రిలయన్స్, టీసీఎస్, HDFC తర్వాత అదానీ సరికొత్త రికార్డ్: అవి ఆల్ టైమ్ గరిష్టం..
అదానీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 100 బిలియన్ డాలర్లు దాటి సరికొత్త రికార్డును సృష్టించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా, HDFC తర్వాత ఈ మార్కు దాటిన నాలుగో కంపెనీ అదానీ గ్రూప్. దేశీయ కరెన్సీలో ఇది 7.30 లక్షల కోట్లు. అదానీ గ్రూప్కు చెందిన 6 లిస్టెడ్ కంపెనీల్లో నాలుగు కంపెనీల షేర్లు మంగళవారం ఆల్ టైమ్ గరిష్టానికి చేరాయి. దీంతో ఇది సాధ్యమైంది మార్కెట్ క్యాప్ జంప్ చేసింది.
నాలుగో కంపెనీ అదానీ గ్రూప్
స్టాక్ ఎక్స్ఛేంజీ గణాంకాల ప్రకారం అదానీ గ్రూప్కు చెందిన ఆరు లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ వ్యాల్యూ మంగళవారం ట్రేడింగ్ ముగిసేనాటికి రూ.7.84 లక్షల కోట్లు (106.8 బిలియన్ డాలర్లు)గా నమోదైంది. తద్వారా 100 బిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ వ్యాల్యూ కలిగిన గ్రూప్గా టాటా గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, HDFC సరసన అదానీ గ్రూప్ చేరింది. ప్రస్తుతం టాటా గ్రూప్ మార్కెట్ వ్యాల్యూ 242 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.17.76 లక్షల కోట్లు), రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ వ్యాల్యూ 171 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.12.55 లక్షల కోట్లు.
అదానీ గ్రూప్ ఇలా..
అదానీ ఎంటర్ప్రైజెస్ 7.4 శాతం దూసుకెళ్లి రూ.1,223 వద్ద ముగిసింది. మొదట రూ.1,241 వద్ద రికార్డ్ గరిష్టాన్ని తాకింది. అదానీ టోటల్ గ్యాస్ ఇంట్రాడేలో రూ.1,250కు చేరుకుంది. చివరికి నాలుగు శాతం లాభపడి రూ.1209 వద్ద ముగిసింది. అదానీ ట్రాన్స్మిషన్ ఓ దశలో 5 శాతం జంప్ చేసి రూ.1,145కు చేరుకుంది. చివరకు రూ.1,110 వద్ద క్లోజ్ అయింది. అదానీ పోర్ట్స్ 14.5 శాతం పురోగమించి రూ.850 వద్ద ముగిసింది. రూ.853 సమీపంలో గరిష్టాన్ని తాకింది. అదానీ పవర్ 5 శాతం లాభపడి రూ.98.4 వద్ద నిలిచింది. అదానీ గ్రీన్ ఎనర్జీ 3.3 శాతం లాభంతో రూ.1,203 వద్ద ముగిసింది. అదానీ గ్రీన్, అదానీ పవర్ మినహా మిగిలిన నాలుగు కౌంటర్లు ఇంట్రాడేలో రికార్డ్ గరిష్టాన్ని తాకాయి. ప్రస్తుతం అదానీ పవర్ మార్కెట్ వ్యాల్యూ రూ.37,9852 కోట్లు కాగా మిగిలిన అయిదు కంపెనీలు రూ.లక్ష కోట్ల మార్కును అధిగమించాయి.
ఇలా ఎదిగిన అదానీ
1980లో కమొడిటీ ట్రేడర్గా ప్రస్థానాన్ని ప్రారంభించిన గౌతమ్ అదానీ రెండు దశాబ్దాల వ్యవధిలో గనులు, ఓడరేవులు విద్యుత్ ప్లాంట్లు, విమానాశ్రయాలు, డేటా సెంటర్లు, సిటీ గ్యాస్, రక్షణ వంటి వివిధ రంగాల్లోకి దూసుకొచ్చారు. గత రెండేళ్లలో ఏడు విమానాశ్రయాల్లో యాజమాన్య నియంత్రణ వాటాలను అదానీ గ్రూప్ చేజిక్కించుకుంది. ఏపీలోని గంగవరం, కృష్ణపట్నం పోర్టు సహా దేశంలోని ఓడరేవుల పరిశ్రమలో 30 శాతం వరకు నియంత్రణ అదానీ పోర్ట్స్ చేతిలో ఉంది.