జగన్ రాకతో... అదానీ చేతికి కృష్ణపట్నం పోర్టు: కంపెనీ విలువ రూ.13,500 కోట్లు
హైదరాబాద్ కు చెందిన సీవీఆర్ గ్రూప్ కంపెనీ ఐన కృష్ణపట్నం పోర్టును గుజరాత్ కు చెందిన అదానీ గ్రూప్ కొనుగోలు చేస్తోంది. ఇందులో భాగంగా గౌతమ్ అదానీ కి చెందిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (ఏపీఎస్ఈజెడ్) ... కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ లిమిటెడ్ (కేపీసీఎల్) లో 75% వాటాను చేజిక్కించుకుంటోంది. ఈ మేరకు అదానీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ డీల్ లో భాగంగా కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ కి అదానీ గ్రూప్ రూ 13,500 కోట్ల విలువను కట్టింది. అయితే, ఈ కంపెనీ లో మెజారిటీ వాటా అదానీ గ్రూప్ చేతికి వెళుతున్నా... కృష్ణపట్నం పోర్ట్ ప్రస్తుత ఎండీ చింతా శశిధర్ మాత్రం 25% వాటాను కలిగి ఉంటారు.
అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు వస్తే మరో ఆరు నెలల్లో ఈ లావాదేవీ పూర్తికానుంది. 2008 లో ప్రారంభించిన కృష్ణపటం పోర్ట్ ... పదేళ్లలోనే దేశంలోని ప్రధాన పోర్ట్లుల్లో ఒకటిగా ఎదిగింది. తూర్పు తీరంలో ఉన్న అతి పెద్ద ప్రైవేట్ రంగ పోర్ట్ కూడా ఇదే కావటం విశేషం. ప్రస్తుత డీల్ ప్రకారం అదానీ గ్రూప్ గత మూడు నెలలుగా డ్యూ డిలీజెన్స్ నిర్వహిస్తోంది. అది ఇటీవలే పూర్తయినట్లు సమాచారం. నెల్లూరు జిల్లా కేంద్రానికి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణపట్నం పోర్టు దేశంలోనే అత్యంత లోతైన (డీప్ డ్రాఫ్ట్) కలిగిన పోర్ట్. అతి భారీ నౌకల రాకపోకలకు చాలా అనువైన పోర్టు. అంతే కాకుండా ఇది ఆల్ వెదర్ పోర్టు. అంటే ఏడాది లో 360రోజులూ కార్యకలాపాలు కొనసాగించవచ్చు.
జనవరి 1 నుంచి అన్ని సేవలు గ్రామసచివాలయాల్లో: మినిమం ఛార్జ్
పెరగనున్న అదానీ వాటా...
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 11 పోర్టులను అదానీ గ్రూప్ కలిగి ఉంది. ముంద్రా వంటి అతి పెద్ద పోర్టులతో పాటు ఇటీవలే తూర్పు తీరంలో తమిళ నాడులోని కట్టుపల్లి, ఓడిశాలోని దామ్ర పోర్టులను కొనుగోలు చేసింది. ప్రస్తుతం కృష్ణపట్నం పోర్టు తో కపితే 12 పోర్టులవుతాయి. దీంతో ఇప్పటి వరకు భారత్ పోర్టుల మార్కెట్ లో 22% వాటా అదానీ షేర్ 27% కి పెరగనుంది. కృష్ణపట్నం పోర్ట్ గతేడాది 54 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో హేండిల్ చేసింది. రూ 1,350 కోట్ల పన్నులు, తరుగుదల ముందు రాబడిని ఆర్జించింది. 2021 నాటికి కృష్ణపట్నం పోర్ట్ రాబడిని రెట్టింపు చేయాలనీ, 100 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అదానీ పోర్టుల సీఈఓ కారం అదానీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఆరుదైన రికార్డులు...
తూర్పు తీరంలో పోర్టు ను అభివృద్ధి చేసినప్పటి నుంచి కృష్ణపట్నం పోర్ట్ అనేక రికార్డులను నెలకొల్పింది. 6,500 ఎకరాల యార్డ్ కలిగి ఉండటంతో పాటు అత్యంత అధునాతన టెక్నాలజీ, ఎక్విప్మెంట్ వినియోగిస్తోంది. ఇటీవల 200 ఏళ్ళ చరిత్ర కలిగిన చెన్నై పోర్టు ను కూడా కార్గో హ్యాండ్లింగ్ లో వెనక్కి నెట్టి సరికొత్త రికార్డు నెలకొల్పింది. కంపెనీ సుమారు 3,000 మంది ఉద్యోగులు ఉన్నారు. కృష్ణపట్నం పోర్ట్ కు అధునాతన కంటైనర్ టెర్మినల్ కూడా 5,00,000 టిఈయూ కంటైనర్ల ను హేండిల్ చేసి రికార్డు సృష్టించింది. పోర్టు కు ప్రత్యేక హెలికాప్టర్, గోల్ఫ్ కోర్స్ కూడా ఉన్నాయి.
జగన్ రాకతో..
వై ఎస్ జగన మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే... సివిఆర్ గ్రూప్ కంపెనీ ఐన నవయుగ ఇంజనీరింగ్ కు చెందిన పోలవరం కాంట్రాక్టు రద్దు చేసారు. మచిలీపట్టణం పోర్టు కాంట్రాక్టును కూడా రద్దు చేసారు. అలాగే కృష్ణపట్నం పోర్ట్ కు ఇచ్చిన ఎస్ఈజెడ్ స్థలాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. దీంతో రుణాల భారంతో ఉన్న సంస్థ తప్పనిసరిగా కృష్ణపట్నం పోర్టును విక్రయానికి పెట్టాల్సి వచ్చిందని మార్కెట్ వర్గాల సమాచారం. ప్రస్తుత డీల్ ద్వారా రుణాలు పోను, సుమారు రూ 5,500 కోట్లు కృష్ణపటంమ్ పోర్ట్ ప్రోమోటర్ల కు దక్కనున్నట్లు తెలిసింది.