అమెజాన్ తర్వాత ప్లిప్కార్ట్: సీసీఐ ఎంక్వైరీపై కోర్టులో పిటిషన్, ట్రంప్ పర్యటన నేపథ్యంలో..
దేశంలో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ప్లిప్కార్ట్ భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తూ పోటీతత్వ చట్టాన్ని (కాంపిటీషన్ లా)ను ఉల్లంఘిస్తున్నారని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) గుర్రుగా ఉంది. ఈ రెండు సంస్థలపై విచారణ జరిపేందుకు జనవరి నెలలో కమిటీని కూడా ఏర్పాటుచేసింది. అయితే దీనిపై ఇదివరకే అమెజాన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో విచారణకు బ్రేక్ పడింది. తాజాగా ప్లిప్కార్ట్ కూడా కోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది. ఈ మేరకు ప్రముఖ వార్తాసంస్థ 'రాయిటర్స్' పేర్కొన్నది.
ఎంక్వైరీ..
ఈ-కామర్స్ సంస్థలపై జనవరిలో సీసీఐ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. విచారణపై కోర్టులో ప్లిప్కార్ట్ కూడా పిటిషన్ వేసింది. తమపై కావాలనే సీసీఐ పిటిషన్ వేసిందని అందులో పేర్కొన్నది. ఇదివరకే అమెజాన్ పిటిషన్ వేయగా.. అమెరికా అధ్యక్షుడు భారత్లో అడుగిడే కొద్దిరోజుల ముందు ప్లిప్కార్ట్ పిటిషన్ వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ట్రంప్ పర్యటన నేపథ్యంలో..
దిగుమతి చేసుకొనే వస్తువులపై భారత్ సుంకం విధిస్తోందని పెద్దన్న అమెరికా ఇప్పటికే కాస్త గుర్రుగా ఉంది. ఈ క్రమంలో ప్లిప్కార్ట్ పిటిషన్ వేయడం చర్చకు దారితీసింది. అంతేకాదు ఈ నెల 18వ తేదీన బెంగళూరులో గల తమ కార్యాలయానికి సంబంధించి ప్రాథమిక ఆధారం లేకుండా విచారణ జరుపుతోన్నారని ప్లిప్కార్ట్ పేర్కొన్నది. సీసీఐ విచారణ సహేతుకం కాదని.. ఎలాంటి ఆధారం లేకుండా విచారణ జరపడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
కంపెనీని తక్కువగా చూడటమే..
సీసీఐ చర్య ఓ సంస్థను తక్కువ చేసి చూడటమేనని.. విశ్వసనీయత, ప్రతిష్టను తగ్గించడమేనని కంపెనీ గుర్తుచేసింది. దీనిని సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ గురించి వివరణ అడగగా ప్లిప్కార్ట్ ప్రతినిధి సాధారణంగా జరిగే ప్రక్రియే అని తెలిపారు. వచ్చేవారం కోర్టులో విచారణ జరుగుతుందని చెప్పారు. కోర్టులో ప్లిప్కార్ట్ పిటిషన్పై సీసీఐ కూడా స్పందించేందుకు నిరాకరించింది.