ఏప్రిల్ నెలలో 34 లక్షల మంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోయారు
కరోనా ఫస్ట్ వేవే నుండి భారత్ కోలుకోకముందే, సెకండ్ వేవ్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది (2020) మార్చిలో కరోనా ప్రారంభమైనప్పటి నుండి చాలామంది ఉద్యోగాలు పోయాయి. మరెంతో మందికి వేతనాల్లో కోత విధించారు. కరోనా నుండి భారత్ తేరుకుంటున్న సమయంలో సెకండ్ వేవ్ మరోసారి ముంచేసింది. సెకండ్ వేవ్ నేపథ్యంలో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ నిలబడేందుకు ఎంతో ఇబ్బందులు పడుతున్నాయి. డిమాండ్ లేక ఉద్యోగులను తొలగించాల్సిన పరిస్థితి. దీంతో దేశవ్యాప్తంగా గత నెల అంటే ఏప్రిల్ నెలలో 34 లక్షల మంది శాలరైడ్ భారతీయులు ఉద్యోగాలు కోల్పోయారు.
పెరిగిన నిరుద్యోగిత రేటు
ప్రయివేటు రీసెర్చ్ గ్రూప్ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(CMIE) ప్రకారం మొత్తంగా 73.5 లక్షలమంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో ఏప్రిల్ నెలలో నిరుద్యోగిత రేటు 6.5 శాతం నుండి 7.97 శాతానికి పెరిగింది. కరోనా లాక్ డౌన్, ఆర్థిక రికవరీ నెమ్మదించడం స్మాల్ ఎంటర్ప్రైజెస్ పైన భారీగా ప్రభావం చూపిందని CMIE మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ వ్యాస్ అన్నారు. గత ఏడాది ఆర్థిక వ్యవస్థపై కరోనా భారీ ప్రభావం చూపిందని, దీని నుండి పూర్తిగా కోలుకోకముందే సెకండ్ వేవ్ ఉపద్రవం వచ్చి పడిందన్నారు.
ఇలా క్షీణించిన ఉద్యోగాలు
ఆర్థిక రికవరీ చాలావేగంగా పెరిగితే తప్ప ఈ సంస్థలు మనగుడ సాధించలేవని మహేష్ వ్యాస్ అన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అప్పుడే రికవరీ ఆశాజనకంగా కనిపించడం లేదన్నారు. డిసెంబర్ 2020 చివరి నాటికి భారత్లో 38.877 కోట్ల ఉద్యోగులు ఉన్నారు. సంఘటిత, అసంఘటిత రంగంలో కలిపి ఈ సంఖ్య ఉంది. జవరి చివరి నాటికి ఈ సంఖ్య 40.07 కోట్లు కాగా, ఫిబ్రవరి చివరి నాటికి 39.821 కోట్లు, మార్చి చివరి నాటికి 39.079 కోట్లకు తగ్గింది.
గ్రామీణ ఉద్యోగాలు
ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో 28.4 లక్షల శాలరైడ్ ఉద్యోగాలు పోయాయి. 5.6 లక్షల ఉద్యోగాలు నగరాల్లో పోయాయి. దీంతో మార్చిలో 4.6 కోట్లుగా ఉన్న శాలరైడ్ ఉద్యోగులు ఏప్రిల్ చివరి నాటికి 4.544 కోట్లుగా ఉన్నారు గ్రామీణ శాలరైడ్ ఉద్యోగులు ఫిబ్రవరిలో 3.324 కోట్లు కాగా, మార్చి నాటికి 3.072 కోట్లకు పడిపోయారు. ఏప్రిల్ నాటికి మరింత తగ్గి 2.788 కోట్లుగా నమోదయింది.