ఖజానాపై కనక వర్షం: అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు..రూ.లక్షల కోట్లు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ కేంద్ర ఖజానాపై కాసుల వర్షం కురిసింది. అడ్వాన్స్ ట్యాక్సుల రూపంలో భారీ ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి సమకూరింది. దీని మొత్తం లక్షల కోట్ల రూపాయలు. సగానికి పైగా వసూళ్లు రికార్డయ్యాయి. 53.50 శాతం మేర నమోదయ్యాయి. గత రెండు సంవత్సరాలతో పోల్చుకుంటే కాస్త తక్కువే అయినప్పటికీ.. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ సంభవించిన ఈ ఆర్థిక సంవత్సరంలో మరోసారి సగానికి పైగా ట్యాక్సులు అడ్వాన్స్ రూపంలో అందడం అన్ని సెక్టార్ల పురోగమనానికి సూచనగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
2018-2019లో అందిన అడ్వాన్స్ ట్యాక్సుల మొత్తం 6,70,739.1 కోట్ల రూపాయలు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి ఖజానాకు సమకూరిన ప్రత్యక్ష పన్నులు 6,75,409.5 కోట్ల రూపాయలు. ఈ ఫిస్కల్ ఇయర్లో ఈ మొత్తం కొంతమేర తగ్గింది. 53.50 శాతం మేర రికార్డయింది. దీని విలువ 4,59,917.1 కోట్ల రూపాయలు. డిసెంబర్ 16వ తేదీ నాటికి అందిన మొత్తం ప్రత్యక్ష పన్నుల విలువ ఇది.
నెట్ డైరెక్ట్ ట్యాక్సెస్ వసూళ్లు 60.8 శాతంగా నమోదైంది. దీని విలువ 9,45,276.6 కోట్లు. ఇందులో కార్పొరేట్ పన్నులు, వ్యక్తిగత ఆదాయపు పన్నుల వాటా 4,29,406.1 కోట్ల రూపాయలు. ఈ ఆర్థిక సంవత్సరం త్రైమాసికం అంటే ఏప్రిల్-మే-జూన్, రెండో త్రైమాసికం, మూడో త్రైమాసికం డిసెంబర్ 15వ తేదీ నాటికి అందిన మొత్తం ప్రత్యక్ష పన్నుల విలువగా కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ తేల్చింది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంతో పోల్చుకుంటే ఈ మొత్తం అధికం.
కేటగిరీ వారీగా చూసుకుంటే- అడ్వాన్స్ పన్నులు- రూ.4,59,917.1 కోట్లు, ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్- రూ.4,93,171.7 కోట్లు, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్-రూ.74,336.2 కోట్లు, రెగ్యులర్ అసెస్మెంట్ ట్యాక్స్-రూ.44,028.7 కోట్లు, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్-రూ.6,525.9 కోట్లు, ట్యాక్స్ అండర్ అదర్ మైనర్ హెడ్స్-రూ.2,390.6 కోట్ల రూపాయలుగా కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ వివరించింది. చివరి త్రైమాసికంలో ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే-రీఫండ్ మొత్తం కింద రూ.1,35,093.6 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు తెలిపింది.