వీజీ సిద్ధార్థ ఆత్మహత్య తర్వాత కాఫీడే రూ.2వేల కోట్లు మిస్! వందల కొద్ది ట్రాన్సాక్షన్స్
గత ఏడాది జూలైలో కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకులు వీజీ సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇది కలకలం సృష్టించింది. ఆయన మృతిపై అనుమానాలు రావడంతో కాఫీడే బోర్డు దర్యాఫ్తు చేపట్టింది. ఈ దర్యాఫ్తులో ఎన్నో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఇంగ్లీష్ మీడియాలో ఇందుకు సంబంధించి కథనాలు వచ్చాయి.
రూ.2వేల కోట్లు అదృశ్యం
కేఫ్ కాఫీ డేకు చెందిన బ్యాంకు ఖాతాల నుండి దాదాపు రూ.2వేల కోట్లు అదృశ్యమైనట్లు ఈ విచారణలో వెల్లడైనట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నివేదికను త్వరలో బహిర్గతం చేయనునుంది కేఫ్ కాఫీ డే. వీజీ సిద్ధార్థ ఆత్మహత్య తర్వాత ఆయన రాసినట్లుగా ఓ లేఖ కూడా వెలుగుచూసింది. తాను నిర్వహించిన ట్రాన్సాక్షన్స్ గురించి బోర్డు, ఆడిటర్లు, సీనియర్ మేనేజ్మెంట్కు తెలియదని కూడా అందులో పేర్కొన్నారు. ఈ లేఖ వివాదాస్పదంగా మారింది. దీంతో బోర్డు దర్యాఫ్తు చేపట్టింది.
రూ.2500 కోట్ల వరకు ఉంటుందని అనుమానాలు
సిద్ధార్థకు చెందిన ఇతర ప్రయివేటు కంపెనీలతో కాఫీ డే జరిపిన ట్రాన్సాక్షన్స్ను దాదాపు నెల పాటు పరిశీలించి 100కు పైగా పేజీలతో నివేదిక తయారు చేసింది. ఈ ట్రాన్సాక్షన్స్లలో రూ.2వేల కోట్ల మేర లెక్కలు తేలలేదని పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. అయితే అదృశ్యమైన మొత్తం రూ.2500 కోట్లకు పైగా ఉంటుందనే అనుమానాలు కూడా ఉన్నాయి.
వందల కొద్ది ట్రాన్సాక్షన్స్
నెలల పాటు దర్యాఫ్తు అనంతరం పెద్ద మొత్తంలో లెక్కలు తేలలేదని గుర్తించారు. డజన్ల కొద్ది కంపెనీలపై విచారణ జరిపారు. కేఫ్ కాఫీ డేకు, వీజీ సిద్ధార్థకు చెందిన పర్సనల్ బిజినెస్ కంపెనీలకు మధ్య వందల కొద్ది ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు గుర్తించారు. డ్రాఫ్ట్ను ఫైనలైజ్ చేస్తున్నారు.