US Recession: మాంద్యంలోకి అమెరికా..? కన్ఫమ్ చేసిన టాప్ బాండ్ మార్కెట్ ఇండికేటర్.. భారత్ పరిస్థితి..?
US Recession: బాండ్ మార్కెట్ సూచీ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మళ్లీ 2007 స్థాయికి సూచీ చేరటంతో మాంద్యం ముంచుకొస్తుందని సూచిస్తోంది. యూఎస్ ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే ఎక్కువగా 40 సంవత్సరాల గరిష్ఠాలకు చేరుకుంది. ఫెడ్ కీలక వడ్డీ రేట్లను ఈ నెలాఖరులో 100 బేసిస్ పాయింట్లు పెంచవచ్చని తెలుస్తోంది. ఇదే గనక జరిగినట్లయితే US ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటుంది. U.S వినియోగదారుల ధరల సూచీ 9.1 శాతానికి పెరిగింది. దీంతో అమెరికన్ డాలర్ మరింత పుంజుకుంటోంది. ఈ ఆందోళనలు ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
వడ్డీ రేట్ల పెంపు తప్పదా..?
మాంద్యం భయాలు డాలర్కు మద్దతు ఇస్తాయని ఆస్ట్రేలియా ఎనలిస్ట్ క్రిస్టినా క్లిఫ్టన్ వెల్లడించారు. మరో పక్క ద్రవ్యోల్బణం అదుపులోకి రాకుండా మరింత పెరిగినట్లయితే ఫెడ్ తన వడ్డీ రేట్ల పెంపును మరింతగా ముందుకు తీసుకెళుతుందిని నిపుణులు అంటున్నారు. చికాగో మర్కంటైల్ ఎక్స్ఛేంజ్ కూడా వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని హెచ్చరిస్తోంది.
2007 తరువాత మళ్లీ..
పెరుగుతున్న ట్రెజరీ ఈల్డ్స్ కారణంగా రెండు దశాబ్దాల తరువాత ఒక డాలర్ విలువ ఒక యూరోకు సమానమైంది. స్వల్పకాలిక వడ్డీ రేటు అంచనాలను ప్రతిబింబించే US 2 సంవత్సరాల బాండ్ ఈల్డ్స్ 3.121 శాతానికి పెరిగాయి. దీర్ఘకాలిక బెంచ్మార్క్ అయిన 10 సంవత్సరాల బాండ్ ఈల్డ్స్ 2.9558 వద్ద ఉంది. ఇన్వర్టెడ్ ఈల్డ్ కర్వ్ ఎల్లప్పుడూ ఆర్థిక మాంద్యాన్ని సూచిస్తుంది.
ఇన్వర్టెడ్ ఈల్డ్ కర్వ్ అంటే ఏమిటి..?
దీర్ఘకాలిక బాండ్ల దిగుబడులు, స్వల్పకాలిక బాండ్ల దిగుబడి కంటే తక్కువగా ఉండటాన్ని ఇన్వర్టెడ్ ఈల్డ్ కర్వ్ అని పిలుస్తారు. దీనిని నెగటివ్ ఈల్డ్ అని అంటారు. ఇలా ఈల్డ్ కర్వ్ ఇన్వెర్ట్ కావటాన్ని మాంద్యానికి ముందు సంకేతంగా ఆర్థిక నిపుణులు పరిగణిస్తారు. ఇది ఒక ముందస్తు హెచ్చరిక లాంటిది. ప్రస్తుతం ఇది పునరావృతం కావటంతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. 2007లో చివరిసారిగా బాండ్ ఈల్డ్ కర్వ్ ఇన్వెర్ట్ అయింది.
ఆసియా దేశాలపై మాంద్యం ప్రభావం..
USలో మాంద్యం వల్ల ఆసియా ఎగుమతులకు గిరాకీ తగ్గుతుంది. మాంద్యం కారణంగా ముందస్తు చర్యల్లో భాగంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వర్ధమాన మార్కెట్ల నుంచి వెనక్కు తరలిస్తాయి. ప్రస్తుతం భారత్ నుంచి ఎఫ్ఐఐలు తమ పెట్టుబడులు వెనక్కు తీసుకోవటం కూడా దీనినే సూచిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే క్రమంలో దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంపు ఒత్తడిని, కరెన్సీ విలువ కోల్పోకుండా నివరించటానికి చర్యలు చేపట్టేలా చేస్తుందని UBPలో సీనియర్ ఆర్థికవేత్త అయిన కార్లోస్ కాసనోవా రాయిటర్స్ వార్తా సంస్థకు వెల్లడించారు.