adani: అదానీ గ్రూపు 3 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ఎలా సమీకరించిందంటే..
adani: హిండెన్ బర్గ్ నివేదిక వల్ల తీవ్ర నష్టాలు మూటగట్టుకున్న అదానీ గ్రూపు, నష్టనివారణ చర్యలకు దిగింది. పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలగజేసేందుకు నానా పాట్లు పడుతోంది. ఇందుకోసం గతంలో తీసుకున్న రుణాలను గడువు తీరక ముందే తిరిగి చెల్లించేందుకు సిద్ధమైంది. కానీ నిధుల కొరత మాత్రం కంపెనీలను వేటాడుతూనే ఉంది. ఇందుకోసం సంస్థ ఓ తాజా నిర్ణయం తీసుకుంది.
సావరిన్ వెల్త్ ఫండ్ నుంచి..
రుణ భారాన్ని తగ్గించుకోవడానికి, తద్వారా పెట్టుబడిదారుల విశ్వాసం పొందడానికి అదానీ గ్రూపు శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా
ఒక సావరిన్ వెల్త్ ఫండ్ నుంచి 3 బిలియన్ డాలర్లు అప్పు తీసుకునట్లు.. రుణదాతలకు కంపెనీ వెల్లడించిందని ఓ ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. ఈ వ్యవహారం గురించి బాగా తెలిసిన రెండు వర్గాలు ఈ విషయాన్ని బహిర్గతం చేసినట్లు తెలిపింది.
ఆ ఫండ్ ఏది ?
సావరిన్ వెల్త్ ఫండ్ ద్వారా 5 బిలియన్ డాలర్ల వరకు క్రెడిట్ లైన్ పొందవచ్చని అదానీ గ్రూపు భావిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. బుధవారంతో ముగియనున్న ఇన్వెస్టర్స్ రోడ్ షోలో పాల్గొన్నవారికి ఇచ్చిన మెమోలో ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలిపింది. అయితే ఆ ఫండ్ కు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం వెల్లడి కాలేదని చెప్పింది.ఈ వ్యవహారంపై స్పందించడానికి కంపెనీ ప్రతినిధులు నిరాకరించినట్లు మీడియా సంస్థ వివరించింది.
ముందస్తు చెల్లింపుల ప్రకటన తరువాతి రోజే..
మార్చి చివరి నాటికి 690 నుంచి 790 మిలియన్ డాలర్ల విలువైన షేర్-బ్యాక్డ్ లోన్లను ముందస్తుగా తిరిగి చెల్లించాలని అదానీ గ్రూపు భావిస్తోంది. ఇదే విషయాన్ని బాండ్ హోల్డర్లకు చెప్పిన తరువాతి రోజే, నిధుల సమీకరణ వార్తలు రావడం గమనించాల్సి ఉంది. పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెంచడానికి సింగపూర్, హాంకాంగ్లలో ఈ వారం అదానీ గ్రూపు రోడ్ షోలు నిర్వహిస్తుండటం తెలిసిందే. ఆ సంస్థల భవిష్యత్ ప్రణాళికలు ఏమిటో తెలుసుకోవాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచిచూడాల్సిందే.