సంతోషం నెల రోజులే. మళ్ళీ మొదలైన ఆటో స్లంప్!
దాదాపు ఏడాది పాటు వరుసగా అమ్మకాలు క్షీణించి కుదేలైన భారత ఆటోమొబైల్ పరిశ్రమకు ఈ ఏడాది అక్టోబర్ నెల మాత్రం కలిసొచ్చింది. దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకొని వినియోగదారులు తమకు ఇష్టమైన కార్లను అక్టోబర్ లో కొనుగోలు చేసారు. దీంతో ఏడాదిలో తొలిసారి అమ్మకాలు కొంత పెరిగాయి. దీన్ని పురస్కరించుకొని ఆటోమొబైల్ పరిశ్రమ సంబరాలు జరుపుకొంది. హమ్మయ్య, ఇక ఆర్థిక మందగమనం పోయినట్లేనని భావించింది. ఇకపై మళ్ళీ పాత రోజులు వస్తాయని, అమ్మకాలు పెరుగుతాయని ఊహించింది. దీనికి తగ్గట్లుగానే మారుతి సహా అన్ని కంపెనీలు కొత్త మోడళ్లను విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకొన్నాయి. అయితే, వారి సంతోషం కేవలం నెల రోజుల్లోనే ఆవిరి అయిపోయింది. కార్ల అమ్మకాలు పెరిగేందుకు కేవలం పండుగలు మాత్రమే దోహదం చేశాయని, ఎకానమీ కోలుకోలేదని స్పష్టం అయిపోయింది. ఎందుకంటే, నవంబర్ నెలలో మళ్ళీ కార్ల అమ్మకాలు క్షీణించాయి. దీంతో కంపెనీల్లో మళ్ళీ ఆందోళన మొదలైంది.
3% తగ్గిన మారుతి అమ్మకాలు..
దేశంలో ప్రతి రెండు కార్లలో ఒకటి విక్రయించే మారుతి సుజుకి సైతం మళ్ళీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. నవంబర్ నెలలల కంపెనీ సేల్స్ 3% క్షీణించాయి. ఈ విషయాన్నీ ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది. గతంలో అధిక సేల్స్ నమోదయ్యే చిన్న కార్లు ఆల్టో, పాత వాగన్ ఆర్, ఇటీవలే మార్కెట్లోకి ప్రవేశ పెట్టిన ఎస్ - ప్రెస్సో మోడల్స్ అమ్మకాలు 12% పడిపోయి 26,306 కు పరిమితమయ్యాయి. కాగా కాంపాక్ట్ కార్లు స్విఫ్ట్, డిజైర్, బాలెనొ, సెలెరియో, ఇగ్నీస్, న్యూ వాగన్ ఆర్ అమ్మకాలు మాత్రం 7.6% పెరిగి 78,013 కు చేరుకొన్నాయి. యుటిలిటీ కార్లు ఎర్టిగా, వితర బ్రేజా, ఎస్ - క్రాస్, ఎక్స్ఎల్-6 మోడల్స్ అమ్మకాలు 1.3% తగ్గి 23,204 కు పడిపోయాయి. అక్టోబర్ నెల అమ్మకాలు ఆశాజనకంగా ఉన్నాయి. అయితే పండుగ సీజన్ అయిపోయింది కాబట్టి వచ్చే కొద్ది నెలలు అమ్మకాలు ఎలా ఉంటాయో జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది అని మారుతి సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ( సేల్స్ అండ్ మార్కెటింగ్) శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు.
టాటా, మహీంద్రా విలవిల ...
దేశీయ కార్ల విక్రయాల్లో తమదైన వాటా కలిగిన స్వదేశీ కంపెనీలు టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు బాగా తగ్గిపోయాయి. నవంబర్ నెలలో టాటా మోటార్స్ విక్రయాలు ఏకంగా 39% తగ్గి 10,400 యూనిట్లకు పరిమితమయ్యాయి. అయితే డీలర్ల కు పంపిన స్టాక్స్ కంటే అమ్మకాలు 15% అధికంగా జరగటంతో మొత్తంగా కంపెనీ స్టాక్స్ 35% తగ్గాయని కంపెనీ పేర్కొంది. మరో వైపు మహీంద్రా సైతం అమ్మకాల క్షీణత ఎదుర్కొంది. నవంబర్ నెలలో మహీంద్రా అమ్మకాలు 10% తగ్గి 14,637 యూనిట్లకు పడిపోయాయి. దేశంలో మారుతి సుజుకీ పాసెంజర్ కార్ల కు లీడర్ అయితే, స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్ యూ వి ) అమ్మకాల్లో మహీంద్రా అండ్ మహీంద్రా మార్కెట్ లీడర్ గా ఉండేది. అయితే, పండుగల తర్వాత నెలలో సహజంగానే అమ్మకాలు తగ్గుతాయని మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఆఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ విజయ్ రామ్ నక్రా అభిప్రాయపడ్డారు.
అందుకే తగ్గుతున్నాయి...
దేశంలో ఒక వైపు ఆర్థిక మందగమనం కొనసాగుతుండగా... మరో వైపు ఆటోమొబైల్ పరిశ్రమ కొత్త దిశలో పయనిస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన బీఎస్ - 6 నిబంధనలు అమలు చేసేందుకు గాను కొత్త టెక్నాలజీ తో కూడిన వాహనాలను మార్కెట్లోకి తెచ్చే ప్రయత్నాల్లో ఆటోమొబైల్ పరిశ్రమ ఉంది. మరో వైపు ఎలక్ట్రిక్ వెహికిల్స్ కూడా మార్కెట్లోకీ అధిక సంఖ్యలో రానున్నాయి. పెరిగిన టాక్సులు, ఫైనాన్స్ సులభంగా లభించక పోవటం వల్ల కూడా అమ్మకాలు తగ్గిపోతున్నాయి.
హ్యాండాయ్ ఫరవాలేదు...
అన్ని కార్ల కంపెనీలు నవంబర్ నెలలో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొనగా... హ్యుండై కంపెనీ మాత్రం స్వల్పంగా వృద్ధిని నమోదు చేసింది. దేశంలో మారుతి తర్వాత రెండో అతి పెద్ద పాసెంజర్ కార్ల కంపెనీ ఐన హ్యుండై మోటార్స్ ... నవంబర్ లో 2% వృద్ధి తో 44,600 యూనిట్లను విక్రయించగలిగింది. కంపెనీ ఇటీవలే మార్కెట్లోకి ప్రవేశ పెట్టిన వెన్యూ అనే మోడల్ అమ్మకాలను ముందుకు నడిపించింది. ఈ మోడల్ బుకింగ్స్ త్వరలోనే 1,00,000 యూనిట్ల కు చేరుకొంటాయని కంపెనీ ఆశిస్తోంది. ఇక పోతే ... ఆర్థిక మందగమనం ఇంకెంత కాలం కార్ల కంపెనీలను ఇబ్బంది పెడుతుందో చూడాలి మరి.