COVID 19: కొంటే ఇప్పుడే కొనాలి... ఐటీ దిగ్గజాల మనోగతం!
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచమంతా అతలాకుతలం అవుతోంది. అగ్ర రాజ్యం అమెరికా అయితే చిగురుటాకులా వణికిపోతోంది. ఈ మహమ్మారి వైరస్ దెబ్బకు అన్ని రంగాలు కుదేలైపోతున్నాయి. ఉద్యోగులు ఉపాధి కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. చాలా కంపెనీల షేర్లు పాతాళానికి పతనం అవుతున్నాయి. దీంతో ఆయా కంపెనీల విలువ పడిపోతోంది. ఇది ఏ రంగానికైనా... ఏ కంపెనీకైనా ఇబ్బందికరమైన వాతావరణమే. ఎందుకంటే పెద్ద చేపలు, చిన్న చేపలను తినేయటానికి ఇదే సరైన సమయం. పెద్ద కంపెనీల వద్ద భారీ స్థాయిలో నగదు నిల్వలు ఉంటాయి. కాబట్టి, తమకు భవిష్యత్ లో బాగా పనికొస్తుందనుకున్న కంపెనీలను తక్కువ ధరకే చేజిక్కించుకోవడానికి ఇదే సరైన సమయం. సరిగ్గా ఈ ఫిలాసఫీ ని ఫాలో అయ్యేందుకు మన దేశ ఐటీ దిగ్గజాలు సిద్ధమవుతున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రో వంటి బడా సాఫ్ట్ వేర్ కంపెనీలు ఈ మేరకు పావులు కదుపుతున్నాయి. వాటి వద్దనున్న నగదు నిల్వలతో మంచి పనితీరు కనబరుస్తున్న పోటీ కంపెనీలను కొనుగోలు చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి.
13 బిలియన్ డాలర్లు...
మన దేశానికే తలమానికం ఐన ఈ మూడు ఐటీ రంగ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో కంపెనీలు చాలా కాలంగా మెరుగైన లాభాలు ఆర్జిస్తున్నాయి. అన్ని రకాల సంక్షోభాలను ఎదుర్కొని ధృడంగా నిలబడ్డాయి. కొంత కాలంగా ఈ కంపెనీల వద్ద పెద్ద మొత్తంలో నగదు నిల్వలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం వాటి వద్ద ఉన్న నగదు నిల్వల విలువ 13 బిలియన్ డాలర్లు (రూ 97,500 కోట్లు) ఉంటుందని అంచనా. అందుకే, ఈ నిధులను సద్వినియోగం చేసుకునేందుకు దిగ్గజ కంపెనీలు వేగంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. స్టాక్ మార్కెట్లో కంపెనీల విలువ పతనం అవుతుండటంతో పోటీ కంపెనీల కొనుగోలు ఇప్పుడు సులువు అవుతుంది. కనీసం 30-40% తక్కువ ధరకే కంపెనీలను చేజిక్కించుకునే అవకాశం లభిస్తుంది. ఒక కంపెనీని కొనుగోలు చేయాలంటే ఇంతకంటే మంచి తరుణం ఇంకేం ఉంటుందన్నది వీటి ఆలోచనగా కనిపిస్తోంది.
TCS వినూత్న ప్రయోగం: విప్రో, ఇన్ఫోసిస్ ఆ దారిలో నడవకుంటే ప్రయోజనాలు కోల్పోతారు!
సంక్షోభంలోనే కొనుగోళ్లు...
ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్నప్పుడే టీసీఎస్ కొనుగోళ్లు, వినీలను అధికంగా నిర్వహించిందని, మార్కెట్లో ఎవరూ కొనుగోలు చేయనప్పుడే ఆ పని చేయటానికి సరైన సమయం అని టీసీఎస్ సీఈఓ రాజేష్ గోపీనాథన్ అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో తాము కొనుగోళ్లు చేసేందుకు ఏమీ సిగ్గుపడమని ఇన్వెస్టర్ల తో సాగిన ఒక కాన్ కాల్ లో అయన పేర్కొన్నారు. 2008-09 సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో తాము సిటీ బ్యాంకు ఇండియా క్యాప్టివ్ విభాగాన్ని 500 మిలియన్ డాలర్ల కు కొనుగోలు చేసినట్లు అయన గుర్తు చేశారు. దాంతోనే తాము అదే సంస్థ నుంచి 2.5 బిలియన్ డాలర్ల కాంట్రాక్టు ను పొందినట్లు వివరించారు. బ్రిడ్జి పాయింట్, డబ్ల్యూ 12, జనరల్ మోటార్స్ కు చెందిన ఇండియా లోని టెక్నికల్ సెంటర్ ను కూడా గతం లో టీసీఎస్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
అదే దారిలో...
ప్రస్తుతం టీసీఎస్ వద్ద అత్యధికంగా 5.9 బిలియన్ డాలర్ల నగదు నిల్వలు ఉన్నాయి. ఇన్ఫోసిస్ వద్ద 3.6 బిలియన్ డాలర్లు, విప్రో వద్ద 3.5 బిలియన్ డాలర్ల నగదు నిల్వలు ఉన్నాయి. కాబట్టి, కొనుగోళ్లు, విలీనాల విషయంలో ఇన్ఫోసిస్, విప్రో కూడా టీసీఎస్ బాటనే అనుసరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విప్రో చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ జతిన్ దలాల్ కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సరైన, అందుబాటు ధరలో లభించే కంపెనీల కొనుగోళ్ళకు ఇదే అసలైన సమయం అని అయన చెప్పారు. నగదు నిల్వలల్తో సంబంధం లేకుండా ఈ ప్రక్రియను చేపట్టాలని అన్నారు. తాము కూడా సరైన అవకాశం లభిస్తే ముందుకు వెళ్లేందుకు సిద్ధంగానే ఉన్నామని, ఈ సమయంలో అన్నిటికీ సిద్ధంగా ఉన్నామని ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ వెల్లడించారు. దీంతో ఈ మూడు ఐటీ దిగ్గజాలు కంపెనీల కొనుగోళ్ల వేటలో నిమగ్నమయ్యాని స్పష్టమవుతోంది.