5G టెక్నాలజీ సేఫ్, అదంతా తప్పుడు ప్రచారం: జూహీచావ్లాకు ఝలక్
5G టెక్నాలజీ పూర్తి సురక్షితమని, ఈ టెక్నాలజీ ఎవరి ఆరోగ్యం పైన కూడా ప్రభావం చూపదని, దీనిపై తప్పుడు ప్రచారం జరుగుతోందని సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(COAI) స్పష్టం చేసింది. దేశంలో 5G టెక్నాలజీ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో పలువురి నుండి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావం చూపుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో COAI స్పందించింది.
తప్పుడు ప్రచారం
5G టెక్నాలజీ ఎవరి ఆరోగ్యం పైనా ప్రభావం చూపదని, తప్పుడు ప్రచారం జరుగుతోందని COAI తెలిపింది. 5G టెక్నాలజీ పూర్తి సురక్షితమని చెప్పడానికి అన్ని రకాల ఆధారాలు ఉన్నాయని తెలిపింది. రాబోయే కాలంలో 5G గేమ్ ఛేంజర్గా మారుతుందని, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి విస్తృతమైన ప్రయోజనాలు కలుగుతాయని వెల్లడించింది. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి అతి పెద్ద టెలికాం సంస్థలు 5G టెక్నాలజీని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. భారత ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా ఈ సేవలను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. తక్కువ రేడియేషన్తో ఈ సేవలను తీసుకు వస్తాయి.
COAI డైరెక్టర్ ఏమన్నారంటే
5G విషయంలో అంతర్జాతీయంగా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ ప్రమాణాలతో పోలిస్తే పదో వంతు మాత్రమే ఉండేలా భారత్ నిబంధనలు విధించిందని, ప్రస్తుతం జరుగుతోన్న ప్రచారం తప్పుదోవ పట్టించేలా ఉందని, కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెస్తున్న ప్రతిసారి ఇలాంటి అసత్య ప్రచారాలు జరుగుతూంటాయని COAI డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచ్చర్ అభిప్రాయపడ్డారు.
వాటిని నమ్మవద్దు
5G టెక్నాలజీకి వ్యతిరేకంగా బాలీవుడ్ నటి జుహీచావ్లా పిటిషన్ వేశారు. దీనిని ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఇది కేవలం ప్రచారం కోసం వేసిన వ్యాజ్యమని ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. జుహీచావ్లా, మరికొందరికి రూ.20 లక్షల జరిమానా విధించింది. ఈ సందర్భంగా ఢిల్లీ కోర్టు తీర్పును COAI డైరెక్టర్ జనరల్ స్వాగతించారు. సామాజిక మాధ్యమాల వేదికగా 5G విషయంలో వచ్చే అసత్య సందేశాలను నమ్మొద్దన్నారు.