ఆదాయపు పన్ను: దక్షిణాది రాష్ట్రాల నుంచే మన దేశానికి 62% ఆదాయం!
న్యూఢిల్లీ: రెండు నెలల క్రితం ఇండిపెండెన్స్ డే సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ... రానున్న అయిదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు తీసుకు వెళ్ళే దిశలో పాటుపడుతున్నట్లు తెలిపారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా తమ రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తామన్నారు. వీరు చెప్పింది కనుక వాస్తవరూపం దాల్చితే భారత ఆర్థిక వ్యవస్థ అద్భుతమే అంటున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ చాలా గొప్పగా చూస్తున్నప్పటికీ, ఆయా రాష్ట్రాల ఆదాయాల మధ్య అంతరం మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఈజీగా చెప్పాలంటే కొన్ని రాష్ట్రాలు ఆదాయంలో వెనుకబడగా, మరికొన్ని రాష్ట్రాలు ముందున్నాయి.
పీఎం కిసాన్ నిధి పడిందా, లేదంటే ఇలా చెక్ చేసుకోండి
ఈ 5 రాష్ట్రాల నుంచే 72 శాతం ఆదాయం
ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ విడుదల చేసినా ట్యాక్స్ కలెక్షన్స్ డేటా ప్రకారం మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటక... ఈ మూడు రాష్ట్రాల నుంచే 61 శాతం రెవెన్యూ దేశానికి అందుతోంది. తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలను కలుపుకుంటే 72 శాతంగా ఉంటాయి. అంటే ఈ ఐదు రాష్ట్రాల నుంచే దాదాపు ముప్పావు శాతం రెవెన్యూ వస్తోంది. ఈ డైరెక్ట్ ట్యాక్స్లో ఇండివిడ్యువల్స్ మరియు కార్పోరేట్ సంస్థలు చెల్లించే ట్యాక్సులు ఉంటాయి.
ట్యాక్స్ల ద్వారానే 50 శాతం ఆదాయం
ఆయా రాష్ట్రాల నుంచి ఎక్కువ ఆదాయం వస్తుందంటే అక్కడ ఆదాయం ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవచ్చు. ఇండివిడ్యువల్స్కు, సంస్థలకు ఈ రాష్ట్రాలలో ఆదాయం ఎక్కువ అని చెప్పవచ్చు. అలాగే మెరుగైన ఉపాధి అవకాశాలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బాగుందని చెప్పవచ్చు. ఎక్కువ రెవెన్యూ కలిగిన ఈ రాష్ట్రాలు ఎక్కువ ఆర్థిక కార్యకలాపాలు కలిగి ఉంటాయి. 2008-09 నుంచి ప్రత్యక్ష పన్నుల వాటా ద్వారా వచ్చే రెవెన్యూ 50 శాతం కంటే ఎక్కువగా ఉంటూ వస్తోంది. 2016-17లో మాత్రమే 49.65 శాతంగా ఉంది.
ఆరేళ్లలో
2013-14 నుంచి 2018-19 మధ్య... ఆరేళ్లు తీసుకుంటే ట్యాక్స్ రెవెన్యూలో మహారాష్ట్ర ముందంజలో ఉంది. ఈ ఆరేళ్లలో మహారాష్ట్ర నుంచి వచ్చిన డైరెక్ట్ ట్యాక్స్ రూ.19,17,944.98 కోట్లుగా ఉంది. ఆ తర్వాత ఢిల్లీ రూ.6,93,275.11 కోట్లు, కర్ణాటక రూ.4,99,310.99 కోట్లుగా ఉంది.
అధిక జనాభా కలిగిన రాష్ట్రాలు వెనుకంజ
అత్యధిక జనాభా కలిగిన ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఈ జాబితాలో వెనుకబడ్డాయి. ఉదాహరణకు బీహార్ అత్యంత జనాభా కలిగిన మూడో రాష్ట్రం. ఈ రాష్ట్రం గత ఆరేళ్లలో కంట్రిబ్యూట్ చేసింది కేవలం 0.65 శాతం మాత్రమే. అత్యధిక జనాభా కలిగిన యూపీ 3.12 శాతం, బెంగాల్ 4 శాతంగా ఉంది.
ఈ రాష్ట్రాల్లో శాలరైడ్ ఎక్కువగా లేకనే...
అధిక జనాభా కలిగిన ఈ రాష్ట్రాల్లో డైరెక్ట్ ట్యాక్స్ తక్కువగా ఉండటాన్ని బట్టి పేలవమైన ఫార్మల్ సెక్టార్, కార్పోరేట్ ఉపాధి కనిపిస్తోంది. అంతేకాదు, ఈ రాష్ట్రాలలో శాలరైడ్ క్లాస్ ఎక్కువగా లేరని కూడా స్పష్టమవుతోంది. ఒకవేళ ఇక్కడ వేతనజీవులు ఎక్కువగా ఉండి ఉంటే కనుక ఈ అత్యధిక జనాభా కలిగిన ఈ రాష్ట్రాల నుంచి ఆదాయపు పన్ను ఎక్కువగా వచ్చి ఉండాల్సింది.
వ్యక్తిగత ఆదాయ పన్ను ద్వారానే ఎక్కువ రెవెన్యూ
ప్రత్యక్ష పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని బట్టి పార్మల్ సెక్టార్.. ముఖ్యంగా సేవా రంగం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే, ఆ ప్రాంతంలో పరిశ్రమలు లేదా కార్పోరేట్ కంపెనీలు ఎంత విస్తృతంగా ఉన్నాయో అవగతం అవుతాయి. ఓ ప్రాంతంలో ఎక్కువమంది శాలరైడ్ ఉద్యోగులు ఉంటే ఆ ప్రాంతం నుంచి ఎక్కువ ఆదాయపు పన్ను వస్తుంది. గత ఆరేళ్లలో డైరెక్ట్ ట్యాక్స్ నుంచి వచ్చిన ఆదాయంలో పర్సనల్ ఇన్కం ట్యాక్స్ ఆదాయం 40.24 శాతంగా ఉంది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో వ్యక్తిగత ఆదాయ పన్ను రెవన్యూనే గణనీయంగా ఉంది.
అందుకే కార్పోరేట్ పన్ను అధికం
ఉదాహరణకు చండీగఢ్ ఓ చిన్న కేంద్రపాలిత ప్రాంతం. దీనిని ఉత్తరాఖండ్తో పోల్చి చూద్దాం. 2013-14 నుంచి 2018-19 మధ్య చండీగఢ్ నుంచి రూ.12,869.91 కోట్ల డైరెక్ట్ ట్యాక్స్ రాగా, ఉత్తరాఖండ్ నుంచి రూ.14,910.07 మాత్రమే వచ్చాయి. అంటే చండీగఢ్ కంటే ఇక్కడి నుంచి వచ్చిన రెవెన్యూ కేవలం 0.15 శాతం మాత్రమే ఎక్కువ. చండీగఢ్ నుంచి ఎక్కువ రెవెన్యూకు కారణం వ్యక్తిగత ఆదాయపు పన్ను, కార్పోరేట్ పన్ను అధికంగా ఉండటం కూడా కారణం.
దక్షిణాది నుంచి డైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూ
ప్రాంతాలవారీగా చూస్తే డైరెక్ట్ ట్యాక్స్ కాంట్రిబ్యూషన్లో దక్షిణాది రాష్ట్రాలైన కర్మాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కేరళ నుంచి 23 శాతం ఉంది.
ఉత్తరాది రాష్ట్రాల నుంచి రెవెన్యూ
జమ్ము కాశ్మీర్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ వంటి ఉత్తరాది రాష్ట్రాల నుంచి 21.30 శాతం ఉంది. ఇందులో ఢిల్లీ వాటానే 64.22 శాతంగా ఉండటం గమనార్హం. అలాగే దక్షిణాది నుంచి కర్ణాటక నుంచే అత్యధికంగా ఉంది.
మహారాష్ట్ర, గుజరాత్, గోవా, రాజస్థాన్ల నుంచి దాదాపు సగం రెవెన్యూ
మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, గోవా నుంచి చూస్తే 44.63 శాతం అత్యధికంగా ఉంది. ఇందులో మహారాష్ట్ర వాటా 85 శాతం వరకు ఉంది. మహారాష్ట్రను పరిగణలోకి తీసుకుంటే దక్షిణాది నుంచి 62 శాతం డైరెక్ట్ ట్యాక్స్ రెవెన్యూ వస్తున్నట్లు లెక్క.
ఈశాన్యం నుంచి 7.12 శాతమే
బీహార్, వెస్ట్ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్ నుంచి చూస్తే వీటి వాటం కేవలం 6.37 శాతమే ఉన్నాయి. ఎనిమిది నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు కలుపుకున్నప్పటికీ వాటా కేవలం 7.12 శాతమే.
ఈశాన్య రాష్ట్రాల్లో చాలావరకు షెడ్యూల్డ్ ప్రాంతాలుగా ప్రకటించారు. ఆదాయపు పన్ను నుంచి మినహాయించారు. ఏదేమైనా ఈ ప్రాంతాల్లో పరిశ్రమలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కార్పోరేట్ పన్ను కూడా అంతగా లేదు.