92,700 మంది వీఆర్ఎస్కు దరఖాస్తు, BSNL వేతనాలు ఎంత తగ్గుతాయంటే?
న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ఉద్యోగులు.. వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకునే గడువు మంగళవారంతో ముగిసింది.మ ొత్తం 92,700 దరఖాస్తులు వచ్చినట్లు రెండు సంస్థల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దీంతో వార్షిక వేతన బిల్లు భారం రూ.8,800 కోట్లు తగ్గుతుందని అంచనా. బీఎస్ఎన్ఎల్కు చెందిన 78,300 మంది, ఎంటీఎన్ఎల్కు చెందిన 14,378 మంది వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

సగం తగ్గనున్న వేతన బిల్లు
మొత్తం 82 వేల మంది సిబ్బంది తగ్గుతారని అంచనా వేశామని, వీఆర్ఎస్కు 78,300 మంది దరఖాస్తు చేసుకుంటే మరో 6 వేల మంది పదవీ విరమణ చేశారని, దీంతో 84 వేల మందికి పైగా సిబ్బంది తగ్గుతున్నారని బీఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పూర్వార్ తెలిపారు. ప్రస్తుత వార్షిక వేతన బిల్లు రూ.14,000 కోట్లుగా ఉందని, వీఆర్ఎస్ ద్వారా రూ.7 వేల కోట్లకు తగ్గుతుందన్నారు.

ఎంటీఎన్ఎల్ వేతన బిల్లు రూ.500 కోట్లు మాత్రమే
13,650 మందికి వీఆర్ఎస్ ఇద్దామని భావించామని, కానీ 14 వేల మందికి పైగా ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని ఎంటీఎన్ఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ కుమార్ అన్నారు. తమ కార్యకలాపాలు కొనసాగించేందుకు 4,430 మంది సిబ్బంది సరిపోతారని, వేతన బిల్లు కూడా రూ.2,272 కోట్ల నుంచి రూ.500 కోట్లకు తగ్గుతుందన్నారు.

రూ.40,000 కోట్ల రుణాలు
బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ కంపెనీల రుణాలు రూ.40,000 కోట్ల వరకు ఉన్నాయి. ఈ ప్రభుత్వ సంస్థల రుణాలకు అధిక వేతనాలు కూడా ఓ కారణంగా భావిస్తున్నారు. బీఎస్ఎన్ఎల్ ఖర్చులో ఉద్యోగుల వేతనమే 75 శాతంగా ఉండగా, ఎంటీఎన్ఎల్లో అయితే ఏకంగా 87 శాతం ఉంది. ప్రభుత్వం ప్రకటించిన వీఆర్ఎస్ స్కీంకు రెండు కంపెనీల్లో లక్ష మందికి పైగా అర్హులు ఉన్నారు.


Click it and Unblock the Notifications