మారుతీ సుజుకీకి కారుపై లాభం కంటే డిస్కౌంట్ ఎక్కువ! కంపెనీ ఉద్యోగులకు భారీ ఊరట
కరోనా మహమ్మారి-లాక్ డౌన్ నేపథ్యంలో గత నెలలో ఆటో దిగ్గజం మారుతీ సుజుకీ సేల్స్ జీరోకు పడిపోయాయి. గత క్వార్టర్లో దశాబ్దాల్లోనే అత్యధిక క్షీణత నమోదు చేసింది. కాగా కంపెనీకి 5 బిలియన్ డాలర్ల క్యాష్ రిజర్వ్స్ వచ్చాయి. పెట్టుబడుల ద్వారా వచ్చిన ఫైనాన్షియల్ ఇన్కం... కంపెనీ ప్రధాన వ్యాపారం కార్ల తయారీ, అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా మించింది.
Covid 19: కోట్లాది ఉద్యోగాలు హుష్కాకి! భారత్ రికవరీ ఎలా ఉంటుందో తెలుసా?
డిస్కౌంట్ కంటే లాభమే తక్కువ
ఫైనాన్షియల్ ఇన్కం ద్వారా వచ్చే ఆదాయం 2019-20 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 50 శాతానికి సమీపంలో ఉంది. అంటే ఇది స్విఫ్డ్, డిజైర్ కార్ల తయారీ కోసం అవసరమైన రూ.3,776 కోట్ల కోర్ ఆపరేటింగ్ ప్రాఫిట్కు సమానం. క్వార్టర్ 4లో నాన్ఆపరేటింగ్ ఇన్కం ద్వారా వచ్చే ఆదాయం అంతకుముందు ఇదే క్వార్టర్తో పోలిస్తే 55 శాతంగా ఉంది. గత ఏఢాది మందగమనం కారణంగా భారీ డిస్కౌంట్లు ఇచ్చింది. దీంతో ఇచ్చిన డిస్కౌంట్ కంటే ఒక్కో కారు పైన వచ్చిన లాభం తక్కువగా ఉంది. మార్కెట్లో ఒత్తిడిని ఇది తెలియజేస్తుంది.
రూ.35,248 కోట్ల క్యాష్ రిజర్వ్స్
2019-20 ఆర్థిక సంవత్సరంలో వ్యాల్యూమ్ పరంగా కారు సేల్స్ 16 శాతం మేర తగ్గాయి. అదే సమయంలో కంపెనీ క్యాష్ రిజర్వ్స్ 500 మిలియన్ డాలర్లు లేదా రూ.4,000 కోట్లు పెరిగాయి. మొత్తం నగదు నిల్వలు రూ.35,248 కోట్లు. మారుతీ సుజుకీ మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఇది నాలుగో వంతు వరకు ఉంటుంది.
వాహనంపై ఆదాయం.. డిస్కౌంట్..
గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రిటర్న్స్ బాగున్నాయని సీఎఫ్ఓ అజయ్ సేథ్ అన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రిటర్న్స్ మార్క్ టు మార్కెట్ ఆధారంగా బాగున్నాయని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీరేటు తగ్గినందువల్ల ట్రెజరీ ఆదాయంపై ప్రభావం ఉండవచ్చునన్నారు. తమ పెట్టుబడులు అన్నీ AAA పత్రాలుగానే ఉన్నాయని, ఏది కూడా ప్రమాదకర రుణ సాధనాలలో లేదని కంపెనీ తెలిపింది. కంపెనీ లాభదాయకతపై మాత్రం ఒత్తిడి ఉంది. ఒక వాహనంపై ఎబిట్ రూ.18,827కు పడిపోయింది. ఇది కస్టమర్లకు ఇచ్చే డిస్కౌంట్ రూ.19,051 కంటే తక్కువ కావడం గమనార్హం. మార్చి క్వార్టర్లో మారుతీ సుజుకీ ఎబిట్ మార్జిన్స్ 4 శాతం పడిపోయాయి.
ఉద్యోగులకు సమస్య లేదు
కంపెనీకి పెద్ద ఎత్తున నిల్వలు ఉన్నందున ఉద్యోగులను తగ్గించాల్సిన అవసరం లేదు. అలాగే వేతనాలు తగ్గించే అవసరం లేదు. అంతేకాదు డీలర్లకు, విక్రయదారులకు సహకరిస్తుంది. ట్రెజరీ ఆదాయంపై రాబడి బాగున్నప్పటికీ, మార్కెట్ అనిశ్చితి మాత్రమే ఆందోళనకర అంశం. ప్యాసింజర్ మార్కెట్లో గత ఏడు క్వార్టర్లుగా మందగమనం కొనసాగుతోంది. ఇలా జరగడం 30 ఏళ్ళలో ఇదే మొదటిసారి. ఈ ఆర్థిక సంవత్సరంలో సేల్స్ మరో 25 శాతం నుండి 30 శాతం పడిపోతాయని అంచనా. వ్యాల్యూమ్ పరంగా మారుతీ సుజుకీ డొమెస్టిక్ సేల్స్ 1 మిలియన్ యూనిటల్ కంటే తగ్గి 2011 కనిష్టానికి పడిపోవచ్చునని అంచనా.
దీర్ఘకాలిక వృద్ధిపై ధీమా
దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలపై కంపెనీ ధీమాగా ఉందని మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ అన్నారు. అయితే ప్రస్తుతం సరఫరా, ఉత్పత్తి, డిమాండుకు సంబంధించిన అనిశ్చితులు కొనసాగుతున్నాయన్నారు. డిమాండ్ ఎప్పుడు కోలుకుంటుందో చెప్పలేమని, జీడీపీ 1.2 శాతం ఉన్నప్పుడు కారు వంటి సేల్స్ అంతగా ఉండవని చెప్పారు.