కోవిడ్ కోరలు చాచినప్పటికీ...ఈ రెండు రంగాలే ఆర్థిక వ్యవస్థను కాపాడాయా..?
జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన లెక్కల ప్రకారం 2019-20కి గాను స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ ) 4.2శాతంగా ఉంది. జనవరి నుంచి మార్చి నెల వరకు అంటే చివరి త్రైమాసికానికి 3.1శాతం మేరా పెరిగింది. ఇక అదే సమయంలో కోవిడ్-19 కారణంగా దేశం లాక్డౌన్లోకి వెళ్లిపోవడంతో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. అయితే కేంద్రం తాజాగా జారీ చేసిన ఈ జీడీపీ లెక్కలు ఏం చెబుతున్నాయి..?
బ్యాంకులపై జీడీపీ, మారటోరియం, రెపో దెబ్బ: భారీ నష్టాల్లో మార్కెట్లు
క్షీణించిన వృద్ధి రేటు
నిన్న జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన జీడీపీ లెక్కలు దేశ ఆర్థిక వ్యవస్థపై కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఒక ఆర్థిక సంవత్సరం జీడీపీ అంచనాతో పాటు చివరి త్రైమాసికంకు విడుదల చేసిన జీడీపీ గణాంకాలు చూస్తే వృద్ధి రేటు క్షీణించిందని స్పష్టమవుతోంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి 6.1శాతంగా ఉన్న జీడీపీ 2019-20కి 4.2శాతానికి పతనమైంది. ఇక 2018-19 చివరి క్వార్టర్కు జీడీపీ 5.7శాతం ఉండగా ఈ సారి ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్కు 3.2శాతంగా ఉంది. ఇక ప్రత్యేకించి చెప్పాలంటే దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని చెప్పక తప్పదు. కోవిడ్-19 కంటే ముందు కూడా ఆర్థికపరంగా వృద్ధి రేటులో క్షీణత కనిపించింది. అయితే త్రైమాసికం తర్వాత త్రైమాసికంకు స్థిరమైన వృద్ధిరేటును సాధించడంలో ప్రభుత్వం విఫలమైందని నిపుణులు చెబుతున్నారు. ఇక దీనికి తోడు కోవిడ్-19 దెబ్బ కోలుకోలేకుండా చేసింది.
వ్యవసాయ రంగమే కాపాడిందా..?
తాజాగా విడుదల చేసిన జీడీపీ గణాంకాలు దేశ ఆర్థిక వ్యవస్థలో ఏ అంశాలు బలంగా ఉన్నాయో, ఏ అంశాలు బలహీనంగా ఉన్నయో తెలిపేందుకు ఉపయోగపడుతాయి. 2019-20 సంవత్సరంలో గ్రాస్ వాల్యూ యాడెడ్ వృద్ధి వ్యవసాయ రంగంలో అధికంగా కనిపించింది. ఇది 2019-20లో 4శాతం వృద్ది ఉండగా.. ఇది 2018-19లో 2.4శాతంగా ఉన్నింది. మైనింగ్ మరియు క్వారీ రంగాల్లో 2018-19లో నెగిటివ్లోకి జారుకోగా 2019-20లో ఇది 3.1శాతంకు చేరుకుంది. ఈ రెండు రంగాలు మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను కాపాడుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం వ్యవసాయ రంగంపై కోవిడ్-19 ప్రభావం పడకూడదని ఆలోచించి పలు విధానపరమైన సంస్కరణలు తీసుకొచ్చింది. మైనింగ్లో ప్రైవేట్ రంగాలకు కూడా అవకాశం కల్పిస్తూ డెసిషన్ తీసుకుంది. ఇలా చేయడం వల్ల మైనింగ్ రంగంలో మరింత వృద్ధి సాధించడమే లక్ష్యమని స్పష్టం చేసింది.
భారీగా దెబ్బతిన్న నిర్మాణ రంగం
కోవిడ్-19 కారణంగా 2019-20లో తయారీ రంగం తీవ్రంగా దెబ్బతింది. అంతకుముందు ఏడాది 5.7 శాతంతో పోలిస్తే జివిఎ వృద్ధి 0.03 శాతంగా ఉంది. ఇక కోవిడ్-19కు ముందు వాణిజ్యం, హోటళ్లు మరియు రవాణా విభాగంలో మంచి వృద్ధి కనపడగా ఈ మహమ్మారి దెబ్బతో సగానికి పడిపోయింది. అంటే 2018-19లో 7.7శాతం నుంచి 2019-20 నాటికి 3.6శాతానికి వృద్ధి రేటు పడిపోయిది. ఇక నిర్మాణ రంగంలో కూడా వృద్ధి భారీగా తగ్గింది. 2018-19లో ఇది 6.1శాతంగా ఉండగా.. 2019-20కి అది 1.3శాతంకు పడిపోయింది. ఇక తయారీ రంగంను సేవారంగాలను తిరిగి గాడిన పెట్టడమంటే ప్రభుత్వానికి సవాలుతో కూడిన విషయమే అని చెప్పాలి.
కోవిడ్-19తో మరింత నష్టం చేకూరే అవకాశం
ఇక దేశ ఆర్థిక ప్రగతికి మూల స్తంభాలుగా నిలుస్తున్న 8 ప్రధాన రంగాలు కుదేలు కావడంతో భవిష్యత్తు ప్రమాదంలోకి నెట్టివేయబడుతుందనే సంకేతాలు పంపుతున్నాయి. ఏప్రిల్ నెలలో బొగ్గు, సిమెంట్, సహజ వాయువు, రిఫైనరీ, క్రూడ్ ఆయిల్ రంగాల్లో ఉత్పత్తి భారీగా పడిపోయింది. ఈ రంగాల్లో 38.1శాతం పతనం కనిపించింది. మార్చి నెలతో పోలిస్తే దాదాపు 9శాతం క్షీణత కనిపించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక కరోనావైరస్ భారత ఆర్థిక వ్యవస్థపై ఇంకా ఏమేరకు నష్టం చేస్తుందో అనేదానిపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.