జీఎస్టీ పరిహారంపై కేంద్రం, రాష్ట్రాల మధ్య చిక్కుముడి-కౌన్సిల్ భేటీ వాయిదా....
కరోనా మహమ్మారి ప్రభావంతో తొలిసారిగా జీఎస్టీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం వాయిదాకు కారణమైంది. జీఎస్టీ పరిహారం బకాయిల చెల్లింపుపై రాష్ట ప్రభుత్వాలు కేంద్రాన్ని నిలదీస్తున్న నేపథ్యంలో కేంద్రం ఏకంగా జీఎస్టీ సమావేశాన్ని వాయిదా వేసి తాత్కాలికంగా ఊరట పొందింది.
కేంద్ర ప్రభుత్వం టార్గెట్, ఆ రంగంలోనే 5ఏళ్లలో 5కోట్ల ఉద్యోగాలు
వాస్తవానికి జీఎస్టీ కౌన్సిల్ 42వ సమావేశం ఈ నెల 19న జరగాల్సి ఉంది. కానీ కేంద్రం, రాష్ట్రాల మధ్య జీఎస్టీ పరిహారం చెల్లింపు విషయంలో తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ముఖ్యంగా కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతూ కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా చెప్పుకుంటున్నాయి. ఇదే కారణంతో జీఎస్టీ పరిహారం చెల్లింపును కేంద్రం వాయిదా వేస్తుండగా.. రాష్ట్రాలు ఇదే డిమాండ్తో కేంద్రాన్ని ఇరుకునపెడుతున్నాయి. ఈ ఏడాది తమకు 2.34 లక్షల కోట్ల పరిహారం బకాయి చెల్లించాల్సిందేనని విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు గట్టిగా పట్టుబట్టాయి. దీంతో కేంద్రం ఇరుకునపడింది.
సెప్టెంబర్ 19న జరగాల్సిన జీఎస్టీ కౌన్సిల్ భేటీకి ముందే రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో భేటీ జరిగితే ఎలాంటి పరిస్ధితి ఎదుర్కోవాల్సి వస్తుందో అన్న భయంతో కేంద్రం దీన్ని అక్టోబర్ మొదటి వారానికి వాయిదా వేసింది. కానీ రాష్ట్రాల వ్యతిరేకత నేపథ్యంలో ఈ విషయాన్ని బయటికి చెప్పకుండా పార్లమెంటు సమావేశాల పేరుతో కేంద్రం దీన్ని వాయిదా వేసేసింది. జీఎస్టీ పరిహారం చెల్లింపు కోసం కేంద్రం ప్రతిపాదిస్తున్న రెండు ఆప్షన్లనూ విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి.
ఇందులో కేరళ, పంజాబ్, పాండిచ్చేరి, తమిళనాడు, ఢిల్లీ, ఛత్తీస్ ఘడ్ ఉన్నాయి. ఇవి కాకుండా మధ్యప్రదేశ్, గుజరాజ్, బీహార్, కర్నాటక, త్రిపుర, గోవా మాత్రం 97 వేల కోట్ల మొత్తాన్ని అప్పుగా తీసుకునేందుకు సిద్దమయ్యాయి. ఈశాన్య రాష్ట్రాలైన సిక్కిం, మణిపూర్ మాత్రం రూ. 2.35 లక్షల కోట్లు అప్పులు స్వీకరించే రెండో ఆప్షన్కు సై అన్నాయి. ఏపీ, తెలంగాణ వంటి మరికొన్ని రాష్ట్రాలు మౌనంగా ఉన్నాయి.