జుకర్బర్గ్కు షాక్, ఫేస్బుక్కు 5 లక్షల కోట్ల భారీ దెబ్బ: ప్రకటనలు నిలిపేసిన భారీ కంపెనీలివే
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్లో ప్రకటనలను బహిష్కరిస్తున్న కంపెనీల సంస్థ క్రమంగా పెరుగుతోంది. తమ లాభాల కోసం విద్వేషపూరిత సమాచారాన్ని ఉపేక్షిస్తున్న సోషల్ మీడియా వైఖరికి నిరసనగా స్టాప్ హేట్ ఫర్ ప్రాఫిట్ (stop hate for profit) పేరుతో ఈ నెల ప్రారంభంలో ఉద్యమం మొదలైంది. ఇందులో భాగంగా అమెరికాకి చెందిన వందలాది దిగ్గజ కంపెనీలు ఫేస్బుక్కు ప్రకటనలు ఇవ్వడం మానేశాయి. ఫేస్బుక్ను బహిష్కరించాయి.
ఫేస్బుక్కు కంపెనీలు 'యాడ్ బహిష్కరణ', రూ.53వేల కోట్ల నష్టపోయిన మార్క్ జుకర్బర్గ్
ఈ కంపెనీలు ప్రకటనలు నిలిపేశాయి
ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఉద్యమకారులు చెబుతున్నారు. తమతో చేతులు కలపాలని యూరోప్లోని అన్ని పెద్ద సంస్థలను కోరుతున్నారు. దీని ప్రభావం ఫేస్బుక్ పైన తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు. ఆర్క్టెరిక్స్, బెన్ అండ్ జెర్రీస్, బీమ్ సన్టోరీ, కోకాకోలా, డ్యాష్లేన్, ఎడ్డీ బ్యూర్, ఐలీన్ ఫిషర్, హెర్షీస్, హోండా, జాన్స్పోర్ట్, లెవీ స్ట్రాస్, మంగోలియా పిక్చర్స్, పాటాగోనియా, ది నార్త్ ఫేస్, ఆర్ఈఐ, అప్ వర్క్, యూనీలీవర్, వెరిజోన్, స్టార్బక్స్ తదితర సంస్థలు ప్రకటనలు నిలిపివేశాయి. ఈ ప్రకటనల నిలిపివేత ఖర్చు 72 బిలియన్ డాలర్లు.
నెల నుండి ఏడాది పాటు ప్రకటనలకు నో
పేస్బుక్కు ప్రతి ఏడాది ప్రకటనల ద్వారా రూ.ఐదున్నర లక్షల కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. ఇందులో పెద్ద పెద్ద కంపెనీల ఆదాయమే ఎక్కువ. ఇప్పుడు ఆ కంపెనీలు ప్రకటనలు నిలిపివేశాయి. దీంతో పెద్ద సంస్థల నుండి వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోతోంది. ఈ సంవత్సరానికి ప్రకటనలు ఇచ్చేది లేదని యూనీలీవర్ సహా వివిధ కంపెనీలు ప్రకటించాయి. ఒక నెల నుండి ఆరు నెలలకు కొన్ని సంస్థలు పక్కన పెట్టాయి. అయితే విద్వేషపూరిత, అసత్య ప్రచారాన్ని అరికట్టడంలో ఆ సంస్థ విధానాలపై ఇటీవల అసంతృప్తి వెల్లువెత్తుతోంది.
ఫేస్బుక్ మార్కెట్ క్యాప్ తగ్గింది
కొద్ది రోజులుగా ప్రకటనలు నిలిచిపోవడంతో మార్కెట్ క్యాప్ తగ్గింది. అలాగే సంస్థ అధినేత మార్క్ జుకర్ బర్గ్ సంపద 82 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఆయన ప్రపంచ కుబేరుల స్థానంలో నాలుగో స్థానానికి పడిపోయారు. ఈ ఉద్యమం సెగ ఇతర సోషల్ మీడియాలపై ప్రభావం పడే అవకాశముంది. యూనీలీవర్... ఫేస్బుక్, ట్విట్టర్ వంటి వాటికి ప్రకటనలు నిలిపివేసింది. అయితే వర్ణ వివక్ష, విద్వేషంతో కూడిన వ్యాఖ్యలు నిలువరించేందుకు చర్యలు తీసుకుంటామని జుకర్ బర్గ్ తెలిపారు. తాను ప్రకటించే విధానాల్లో రాజకీయ నాయకులకు కూడా మినహాయింపు ఉండదన్నారు.
ఫ్లాయిడ్ మృతి
అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ మృతి అనంతరం సోషల్ మీడియాలో అవాంఛిత, విద్వేష సమాచారానికి వ్యతిరేకంగా మానవ హక్కుల సంఘాలు ఉద్యమం ప్రారంభించాయి. అయితే ఫేస్బుక్ తాత్కాలిక హామీలు కాకుండా సమగ్ర విధానం ప్రకటించాలని డిమాండ్ చేశాయి. ప్రమాదకర ప్రకటనల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడం ఆపివేయాలని డిమాండ్ చేశాయి. ఇందుకు stop hate for profit ఉద్యమాన్ని ప్రారంభించాయి.