కరోనా సెకండ్ వేవ్తో మరో అనిశ్చితి: నీతి అయోగ్ చైర్మన్ హెచ్చరిక
దేశంలో కొనసాగుతున్న కరోనా రెండో విడత ఉధృతి నేపథ్యంలో కస్టమర్లు, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ విషయంలో మరో అతిపెద్ద అనిశ్చితికి సిద్ధం కావాల్సిందేనని నీతి అయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ హెచ్చరించారు. పరిస్థితి గతంలో కంటే సంక్లిష్టంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఈ సంవత్సరం భారత వృద్ధి రేటు 11 శాతం ఉండగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్బీఐ కూడా 10.5 శాతం వృద్ధిరేటును అంచనా వేసిందని తెలిపారు. భారత్ కరోనాను ఓడించే దశలో ఉన్న దశలో యూకే సహా ఇతర దేశాల నుండి వచ్చిన కొత్త వైరస్ వేరియంట్ పరిస్థితిని చాలా సంక్లిష్టంగా మార్చిందని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో భారత్ పెద్ద అనిశ్చితికి సిద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాజీవ్ కుమార్ అన్నారు. అవసరమైన సమయంలో ప్రభుత్వం సరైన చర్యలతో ముందుకు వస్తుందన్నారు. ఆర్బీఐ కూడా స్పందిస్తోందన్నారు.
సేవల రంగం ప్రత్యక్షంగా ప్రభావితం కావడంతో పాటు ఇతర ఆర్థిక కార్యకలాపాలపై పరోక్ష ప్రభావం చూపవచ్చన్నారు. ఈ పరిస్థితిలో కొత్త ఉద్దీపనకు ఆస్కారం ఉందా అనే ప్రశ్నకు స్పందిస్తూ తాజా పరిస్థితికి సంబంధించిన ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాలను విశ్లేషించిన అనంతరం ఆర్థిక మంత్రిత్వ శాఖ దానికి సమాధానం చెబుతుందన్నారు. మనం ప్రస్తుత పరిస్థితుల్లో విధానపరమైన చర్యలు కొనసాగించనున్నట్టు ఆర్బీఐ ఇప్పటికే ప్రకటించిందన్నారు. అవసరం ఏర్పడినప్పుడు ప్రభుత్వం కూడా ఆర్థికపరమైన చర్యలను ప్రకటిస్తుందన్నారు.