భారత్, బ్రిటన్లలో తీవ్రమాంద్యం, వృద్ధిరేటు దారుణ పతనం
2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు దారుణంగా పడిపోనుందని ఇండియా రేటింగ్స్, ఫిచ్ రేటింగ్స్ సహా వివిధ రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో గతంలో వేసిన అంచనా కంటే మరింత ప్రతికూలత నమోదు చేస్తుందని రేటింగ్ ఏజెన్సీలు వెల్లడిస్తున్నాయి. భారత జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10.5 శాతం మేర ప్రతికూలత నమోదు చేస్తుందని ఫిచ్ రేటింగ్ అంచనా వేసింది.
ఇది గతంలో మైనస్ 5 శాతం అంచనా వేసింది. అంతకుముందు 5.3 శాతం ప్రతికూలత అంచనా వేసిన ఇండియా రేటింగ్స్, ఇప్పుడు 11.8 శాతం ప్రతికూలత నమోదు చేస్తుందని అంచనా వేసింది. నోమురా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ భారత జీడీపీ వరుసగా మైనస్ 10.8 శాతం, మైనస్ 10.9 శాతం అంచనా వేశాయి. 2020 క్యాలెండర్ ఇయర్లో 5 శాతం ప్రతికూలత ఉండవచ్చునని, 2021 క్యాలెండర్ ఇయర్లో మాత్రం 9.5 శాతంగా ఉండవచ్చునని మోర్గాన్ స్టాన్లీ, ఈ ఆర్థిక సంవత్సరంలో మైనస్ 14.8 శాతం ప్రతికూలత ఉండవచ్చునని గోల్డ్మన్ శాక్స్ తెలిపింది.
భారత జీడీపీ వృద్ధి రేటు మైనస్ 11.8 శాతం, ఇండియా రేటింగ్స్ అంచనా
భారత్, బ్రిటన్లలో మాంద్యం ఎక్కువ
ఫిచ్ రేటింగ్స్ 2020లో అమెరికా వృద్ధి 4.6 శాతం ప్రతికూలత (అంతకుముందు 5.6 శాతం) ఉంటుందని అంచనా వేసింది. యూరో ప్రాంతంలో 9 శాతం ప్రతికూలత, యూకే మైనస్ 11.5 శాతం, ఫ్రాన్స్ మైనస్ 9 శాతం, స్పెయిన్ మైనస్ 13.2 శాతం అంచనా వేసింది. కరోనా కారణంగా పూర్తి ఏడాదికి యూకే, ఇండియా, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ ఆర్థిక వ్యవస్థలపై ఎక్కువగా ప్రభావం పడనుంది. ఫిచ్ రేటింగ్స్ ప్రకారం భారత్, బ్రిటన్, స్పెయిన్ దేశాల్లో మాంద్యం తీవ్రంగా కనిపిస్తోంది.
అనేక సవాళ్లు
ఆర్థిక వ్యవస్థలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో జూలై-సెప్టెంబర్వలో వృద్ధి పుంజుకోవాల్సి ఉంది. అయితే రికవరీ సంకేతాలు మందగమనంగా ఉన్నట్లు ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. స్వల్పకాలంలో, దీర్ఘకాలంలో వృద్ధి పుంజుకోవడానికి అనేక సవాళ్లు కనిపిస్తున్నాయి. కరోనా కేసులు పెరగడంతో కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత రాష్ట్రాలు తిరిగి లాక్ డౌన్ ప్రకటించాయని, దీంతో ఆర్థిక కార్యకలాపాలు, సెంటిమెంట్ బలహీనపడిందని తెలిపింది.
టెల్కోల గురించి...
ఏజీఆర్ బకాయిల చెల్లింపుల విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన పదేళ్ల గడువు వొడాఫోన్ ఐడియా(VI)కి సరిపోకపోవచ్చునని, జియో, ఎయిర్టెల్లకు మాత్రం తమ మార్కెట్ వాటాను బలోపేతం చేసుకోవచ్చునని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. రానున్న 12 నెలల్లో కనీసం 20 శాతం మేర టారిఫ్ పెంచే అవకాశం ఉండవచ్చునని వెల్లడించింది.