భీమ్ 2.0 ధూమ్ ధామ్.. సరికొత్త ఫీచర్లు ఇక దూకుడే!
ప్రభుత్వం ఇటీవలే భీమ్ 2.0 ను విడుదల చేసిన విషయం తెలిసిందే. భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ (భీమ్) మొబైల్ యాప్ ను యూపీఐ ఆధారిత పేమెంట్ ఇంటర్ఫేస్తో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (ఎన్ పీసిఐ ) అభివృద్ధి చేసింది. పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్ లావాదేవీలను పెంచే ప్రయత్నంలో భాగంగా 2016 డిసెంబర్ లో భీమ్ ను విడుదల చేశారు. తొలుత దీనికి భారీ స్థాయిలో ఆదరణ లభించింది. లావాదేవీలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి.
అయితే తర్వాతి కాలంలో లావాదేవీలు కాస్త తగ్గుముఖం పట్టాయి. పోటీ యాప్ లు సరికొత్త ఫెచర్లను అందించడం కూడా కారణంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే వినియోగదారులకు మరిన్ని కొత్త సదుపాయాలను అందించే నిమిత్తం సరికొత్త ఫీచర్లు కలిగిన భీమ్ 2.0 యాప్స్ ఇటీవలే విడుదల చేశారు. పే టీఎం, ఫోన్ పే, గూగుల్ పే తదితర యాప్ లకు ఇది గట్టి పోటీ నిచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భవిషతున్నాయి.
ఇంతకీ కొత్తగా జత చేసిన ఫీచర్లు ఏమిటంటే...
* ఈ యాప్ ద్వారా చేపట్టే లావాదేవీ పరిమితిని పెంచారు.
* కంపెనీలు జారీ చేసే తొలి పబ్లిక్ ఆఫర్ (ఐ పీ ఓ ) లకు దీని ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
* ఒకటికి మించి బ్యాంకు ఖాతాలను లింక్ చేసుకోవచ్చు.
* వ్యాపారస్తుల నుంచి ఆఫర్లను పొందవచ్చు.
* కొత్తగా మరో మూడు ప్రాంతీయ భాషలను జోడించారు.
కొత్త ఫీచర్లు ఎందుకు తెచ్చారంటే...
* ఈ యాప్ లో మిగతా యుపీఐ పేమెంట్ ప్లాట్ ఫామ్ ల మాదిరిగా ఆఫర్లు, వ్యాపారస్తుల డిస్కౌంట్లు తక్కువగా ఉండటం వల్ల ఆశించిన స్థాయిలో ఈ యాప్ అదరణను పొందలేకపోయినట్టు తెలుస్తోంది.
ఎన్పీసీఐ వెల్లడించిన గణాంకాల ప్రకారం సెప్టెంబర్ లో భీమ్ ద్వారా జరిగిన లావాదేవీలు 1.72 కోట్లు. మొత్తం యూపీఐ లావాదేవీల్లో ఈ లావాదేవీల వాటా 1.8 శాతంగా ఉంది. గత ఏడాది సెప్టెంబర్ లో భీమ్ 1.63 కోట్ల లావాదేవీలను నమోదు చేసుకుంది. అప్పుడు ఉన్న మొత్తం యుపీఐ లావాదేవీల్లో భీమ్ వాటా 4 శాతంగా ఉంది. దీన్ని బట్టి మిగతా యుపీఐ యాప్ లకన్నా భీమ్ వెనుకబడిపోతున్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే మరింత ఆకర్షణీయమైన ఫీచర్లను జోడించారు.
ఇవీ మార్పులు...
* భీమ్ యాప్ వినియోగదారులు వ్యాపారుల వద్ద కొనుగోళ్లు జరిపినపుడు గరిష్టంగా చెల్లించే మొత్తం 20,000 రూపాయల వరకు మాత్రమే ఉండేది. దీంతో రిటైల్ స్టోర్లలో గానీ ఆన్ లైన్ లో గానీ ఎక్కువ మొత్తంలో కొనుగోళ్లు చేసినప్పుడు చెల్లింపులు చేయడం ఇబ్బందికరంగా ఉండేది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పరిమితిని తాజాగా లక్ష రూపాయలకు పెంచారు. ఇది అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి కొంత మంది రిటైలర్లకు వర్తిస్తుంది.
* అయితే వ్యక్తులకు సంబదించిన లావాదేవీ పరిమితి మాత్రం 40,000 రూపాయలుగానే ఉంచారు.
16 భాషలు
* పెప్పర్ ఫ్రై, గ్రోఫెర్స్ లేదా ట్రావెల్ మార్చంట్లయిన ఓయో, రైల్ యాత్రి వంటి పోర్టల్ లలో కొనుగోళ్లపై డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ లు ఆఫర్ చేస్తున్నారు.
* భీమ్ ద్వారా నగదు పంపవచ్చు, స్వీకరించవచ్చు. రిటైల్ స్టోర్లవద్ద చెల్లింపులు చేయవచ్చు. చెల్లింపుల కోసం అనుసంధానం చేసిన బ్యాంక్ అకౌంట్ బ్యాలన్స్ చెక్ చేసుకోవచ్చు.
* భారత్ బిల్ పేమెంట్ ద్వారా బిల్లులను చెల్లించే సదుపాయాన్ని కూడా కల్పించారు.
* తొలి పబ్లిక్ ఇష్యూలకు దరఖాస్తు చేసే ఇన్వెస్టర్లు చెల్లింపులు చేసే సౌకర్యం ఉంది.
* ఇప్పటి దాకా ఒక్క బ్యాంకు ఖాతాను మాత్రమే భీమ్ యాప్ లో అనుమతిచ్చారు. కానీ ఇపుడు ఒకటికి మించి ఖాతాలు లింక్ చేసుకోవచ్చు. చెల్లింపులు చేసే సమయంలో అవసరమైన ఖాతాను ఎంచుకోవచ్చు. స్కాన్ చేసి చెల్లింపులు చేసే సదుపాయం కూడా ఉంది.
* ప్రధాన మంత్రి సహాయ నిధి, యునిసెఫ్ కు విరాళం కూడా ఇవ్వ వచ్చు.
* 16 ప్రాంతీయ భాషల్లో ఈ యాప్ ను అందుబాటులోకి తెచ్చారు. కాబట్టి మరింత ఎక్కువ మందిని ఇది చేరుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నారు.