TCS వినూత్న ప్రయోగం: విప్రో, ఇన్ఫోసిస్ ఆ దారిలో నడవకుంటే ప్రయోజనాలు కోల్పోతారు!
కరోనా మహమ్మారి కారణంగా ఐటీ కంపెనీలు అన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. ఐటీ దిగ్గజాలు టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు కరోనా-లాక్ డౌన్ అనంతరం కూడా తమ ఉద్యోగుల్లో ఎక్కువ మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం ద్వారా ఖర్చులు తగ్గించుకోవచ్చునని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీసీఎస్ అనూహ్య నిర్ణయం తీసేసుకుంది.
కరోనా తర్వాత... TCS, విప్రో సరికొత్త ఆదాయ 'ఆదా' మార్గం, పర్మిషన్ అవసరం!
20 శాతం నుండి 75 శాతానికి పెంపు
కరోనా తర్వాత ఉద్యోగులలో 75% మంది ఇంటి నుండి పని చేసేలా చర్యలు తీసుకుంటోంది. కంపెనీలో 4.5 లక్షల మంది ఉన్నారు. ఇందులో ఇండియాలో ఉద్యోగుల సంఖ్య 3.5 లక్షలమంది. ఇందులో సగటున ప్రతిరోజు 20 శాతం మంది ఇంటి నుండే విధులు నిర్వహిస్తారు. 2025 నాటికి దీనిని 75 శాతానికి పెంచాలని టీసీఎస్ లక్ష్యంగా పెట్టుకుంది.
100 శాతం పని రాబట్టాలంటే
100 శాతం పనితీరు రాబట్టాలంటే కార్యాలయాల్లో 25 శాతం కంటే ఎక్కువ ఉద్యోగులు అవసరమని తాము భావించడం లేదని ఇటీవల టీసీఎస్ సీవోవో సుబ్రమణియమ్ అన్నారు. కొత్త విధానంలో ప్రతి ఉద్యోగి కేవలం 25 శాతమే కార్యాలయంలో పని చేయాల్సి ఉంటుందని, అన్ని గ్రూప్స్కు ఇది వర్తిస్తుందని చెప్పారు. లాక్ డౌన్ అనంతరం టీసీఎస్లోని 4.5 లక్షల మంది ఉద్యోగుల్లో 90 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు.
ఖర్చులు చాలా వరకు తగ్గుదల
ప్రస్తుత తరుణంలో టీసీఎస్ వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం సెక్యూర్ బోర్డర్లెస్ వర్క్ స్పేస్ (SBWS)ను ఉపయోగించుకుంటోంది. టీసీఎస్ సీఈవో, ఎండీ రాజేష్ గోపినాథన్ ఇటీవల ఉద్యోగులకు ఓ లేఖ రాశారు. SBWS ద్వారా 35,000 మీటింగ్స్, 40,6000 కాల్స్, 340 లక్షల సందేశాలు ఈ డిజిటల్ సహకార ప్లాట్ ఫాం ద్వారా జరిగాయన్నారు. ఆఫీస్లో 25 శాతం సమయం మాత్రమే ఉండవచ్చునని, మేం బలంగా ముందుకు వచ్చామని, తమ విధానం గతం కన్నా ఎంతో మెరుగైనదిగా నిరూపితమైందని, ఉద్యోగులు ఇంటి నుండి పని చేయడం ద్వారా ఖర్చులు చాలా వరకు తగ్గుతాయన్నారు.
25 శాతం మంది ఉద్యోగులు తగ్గితే ఎంత ఆదా
అనరాక్ కన్సల్టింగ్ సీనియర్ డైరెక్టర్ అశుతోష్ లిమాయే ప్రకారం ఏదైనా ఆఫీస్లో 25 శాతం ఉద్యోగులు తగ్గితే (అంటే ఆ మేరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే) ఖర్చులు 15 శాతం వరకు తగ్గవచ్చునని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే కామన్ ఏరియా లేదా సౌకర్యాల పరంగా మరీ అంత తక్కువ కాకపోవచ్చునని చెబుతున్నారు.
టీసీఎస్ దారిలో ఇతర ఐటీ సంస్థలు
టీసీఎస్ ఈ మార్గాన్ని ఎంచుకుంటే ఇతర ఐటీ దిగ్గజాలు కూడా ఇదే మార్గంలో నడిచే అవకాశాలు పయనిస్తాయని ఐటీ నిపుణులు అంటున్నారు. ఇది ఐటీ సంస్థల ఆపరేటింగ్లో భారీ మార్పులకు కారణం కానుందని అంటున్నారు. టీసీఎస్ దారిలో విప్రో, ఇన్ఫోసిస్ పయనించవచ్చునని లేదంటే ఈ పోటీ ప్రపంచంలో హ్యూమన్ క్యాపిటల్ కోల్పోతారని, ఖర్చులు తగ్గించుకునే అవకాశం కోల్పోతారని అంటున్నారు.