అతిపెద్ద ప్రయివేట్ ఆపరేటర్.. ముంబై ఎయిర్పోర్ట్లో 74% వాటాను దక్కించుకున్న అదానీ
బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో మెజార్టీ వాటాను దక్కించుకుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో 74 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇందులో 50.5 శాతం వాటాను జీవీకే గ్రూప్ నుండి, 23.5 శాతం వాటాను ఇతర మైనార్టీ భాగస్వాముల నుండి కొనుగోలు చేసింది.
ఇందులో ఎయిర్పోర్ట్స్ కంపెనీ సౌత్ ఆఫ్రికా(ACSA), బిడ్వెస్ట్ గ్రూప్ ఉన్నాయి. ఈ వాటాను కొనుగోలు చేయడం ద్వారా అదానీ ఇప్పుడు దేశంలో అతిపెద్ద ప్రయివేట్ ఎయిర్పోర్ట్ ఆపరేటర్గా నిలిచారు. అదానీ గ్రూప్ అతిపెద్ద విమానాశ్రయాన్ని దక్కించుకోవడం ఇదే మొదటిసారి. ముంబై ఆర్థిక రాజధాని కావడం, ఈ విమానాశ్రయం దేశానికి అతిపెద్దది కావడం గమనార్హం.
ఐటీ కంపెనీలకు చిక్కులు, ఖాళీగా ఉద్యోగులు! లాభాలపై ప్రభావం
ఎవరి వాటా ఎంతంటే?
ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో జీవీకే గ్రూప్కు చెందిన 50.5 శాతం వాటాను అదానీ కొనుగోలు చేసింది. మిగతా 23.5 శాతం వాటాల్లో బిడ్వెస్ట్కు చెందిన 13.5 శాతం వాటా, ఏసీఎస్ఏ 10 శాతం వాటా ఉంది. ఇందుకు అదానీ గ్రూప్ దాదాపు రూ.15 వేలకోట్లు చెల్లిస్తోంది. తద్వారా ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణ, బ్రాండింగ్ అదానీ గ్రూప్ చేతిలో ఉంటుంది. 50 సంవత్సరాల లీజుకు ఆరు విమానాశ్రయాలను అదానీ గ్రూప్కు అప్పగించేందుకు కేంద్రం ఇటీవల ఆమోదముద్ర వేసింది. అహ్మదాబాద్, లక్నో, మంగళూరు, జైపూర్, తిరువనంతపురం, గౌహతి విమానాశ్రయాలు అదానీ ఆదీనంలోకి వెళ్లాయి.
గతంలోనే ప్రయత్నం
గత సంవత్సరం మార్చిలో బిడ్వెస్ట్ వాటాను దాదాపు రూ.1,250 కోట్లకు కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ ముందుకు వచ్చింది. కానీ మెజార్టీ వాటా కలిగిన జీవీకే భాగస్వాముల వాటా కొనుగోలు చేయడానికి తిరస్కరిస్తే తప్ప వారి వాటాను ఇతరులు కొనుగోలు చేయడానికి వీల్లేదని జీవీకే గ్రూప్ ఈ ప్రక్రియను నిలిపివేసింది. మరోవైపు, అప్పుల ఊబిలో ఉన్న జీవీకే పవర్ ఈ వాటాను కొనుగోలు చేయడానికి నిధులు సమకూర్చుకోలేకపోయింది. చివరకు అదానీ గ్రూప్ చేతికి వెళ్లింది.
ఇలా కొనుగోలు..
నిర్ణీత గడువులోగా జీవీకే గ్రూప్ వాటాను కొనుగోలు చేయలేకపోయింది, వాటాను ఇతరులకు విక్రయించేందుకు అనుమతివ్వాలని బిడ్వెస్ట్ కోర్టును ఆశ్రయించింది. జీవీకే గ్రూప్ ఆర్థిక కష్టాల్లో ఉన్నందున జీవీకే వాటాను కొనుగోలు చేయడానికి కూడా అదానీ గ్రూప్ ఆసక్తి వ్యక్తం చేసింది. జీవీకే గ్రూప్ కూడా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంది. దీంతో 74 శాతం వాటా అదానీ గ్రూప్ దక్కించుకుంది. అదానీ గ్రూప్ ఈ వాటాను కొనుగోలు చేయడం ద్వారా అతిపెద్ద ప్రయివేట్ విమానాశ్రయాల నిర్వహణ కంపెనీగా గుర్తింపు పొందింది. పోర్టులు, ఇంధన వ్యాపారాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అదానీ గ్రూప్ విమానాశ్రయ రంగంలో పట్టు సాధించింది.