Adani group: 48 క్రయోజనిక్ ట్యాంకులు దిగుమతి: ఎందుకు?..ఎక్కడినుంచి?
అహ్మదాబాద్: న్యూఢిల్లీ: దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ సృష్టిస్తోన్న కల్లోలం అంతా ఇంతా కాదు. కనీవినీ ఎరుగని ఉత్పాతానికి దారి తీసిందీ మహమ్మారి. దేశాన్ని కరోనా సెకెండ్ వేవ్ దారుణంగా దెబ్బ కొడుతోంది. జనం ఉసురు తీస్తోంది. ఇదివరకెప్పుడూ లేనివిధంగా మరణాలకు కారణమౌతోంది. వరుసగా మరోసారి కూడా నాలుగు లక్షలకు పైగా కొత్త కేసులు పుట్టుకొచ్చాయి. యాక్టివ్ కేసులు 37,23,446గా రికార్డయ్యాయి. ఇంతమందికి ఒకేసారి కరోనా ట్రీట్మెంట్ అందించలేక ఆసుపత్రులు సతమతమౌతున్నాయి. ఆక్సిజన్, పడకల కొరతను ఎదుర్కొంటున్నాయి.
ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా పలు ఉక్కు కర్మాగారాలు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ను యుద్ధ ప్రాతిపదికన ఉత్పత్తి చేస్తున్నాయి. రాష్ట్రీయ ఇస్తాత్ నిగమ్ లిమిటెడ్ (RINL)కు చెందిన విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ, బొకారోలో స్టీల్ అథారిటీ ఆప్ ఇండియా లిమిటెడ్ (SAIL)కు చెందిన కంపెనీలు రోజూ టన్నుల కొద్దీ ఆక్సిజన్ను తయారు చేస్తోన్నాయి. ఇక- దేశీయ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఇదే ప్రయత్నాల్లో ఉంది. గుజరాత్లోని జామ్నగర్లో గల తమ ప్లాంట్ నుంచి రోజూ వెయ్యి టన్నుల మేర లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తామని ఇదివరకే వెల్లడించింది.
విదేశాల నుంచి పెద్ద ఎత్తున విరాళాల రూపంలో అందుతోన్న ఆక్సిజన్ దీనికి అదనం. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చెక రిపబ్లిక్, సింగపూర్, నెదర్లాండ్స్ వంటి అనేక దేశాలు భారత్కు ఆక్సిజన్ సహా అనేక వైద్య పరికరాలను అందజేస్తోన్నాయి. ఆక్సిజన్ను ఉత్పత్తి చేయడానికి అవసరమైన యంత్రాలను పంపిణీ చేస్తోన్నాయి. అలా అందిన ఆక్సిజన్ను రవాణా చేయడం ఇప్పుడు సమస్యగా మారింది. దీన్ని అధిగమించడానికి మరో దేశీయ పారిశ్రామిక దిగ్గజ సంస్థ అదాని గ్రూప్ రంగంలోకి దిగింది. ఆక్సిజన్ సరఫరా కోసం భారీగా క్రయోజనిక్ ట్యాంకర్లను దిగుమతి చేసుకుంది.
ఇప్పటిదాకా 48 క్రయోజనిక్ ట్యాంకర్లను దిగుమతి చేసుకున్నట్లు అదాని గ్రూప్ వెల్లడించింది. వాటి ద్వారా ఏకకాలంలో 780 టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ను సరఫరా చేయడానికి అవకాశం ఉందని అదాని గ్రూప్ ప్రతినిధి తెలిపారు. సౌదీ అరేబియా, థాయ్లాండ్, సింగపూర్, తైవాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వాటిని దిగుమతి చేసుకున్నట్లు పేర్కొన్నారు. గుజరాత్లోని ముంద్రా పోర్ట్ నుంచి కొన్నింటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తామని, మరి కొన్నింటిని వైమానిక దళం సహకారంతో ఎయిర్ లిఫ్ట్ చేస్తామని తెలిపారు. డిమాండ్కు అనుగుణంగా మరి కొన్ని క్రయోజనిక్ ట్యాంకులను దిగుమతి చేసుకుంటామని చెప్పారు.