మోడీ ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు మరో గుడ్న్యూస్!: శాలరీ పెంచుతారా?
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం డియర్నెస్ అలవెన్స్ (DA) రూపంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బహుమతిని అందించింది. దీపావళి పండుగ తర్వాత మరో తీపి కబురు కూడా అందించే అవకాశాలు ఉన్నాయట. ఈ మేరకు వార్తలు వస్తున్నాయి. ఉద్యోగుల వేతనాన్ని పెంచాలని భావిస్తోందట. ఉద్యోగులకు వేతనాలు పెంచే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. దీనిపై కేంద్రం తీవ్రంగా యోచిస్తోందట. కేంద్రం ఏడో సీపీసీ వేతనాల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సుమారు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది. దీనికి సంబంధించి నవంబర్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకవచ్చని రిపోర్ట్స్ సూచిస్తున్నాయి.
డీఏ పెంపు..
వేతనాల పెంపు గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం డీఏను 12 శాతం నుంచి ఏకంగా 17 శాతానికి పెంచింది. 50 లక్షల మంది ఉద్యోగులకు నుంచి 65 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరింది. జూలై నుంచి ఇది వర్తిస్తుంది.
ధరలు పెరిగాయి...
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలాకాలంగా వేతనం, ఫిట్మెంట్ పెంపు కోసం డిమాండ్ చేస్తున్నారు. ఏడో వేతన సవరణ సంఘం ద్రవ్యోల్భణాన్ని పరిగణలోకి తీసుకోలేదని, ఇప్పుడు ధరలు కూడా పెరిగాయని, దీంతో వేతన పెంపు వల్ల కలిగే ప్రయోజనం స్వల్పమే అంటున్నారు.
శాలరీ పెంపుకు కేంద్రం ఓకే
కేంద్ర ప్రభుత్వం ఇదివరకు మినిమం శాలరీని రూ.18,000కు పెంచింది. అయితే ఇప్పుడు ఉద్యోగులు మాత్రం కనీస వేతనం రూ.26,000కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం ఈ డిమాండ్లకు స్పందించాల్సి ఉంది. ఫిట్మెంట్ను 2.57 శాతం నుంచి 3.68 శాతం పెంచాలని కోరుతున్నారు. 29 జూన్ 2016న సెవంత్ పే కమిషన్ సూచించిన 14 శాతం పెంపుకు మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పుడు ఉద్యోగుల డిమాండుకు ఓకే చెప్పే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.