కొత్త ఆదాయపు పన్ను స్లాబ్లోకి వచ్చేందుకే 70% మంది మొగ్గు
బడ్జెట్లో ప్రవేశపెట్టిన కొత్త ఆదాయ పన్ను విధానానికి ట్యాక్స్ పేయర్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. వ్యక్తిగత ఐటీ చెల్లింపుదార్లలో 80 శాతం మంది, పన్ను మినహాయింపులు, తగ్గింపులు లేని కొత్త విధానానికి మారే అవకాశముందని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే అన్నారు.
కొత్త ఆదాయపు పన్ను: శాలరైడ్కు ఆప్షన్, వ్యాపారం ఉంటే మాత్రం
ప్రయోజనాలు లేకపోయినప్పటికీ..
పెట్టుబడుల మినహాయింపులు, తగ్గింపులు వంటి ప్రయోజనాలు లేకపోయినప్పటికీ కొత్త విధానంలో పన్ను చెల్లింపు తక్కువగా ఉంటుందని తెలిపారు. పేపర్ వర్క్ కూడా పెద్దగా ఉండదని తెలిపారు. దీంతో ఎక్కువ మంది కొత్త స్లాబ్ విధానానికి మారే అవకాశముందన్నారు. కొత్త విధానంతో దేశంలో ఆదాయ పన్ను చెల్లిస్తున్న 5.78 కోట్ల మందిలో 69% మందికి పన్నుల భారం తగ్గుతుందని తమ పరిశీలనలో తేలిందన్నారు.
69 శాతం మంది కొత్త పన్ను విధానంలోకి..
మొత్తం ట్యాక్స్ పేయర్స్లలో 69 శాతం మంది ఏ ప్రయోజనాలులేని కొత్త ట్యాక్స్ విధానంలో పన్ను చెల్లింపు తక్కువగా ఉండటంతో అటువైపు వెళ్తారని, 11 శాతం మాత్రమే పాత పన్ను విధానానికి అనుకూలంగా ఉన్నారని తమ పరిశీలనలో తేలిందన్నారు. మరో 20 శాతం మంది పేపర్ వర్క్ తగ్గడం కోరుకుంటారని, అలాంటి వారిలో కొంతమంది కొత్త విధానంలోకి వస్తారన్నారు.
కార్పోరేట్ ట్యాక్స్ వలె...
కొత్త ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ట్యాక్స్ పేయర్స్కు ఎంచుకునే వెసులుబాటు కల్పించినట్లు చెప్పారు. కార్పోరేట్లకు కూడా ఇలాగే ఆప్షన్ ఇచ్చినట్లు చెప్పారు. గత ఏడాది సెప్టెంబర్లో కార్పోరేట్ ట్యాక్స్ తగ్గించారు. అయితే అదనపు ప్రయోజనాలు పక్కన పెడితేనే ఈ ట్యాక్స్ వర్తిస్తుంది. అయితే మినహాయింపులతో కూడిన 30 శాతం ట్యాక్స్ కంటే మినహాయింపులు లేని 22 శాతం ట్యాక్స్ పరిధిని చాలామంది ఎంచుకున్నారు.