కరోనా కష్టకాలంలో ఆదుకుంటున్న ఈపీఎఫ్ ... నాలుగు నెలల్లో ఎంత డబ్బు విత్ డ్రా చేశారో తెలుసా !!
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి బీభత్సం సృష్టిస్తోంది . సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవితాల్లో ఆరోగ్య సంక్షోభాన్ని మాత్రమే కాకుండా ఆర్థిక సంక్షోభాన్ని కూడా సృష్టించి మధ్యతరగతి జీవితాలను అతలాకుతలం చేస్తుంది. ఈ సమయంలో ఉద్యోగుల భవిష్య నిధి నుండి చందాదారులు అవసరమైతే డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చని కేంద్రం ప్రకటించడంతో కరోనా కష్టకాలంలో ఈపీఎఫ్ఓ నుండి భారీగా నిధులను విత్ డ్రా చేస్తున్నారు చాలామంది ఉద్యోగులు.
కరోనా సంక్షోభంతో ప్రజల ఆర్ధిక ఇబ్బందులు
కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో పలువురు ఉద్యోగాలు కోల్పోయారు. కొందరికి కంపెనీలు ఇంకా జీతాలు చెల్లించలేదు. మరికొందరికి జీతాల్లో కోత విధించారు.ఈ పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి కరోనా సోకితే వారి కష్టాలు అంతా ఇంతా కాదు. అత్యవసర వైద్య ఖర్చుల కోసం కూడా తిప్పలు పడాల్సిన స్థితి . ఇటువంటి తప్పనిసరి పరిస్థితుల్లో చాలామంది ఉద్యోగులు తమ ఉద్యోగుల భవిష్య నిధి ఖాతా నుండి డబ్బులు విత్ డ్రా చేసుకుంటున్నారు .
ఈపీఎఫ్ఓ నుండి నగదు విత్ డ్రా చేసుకోవడానికి కేంద్రం వెసులుబాటు
ఉద్యోగుల భవిష్య నిధి పథకంలో మొత్తం ఆరు కోట్ల మంది చందాదారులు ఉన్నారు. ప్రావిడెంట్ ఫండ్ సంస్థ మొత్తం పది లక్షల కోట్ల నిధులను నిర్వహిస్తోంది. కరోనా నేపథ్యంలో ప్రజల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కేంద్రం అవసరమైన వారు ఈపీఎఫ్ఓ నుండి నగదు విత్ డ్రా చేసుకోవడానికి వెసులుబాటు కల్పించింది. తమ అకౌంట్లో ఉన్న మొత్తం లో 75 శాతం, లేదా తమ మూడు నెలల వేతనం, ఈ రెంటిలో ఏది తక్కువైతే అంత మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవడానికి కేంద్రం అనుమతించడంతో పెద్ద సంఖ్యలో చందాదారులు తమ డబ్బును విత్ డ్రా చేసుకున్నారు.
80 లక్షల మంది చందాదారులు 30 వేల కోట్ల నగదు విత్ డ్రా
ఏప్రిల్ ప్రారంభం నుండి ఇప్పటివరకు 80 లక్షల మంది చందాదారులు 30 వేల కోట్ల నగదు విత్ డ్రా చేసుకున్నారు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో, ప్రజల ఆర్థిక ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. నగదు ఉపసంహరణ చేసుకుంటున్న ప్రజల ట్రెండ్ చూస్తే భవిష్యత్తులో ఈపీఎఫ్ నుండి నగదు విత్ డ్రా చేసుకునే వారి సంఖ్య కోటికి చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రావిడెంట్ ఫండ్ ఆదాయాలపై ఎఫెక్ట్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రావిడెంట్ ఫండ్ ఆదాయాలపై ఈ పరిస్థితులు భారీ ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కరోనా కష్టకాలంలో ఈపీఎఫ్ నిధులు ప్రజల ఆర్థిక అవసరాలను తీరుస్తున్నాయి అని చెప్పడం నిర్వివాదాంశం.