Cognizant: ఇరుక్కుపోయిన టక్కరి టెక్కీలు.. చెక్ పెట్టిన టాప్ కాగ్నిజెంట్.. ఫేకర్స్ ఫైరింగ్..
Cognizant: ఇటీవల ఐటీ ఉద్యోగులను ఎక్కువగా కలపెడుతున్న విషయం ఉద్యోగాల తొలగింపు. అయితే ఈ సారి దీనికి కారణం నకిలీ సర్టిఫికెట్లు, ఫేక్ ఎక్స్ పీరియన్స్ పత్రాలతో కంపెనీల్లో జాయిన్ కావటమేనని వెల్లడైంది. ఇలా తప్పుడు మార్గాల్లో కంపెనీల్లోకి అడుగుపెట్టిన ఉద్యోగులను కంపెనీలు తొలగించటం ప్రారంభించాయి.
వారం వ్యవధిలో..
అంతర్జాతీయ టెక్ కంపెనీలు ఇప్పుడు నకిలీగాళ్లను గుర్తించి తొలగించే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా గత వారం యాక్సెంచర్ ఇదే కారణంతో కొంత మంది ఉద్యోగులను తొలగించింది. తాజాగా.. ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ సైతం ఇదే పనిలో పడింది. సెప్టెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో తప్పుడు మార్గాల్లో కంపెనీలో ఉద్యోగాలు పొందిన 6 శాతం మందిని తొలగించింది. దీని వల్ల దాదాపు 1000 మంది తొలగింపబడినట్లు వెల్లడైంది.
డిమాండ్ సమయంలో..
కరోనా పీక్ సమయంలో ఐటీ ఉద్యోగులకు భారీగా డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే. అయితే కంపెనీలు అభ్యర్థులను ఆన్ లైన్ ప్రక్రియలోనే రిక్రూట్ చేసుకోవటం వల్ల చాలా మంది నకిలీ పత్రాలు, అనుభవం చూపి అనేక ఏజెన్సీల ద్వారా ఐటీ పరిశ్రమలోని కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించారు. అయితే కంపెనీల తాజా చర్యలు ఇలాంటి వారిలో గుబులు పుట్టిస్తున్నాయి. కంపెనీల ఉత్పత్తిని పెంచే పనిలో భాగంగా నకిలీగాళ్లను గుర్తించి తొలగిస్తున్నాయి.
పెరుగుతున్న సమస్యలు..
ఇప్పటికే ఐటీ కంపెనీల్లో రకరకాల సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మాంద్యంతో తగ్గిన ప్రాజెక్టులు, క్షీణించిన రాబడులు, మార్జిన్ల ఒత్తిడితో ఖర్చుల తగ్గింపులు, మూన్ లైటింగ్ వంటి సమస్యలు కంపెనీలకు ఆలోచనలో పడేస్తున్నాయి. ఇదే సమయంలో నకిలీ టెక్కీలను తొలగించే పనిలో కంపెనీలు ఉన్నాయి. పెరుగుతున్న అట్రిషన్ రేటు సమయంలో కంపెనీలకు ఉద్యోగులను మేనేజ్ చేయటం సంక్షోభాన్ని సృష్టించనుంది.
యాక్సెంచర్ ప్రకటన..
యాక్సెంచర్ సంస్థలో నియామకాలు కేవలం మెరిట్ ఆధారంగానే జరుగుతాయని కంపెనీ వెల్లడించింది. రిక్రూట్మెంట్ ప్రక్రియలో ఏ స్థాయిలోనూ ఫీజులు అడగడం లేదని కంపెనీ తెలిపింది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బయట బ్రోకర్లు, ట్రైనింగ్ ఇన్టిట్యూట్లు డబ్బు తీసుకుని ఇచ్చే హామీలకు కంపెనీ ఎలాంటి బాధ్యత వహించదని స్పష్టం చేసింది. ఇలాంటి మోసాలతో జాగ్రత్తగా ఉండాలని.. కంపెనీకి ఇలాంటి వాటికి ఎలాంటి సంబంధం లేదని కంపెనీ వెల్లడించింది.