లోన్ మారటోరియం ఎఫెక్ట్, ఫైనాన్షియర్లకు 50,000 వాహనాల అప్పగింత?
కరోనా వైరస్ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కల్పించిన లోన్ మారటోరియాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది ఉపయోగించుకుంటున్నారు. ఈ నెలాఖరుతో ఇది ముగుస్తోంది. కరోనా, లాక్ డౌన్ కారణంగా దాదాపు మూడు నెలలపాటు వ్యాపార కార్యకలాపాల్లేక నష్టపోయారు. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా డిమాండ్ లేమి కారణంగా బిజినెస్లు డల్గా ఉన్నాయి. వ్యాపారాలు కోలుకోవడానికి మరో ఆరు నెలల నుండి ఏడాది పడుతుందని భావిస్తున్నారు. దీంతో మారటోరియంను పొడిగించాలని చాలామంది కోరుకుంటున్నారు.
ఎంత చేసినా.. వ్యాక్సీన్ వస్తేనే, 79% ఆదాయంపై ప్రభావం: ఆర్థిక వ్యవస్థపై సర్వే
తీవ్ర అనిశ్చితిలో రోడ్డు ట్రాన్సుపోర్ట్
లోన్ మారటోరియంను మరోసారి పొడిగించాలని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్సుపోర్ట్ కార్పోరేషన్(AIMTC) ఆర్బీఐని కోరుతోంది. రోడ్డు ట్రాన్సుపోర్ట్ సెక్టార్కు డిసెంబర్ 31వ తేదీ వరకు అవకాశం కల్పించాలని కోరుతోంది. కొద్ది నెలలుగా ఇంటర్-స్టేట్ లారీలు నిలిచిపోయాయని ఈ ప్రభావం రోడ్డు ట్రాన్సుపోర్ట్ రంగంపై ఎక్కువగా పడిందని, అన్ని రంగాల్లోని చిన్న ఆపరేటర్లపై కరోనా, లాక్ డౌన్ ప్రభావం ఎక్కువగా ఉందని, 85 శాతం వ్యాపారం ఉన్న కార్గో, పాసింజర్ వాహనాల వ్యాపారం తీవ్ర అనిశ్చితిలో ఉందని AIMTC పేర్కొంది.
వాహనాల అప్పగింతకు నిర్ణయం!
ఆర్థిక కార్యకలాపాల మందగించడం, తక్కువ సరుకు లభ్యత, ఆగస్ట్ 31న ముగియనున్న లోన్ మారటోరియం నేపథ్యంలో ట్రాన్స్పోర్టర్స్ 50,000 వాహనాలను ఫైనాన్షియర్లకు అప్పగించాలని కీలక నిర్ణయం తీసుకునే దిశలో యోచిస్తున్నారట. ఆగస్ట్ నెలలో సరుకు రవాణా పది శాతం మేర క్షీణించిందని చెబుతున్నారు. పరిస్థితి ఏమాత్రం బాగా లేదని ఇండియన్ ఫౌండేషన్ ఆఫ్ ట్రాన్సుపోర్ట్ రీసెర్చ్ అండ్ ట్రెయినిగ్(IFTRT) తెలిపింది. కొంతమంది ట్రాన్సుపోర్ట్ బిజినెస్ తగ్గించుకుంటుండగా, మరికొంతమంది బయటకు వెళ్లిపోతున్నారని, దాదాపు 45వేల నుండి 50వేల వాహనాలను సరెండర్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోందని, ఎందుకంటే ఈఎంఐ చెల్లింపులు జరపలేని పరిస్థితుల్లో వాహనాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు.
రికవరీ లేదా స్వాధీనం
ఇప్పటికే పంపిణీ చేసిన రుణాలలో రికవరీ కనిపించడం లేదని, కొత్త వాహనాలకు క్రెడిట్ పొందటం ప్రధాన సమస్యగా మారిందని, రుణ తిరస్కరణ రేట్లు పెరిగాయని చెబుతున్నారు. వాహనాల స్వాధీనం లేదా సరెండర్ కేవలం హైప్ మాత్రమేనని, ఫైనాన్షియర్లు కూడా కస్టమర్ల ఇబ్బందులను గుర్తించారని అంటున్నారు. కాబట్టి సరెండర్ లేదా స్వాధీనం ఉండదని ఫైనాన్షియర్లు అంటున్నారు. సగం డిమాండ్ కూడా లేదని ఇలాంటి పరిస్థితుల్లో మారటోరియం పొడిగించాలని కోరుతున్నారు.