ఎయిర్ ఇండియా రూపు రేఖలు మారిపోయాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 470 కొత్త విమానాలను ఆర్డర్ చేసింది. తద్వారా USలో లక్షల కొద్దీ ఉద్యోగాలు సృష్టించిందని అమెరికా అధ్యక్షులు జో బైడెన్ సైతం ప్రకటించారు. తాజాగా ప్రపంచంలోని దిగ్గజ సంస్థలు సైతం లేఆఫ్ లు ప్రకటిస్తుండగా.. అందుకు విరుద్ధంగా సిబ్బందిని నియమించుకోవాలని చూస్తోంది.
అయిదు వేల కొత్త ఉద్యోగాలు:
తన విస్తరణ ప్రణాళికల్లో భాగంగా 5 వేలకు పైగా కొత్త సిబ్బందిని తీసుకోనున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. 2023లో మొత్తంగా 4,200 మంది క్యాబిన్ సిబ్బంది, 900 మంది పైలట్లను నియమించుకోనున్నట్లు పేర్కొంది. పెద్ద ఎత్తున విమానాల కొనుగోలుకు తాజాగా ఆర్డర్ పెట్టగా.. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో మరింత ప్రభావవంతంగా సేవలు అందించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఇన్ ఫ్లైట్ సర్వీసెస్ హెడ్ సందీప్ వర్మ తెలిపారు. వీటిని సమన్వయం చేయడంలో క్యాబిన్ సిబ్బంది నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నట్లు చెప్పారు.
శిక్షణలో ఏమి నేర్పిస్తారంటే..
దేశం నలుమూలల నుంచి క్యాబిన్ సిబ్బందిని రిక్రూట్ చేయనున్నట్లు ప్రకటనలో కంపెనీ తెలిపింది. వారికి భద్రత, సేవా నైపుణ్యాలను అందించేందుకు 15 వారాల శిక్షణా కార్యక్రమం ఉంటుందని వెల్లడించింది. అత్యుత్తమ భారతీయ ఆతిథ్యం, టాటా గ్రూపు సంస్కృతికి అనుగుణంగా వారిని తీర్చిదిద్దనున్నట్లు చెప్పింది. ఈ కార్యక్రమం ముంబయిలోని ఎయిర్ లైన్స్ శిక్షణా కేంద్రంలో గల విస్తృతమైన తరగతి గదుల్లో జరుగుతుందని వెల్లడించింది.
ఇప్పటికే రిక్రూట్ మెంట్ ప్రారంభం:
ఎయిర్ ఇండియాలో కొత్త టాలెంట్ ను తీసుకోవడం ద్వారా.. Vihaan.AI కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక పరివర్తన వేగవంతం కానున్నట్లు సందీప్ వెల్లడించారు. మరింత మంది పైలట్లు, నిర్వహణ ఇంజనీర్లను నియమించుకోవాలని చూస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే మే 2022 నుంచి ఫిబ్రవరి 2023 మధ్య 1,900 మంది క్యాబిన్ సిబ్బందిని రిక్రూట్ చేసుకున్నట్లు తెలిపారు. జూలై 2022-జనవరి 2023 మధ్య 7 నెలల్లో 1,100 మందికి శిక్షణ ఇవ్వగా.. గత 3 నెలల్లో దాదాపు 500 మంది విధుల్లో చేరారని వివరించారు.