షిఫ్టింగ్ టు ఇండియా... చైనాకు భారీ షాక్! భారత్లో మొబైల్ ఫోన్ల తయారీకి 24 కంపెనీలు
ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సహా వివిధ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మార్చిలో ఎలక్ట్రానిక్ తయారీదారులను ప్రోత్సహించేవిధంగా నాలుగు శాతం నుండి ఆరు శాతం వరకు ప్రోత్సాహకాలు ప్రకటించారు. తత్ఫలితంగా మన దేశంలో మొబైల్ ఫోన్ కంపెనీలను స్థాపించేందుకు దాదాపు రెండు డజన్ల కంపెనీలు సిద్ధమయ్యాయి. 24 కంపెనీలు 1.5 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టనున్నాయి. ఇది చైనాకు భారీ దెబ్బగానే భావించవచ్చు.
విప్రో చేతికి బ్రెజిల్ ఐటీ కంపెనీ, రికార్డ్స్థాయిలో దూసుకెళ్లిన షేర్
లాభపడని భారత్.. ఇప్పుడు కంపెనీల వరుస
మొబైల్ దిగ్గజం శాంసంగ్తో పాటు ఫాక్సాన్, విస్ట్రోన్ కార్ప్, పెగాట్రోన్ కార్ప్ వంటి సంస్థలు మొబైల్ ఫోన్ ఫ్యాక్టరీలను భారత్లో పెట్టేందుకు సిద్ధమయ్యాయి. పెట్టుబడులను ఆకర్షించేందుకు భారత్ ఫార్మా, ఆటోమొబైల్స్, వస్త్రాలు, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి మరిన్ని రంగాలకు ఇలాంటి ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధమైంది. అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ ఆశించిన మేర లాభపడలేదు. ఆ తర్వాత కరోనా కారణంగా కూడా చైనా నుండి పలు కంపెనీలు వెళ్లిపోయాయి. అయితే ఈ కంపెనీలు వియత్నాంను అత్యంత అనుకూల గమ్యస్థానంగా భావించాయి. ఆ తర్వాత కంబోడియా, మయన్మార్, బంగ్లాదేశ్, థాయ్లాండ్ ఉన్నాయి. ఇప్పుడు భారత్ ప్రోత్సాహకాల కారణంగా కంపెనీలు ఇటువైపు చూస్తున్నాయి.
ఎలక్ట్రానిక్ 'ఊతం'.. 10 లక్షల ఉద్యోగాలు
ప్రస్తుత నిర్ణయాలు భారత్లో పెట్టుబడులు పెరగడానికి, తద్వారా స్థూల జాతీయోత్పత్తిలో మనదేశ ఉత్పాదక వాటాని పెంచడానికి ఉపయోగపడతాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. కేవలం ఎలక్ట్రానిక్ పరంగా తీసుకున్న నిర్ణయం వల్ల రానున్న అయిదేళ్లలో 153 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తుల మ్యానుఫ్యాక్చరింగ్కు ఉపయోగపడుతుందని, ప్రత్యక్షంగా, పరోక్షంగా పదిలక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇది అయిదేళ్లలో 55 బిలియన్ డాలర్ల అదనపు పెట్టుబడులకు ఉపయోగడటంతో పాటు దేశీయ ఎకనమిక్ ఔట్పుట్ 0.5 శాతం పెరగడానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
ప్రపంచ ఫోన్ ఉత్పత్తిలో 10 శాతానికి అడుగులు
ఈ అడుగులు రానున్న అయిదేళ్లలో ప్రపంచ స్మార్ట్ఫోన్ ఉత్పత్తిలో భారత్ ఉత్పాదకత 10 శాతానికి పెంచుతుందని చెబుతున్నారు. ఇందులో ఎక్కువగా చైనా నుండి వస్తాయని చెబుతున్నారు. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆర్థిక వ్యవస్థలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రస్తుతం ఉన్న 15 శాతం నుండి 25 శాతానికి పెరగడానికి దోహదపడుతుంది. మోడీ టార్గెట్ కూడా ఇదే. కొత్తగా పెట్టుబడులు ఆకర్షించేందుకు భారత్ ఇప్పటికే పన్నులను ఆసియాలోనే అత్యల్పస్థాయికి తగ్గించింది.