2022లో ఉద్యోగం మారిపోవాలి, 82% ఉద్యోగులది ఇదే అభిప్రాయం
కరోనా క్లిష్ట కాలంలోను భారత ఉద్యోగులు ఎక్కువమంది భవిష్యత్తుపై ఆశాభావంతో ఉన్నారు. వృత్తి నిపుణుల్లో 82 శాతం మంది వరకు ఈ ఏడాది (2022) ఉద్యోగం మారాలని భావిస్తున్నారు. ఈ మేరకు లింక్డిన్ తాజా సర్వేలో వెల్లడైంది. కరోనా మహమ్మారి సంక్షోభం ఉద్యోగులను తమ కెరీర్ పైన పునరాలోచనలో పడేయడంతో పాటు తమ జీవిత నూతన లక్ష్యాలు, ప్రాధాన్యతలకు తగిన కొత్త ఉద్యోగాలు వెతుక్కునే దిశగా పురికొల్పిందని, కొత్త అవకాశాలపై ధీమా పెరగడంతో ఉద్యోగుల వలసలు ఊపందుకున్నాయని, మంచి నైపుణ్యం కలిగినవారు మరింత సౌకర్యవంతమైన ఉద్యోగ అన్వేషణలో ఉన్నారని లింక్డిన్ న్యూస్ భారత విభాగ మేనేజింగ్ ఎడిటర్ అంకిత్ వెంగుర్లేకర్ అన్నారు.
82 శాతం మంది మారే ఆలోచన
ఆన్లైన్ ప్రొఫెషనల్ నెట్ వర్కింగ్ సెట్, లింక్డిన్ తన తాజా పరిశోధనలో భారత వర్క్ ఫోర్స్ తమ భవిష్యత్తుపై ఆశాజనకంగా ఉన్నట్లు వెల్లడైనట్లు తెలిపింది. ఇందులో భాగంగా 82 శాతం మంది ఉద్యోగాలు మారాలని నిర్ణయించుకున్నారని ఈ సర్వేలో వెల్లడైంది. 86 శాతం మంది నిపుణులు తమ వృత్తిపరమైన నెట్ వర్క్ బలం గురించి పూర్తి విశ్వాసంతో ఉన్నారు. వారు కొత్త ఏడాదిలో ఉద్యోగ అవకాశాల కోసం వెతుకుతున్నారు. 2022లో ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తుందని, కెరీర్ బాగుంటుందని పూర్తి నమ్మకంతో ఉన్నారు. కరోనా నేపథ్యంలో దేశంలో నిరుద్యోగిత రేటు డిసెంబర్ నెలలో 8 శాతంగా నమోదయింది. 2020, 2021లో కంటే ఎక్కువగా ఉంది.
ఎవరు ఎంత శాతం
ఇక, ఉద్యోగం మారేందుకు ఆసక్తి చూపేవారిలో ఏడాది ఉద్యోగ అనుభవం కలిగిన వారు 94 శాతం మంది, జెన్ జెడ్ ప్రొఫెషనల్స్ 87 శాతం మంది 2022లో ఉద్యోగం మారేందుకు ఆసక్తి చూపుతున్నారు. లింక్డిన్ డేటా ప్రకారం 2021 ఏప్రిల్ నెలలో మూడింట రెండొంతుల మంది తమ ఉద్యోగాలను విడిచిపెట్టారు లేదా విడిచిపెట్టాలని పరిశీలిస్తున్నారు. లింక్డిన్ తాజా నివేదిక దేశంలోని 1111 వృత్తి నిపుణుల నుండి అభిప్రాయాలు సేకరించింది.
అందుకే మార్పు
పని-వ్యక్తిగత జీవిత సమతుల్యత లోపించిందని, అందుకే ప్రస్తుత ఉద్యోగం మారాలని భావిస్తున్నట్లు 38 శాతం మహిళలు, 28 శాతం పురుషులు తెలిపారు. ఈ కారణంగా ఉద్యోగం మారే అవకాశం ఉన్న వారిలో మహిళలే 1.3 రెట్లు అధికం. మెరుగైన వేతనం లభిస్తే ప్రస్తుత కొలువులో కొనసాగుతామని 49 శాతం మహిళా ఉద్యోగినులు చెప్పగా, పురుషుల్లో ఈ వాటా 39 శాతంగా ఉంది.
కరోనా జాబ్ మార్కెట్ పైన గణనీయమైన ప్రభావం చూపిందని, ఉద్యోగులు కొత్త ప్రాధాన్యాలను నిర్దేశించుకునే దిశగా పురికొల్పిందని మరో జాబ్ పోర్టల్ ఇండీడ్ సర్వే నివేదిక వెల్లడించింది. 71 శాతం మంది ఉద్యోగులు కేరీర్ పైన పునరాలోచన చేస్తున్నారు.