అడ్వాన్స్ సహా చెల్లించిన జియో: రూ.88 కోట్లు చెల్లించని ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలకు భారీ ఊరట
AGRకు సంబంధించిన బకాయిలను రిలయన్స్ జియో.. టెలికం శాఖకు చెల్లించింది. జనవరి 31వ తేదీ వరకు చెల్లించాల్సిన దానితో కలిపి మొత్తం రూ.195 కోట్లు జియో చెల్లించినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది అక్టోబర్ 24వ తేదీ సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రూ.177 కోట్లు చెల్లించాలి. కానీ బకాయిలతో పాటు జనవరి చివరి వరకు అడ్వాన్స్తో కలిపి రూ.195 కోట్లు చెల్లించింది.
షాకింగ్: 50% జనాభాకు 9 మంది బిలియనీర్ల సంపదన సమానం
ఎయిర్టెల్, ఐడియాలకు ఊరట
ఏజీఆర్ బకాయిల చెల్లింపుల కోసం జనవరి 23వ తేదీ వరకు సుప్రీం కోర్టు గడువు ఇచ్చింది. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు రూ.88,624 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే సుప్రీం కోర్టులో కొత్త పిటిషన్లపై విచారణ పూర్తయ్యే వరకు చెల్లించేది లేదని ఈ సంస్థలు స్పష్టం చేశాయి. వచ్చే వారం ఈ పిటిషన్లు విచారణకు వస్తున్నాయి. తాము ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద మొత్తం చెల్లించలేమని, తమకు మరింత గడువు కావాలని ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలతో పాటు వివిధ టెలికం సంస్థలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.
టెల్కోలపై కఠిన చర్యలు అప్పుడే వద్దు
ఇదిలా ఉండగా, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలకు టెలికం విభాగం నుంచి ఊరట లభించింది. బకాయిలు చెల్లించేందుకు సుప్రీంకోర్టు విధించిన గడువు గురువారంతో ముగిసినప్పటికీ ఆ టెల్కోలపై కఠిన చర్యలు చేపట్టవద్దని టెలికం విభాగం నిర్ణయించింది. మరింత గడువు ఇవ్వాలని టెల్కోలు అభ్యర్థించాయి. సుప్రీం తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి చర్యలు వద్దని నిర్ణయించింది.
ఎంత చెల్లించాలంటే?
ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సహా ఇతర టెలికం సంస్థలు లైసెన్స్ ఛార్జ్ కింద రూ.92,642 కోట్లు చెల్లించాలి. స్పెక్ట్రం వినియోగ ఛార్జ్ రూ.55,054 కోట్లు చెల్లించాలి. మొత్తం రూ.1.47 లక్షల కోట్లు చెల్లించవలసి ఉంది. ఇందులో ఎయిర్టెల్ రూ.21,682 కోట్ల లైసెన్స్ ఫీజు, రూ.13,904 కోట్ల స్పెక్ట్రం ఛార్జీలు మొత్తం రూ.35,586 కోట్లు ఉన్నాయి. వొడాఫోన్ ఐడియా రూ.28,309 కోట్ల లైసెన్స్ ఫీజు, రూ.24,729 కోట్ల స్పెక్ట్రం ఛార్జీలు మొత్తం రూ.53,038 కోట్లు చెల్లించాలి. జియో 2016లోనే వచ్చింది కాబట్టి ఇది చెల్లించాల్సిన మొత్తం రూ.177 కోట్లు మాత్రమే.