పీపీపీ భాగస్వామ్యంలో 6 ఎయిర్ పోర్టులకు వేలం
విమానయాన రంగంలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో భాగంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం (మే 16) 8 రంగాలకు ప్యాకేజీ ప్రకటించారు. ఇందులో భాగంగా ఏరోస్పేస్ రూట్ల హేతుబద్ధీకరణపై ప్రకటన చేశారు. దేశంలో రూ.13వేల కోట్లతో 12 కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి కేంద్రం నిర్ణయించిందని చెప్పారు. పీపీపీ భాగస్వామ్యంతో మరో ఆరు విమానాశ్రయాలు వేలం వేయనున్నామని చెప్పారు. భారతీయ ఏరో స్పేస్ రూట్లు హేతుబద్దీకరణ జరుగుతుందన్నారు.
5 లక్షల ఎకరాలు సిద్ధం, ప్రజల జేబుల్లోకి నేరుగా నగదు: నిర్మల సీతారామన్
విమానాశ్రయాల అభివృద్ధికి ఏఏఐకి రూ.2,300 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. విమాన మరమ్మత్తుల హబ్గా భారత్ను తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ఎంఆర్ఓ హబ్లలో మన, విదేశీ విమానాలకు మరమ్మత్తులు ఉంటాయన్నారు. ఈ హబ్స్లలో ప్రయాణీకుల, యుద్ధ విమానాలకు మరమ్మత్తులు ఉంటాయన్నారు.
దేశంలో విద్యుత్ పంపిణీ సంస్థలు మనుగడ సాగించేలా కేంద్రం చర్యలు చేపడుతున్నట్లు నిర్మల తెలిపారు. ఉత్పత్తిదారులకు సకాలంలో చెల్లింపులు జరిపేలా డిస్కంలలో సంస్కరణలు తీసుకు వస్తున్నట్లు చెప్పారు. కేంద్రపాలిత ప్రాంతాల్లో డిస్కంలను ప్రయివేటీకరిస్తున్నట్లు చెప్పారు. నష్టాల ప్రభావం వినియోగదారులపై పడకుండా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.