సుప్రీమ్ కోర్ట్ షాక్: వోడాఫోన్ - ఐడియా మూతపడనుందా?
ఇటీవలి సుప్రీమ్ కోర్ట్ తీర్పు.. వోడాఫోన్ - ఐడియా కంపెనీ భవిష్యత్ ను ప్రశ్నర్థకం చేస్తోంది. మొత్తంగా టెలికాం కంపెనీలు అన్ని కలిసి ప్రభుత్వానికి రూ 92,000 కోట్లు చెల్లించాలని ఈ మధ్యే సుప్రీమ్ కోర్ట్ తీర్పు ఇచ్చింది. దీని ప్రకారం ఒక్క వోడాఫోన్ - ఐడియా నే ప్రభుత్వానికి రూ 28,309 కోట్ల మేరకు చెల్లించాల్సి ఉంటుంది. అదే జరిగితే గనక కంపెనీ కుప్పకూలే పరిస్థితి తలెత్తుందని వోడాఫోన్ - ఐడియా ఆందోళన చెందుతోంది. కంపెనీల స్థూల ఆదాయాల లెక్కింపు పై ప్రభుత్వం సమర్పించిన వివరణతో సంతృప్తి చెందిన సుప్రీమ్ కోర్ట్ ... టెలికాం కంపెనీలు రూ 92,000 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో ఒక్క వోడాఫోన్-ఐడియా మాత్రమే కాదు అన్ని టెలికాం రంగ కంపెనీలకు కొత్త తలనొప్పి మొదలైంది. అసలే భరించలేని నష్టాలతో కునారిల్లుతున్న వోడాఫోన్ - ఐడియా కు అయితే ఇది అతి పెద్ద ప్రమాదకర పరిస్థితి కానుంది. సుప్రీమ్ కోర్ట్ ఆదేశాల ప్రకారం పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తే... ఈ కంపెనీ దివాళా తీయటం తప్ప మరో మార్గం కనిపించటం లేదు. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది.
ప్రభుత్వానికి వేడుకోలు...
ఈ పరిణామాల నేపథ్యంలో వోడాఫోన్- ఐడియా కంపెనీ గట్టెక్కే మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వానికి కొన్ని విన్నపాలు చేస్తోంది. పెనాల్టీలు, పన్నులు, లైసెన్స్ ఫీజుల నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. లేదంటే, కంపెనీ భవితవ్యం ప్రమాదంలో పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. సుప్రీమ్ కోర్ట్ నిర్ణయం చాలా ఆర్థిక పరమైన ఇబ్బందులను తెస్తుందని, ఇది కంపెనీకి సంబంధించి భారీ పరిణామాలకు దారి తెస్తుందని స్టాక్ ఎక్స్చేంజి లకు సమర్పించిన స్టేట్ మెంట్లో వోడాఫోన్ - ఐడియా పేర్కొంది.
అందరికీ ఇబ్బందే...
ఒక వేల ప్రభుత్వం మొండి పట్టుదలకు పోయి తమకు రావాల్సిన సొమ్ము చెల్లించాల్సిందేనని కోరితే... వోడాఫోన్ - ఐడియా కుప్పకూలడం ఖాయమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఒక వేళ అదే జరిగితే అది అటు ప్రభుత్వానికి ఇటు రుణాలు ఇచ్చిన బ్యాంకర్లకు మరో వైపు కంపెనీ వినియోగదారులకు తీవ్ర నష్టం కలుగుతుందని చెబుతున్నారు. కంపెనీ ఇప్పటికే సుమారు రూ 90,000 కోట్ల మేరకు బకాయి పడి ఉంది. దీనికి మరో రూ 30,000 కోట్లు తోడైతే, ఇక కంపెనీ కోలుకొనే పరిస్థితి కనిపించదని అంటున్నారు. వోడాఫోన్ - ఐడియా కు సుమారు 32 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఈ కంపెనీ దివాళా తీస్తే దానికి అప్పులిచ్చిన బ్యాంకులపై కూడా ప్రభావం పడి మొండి బకాయిలు పెరిగిపోతాయి. సొమ్ము ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది కాస్తా జాతీయ సమస్యగా మారే అవకాశమూ ఉంటుందంటున్నారు.
పాతాళానికి షేర్లు...
వోడాఫోన్ - ఐడియా షేర్లు 52 వారాల కనిష్ఠానికి పడిపోయాయి. శుక్రవారం ఒక దశలో కంపెనీ షేరు ధర రూ 3.66 కు కూడా పడిపోయింది. చివరకు కొంత కోలుకొని రూ. 4.11 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజషన్ రూ 11,810 కోట్లకు పడిపోయింది. రూ లక్షల కోట్లలో పెట్టుబడులు పెట్టి నెలకొల్పిన ఈ కంపెనీ విలువ భారీ అప్పుల వల్ల ఇప్పుడు ఇంత కనిష్ట స్థాయికి చేరుకోవటంతో మార్కెట్ అనలిస్టులు కంపెనీ భవితవ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జియో దెబ్బకు విలీనం...
పూర్తి ఉచిత సర్వీసులు అందిస్తూ మార్కెట్ ను ఆక్రమించిన అపార కుబేరుడు ముకేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ జియో దెబ్బకు ఆదిత్య బిర్లా గ్రూప్ నకు చెందిన ఐడియా, యునైటెడ్ కింగ్డమ్ కు చెందిన వోడాఫోన్ కంపెనీలు విలీనమయ్యాయి. జియో తో పోటీ పడాలంటే ఇది తప్పనిసరి అని భావించాయి. విలీనానికి ముందు ఐడియా దేశంలో రెండో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ గా ఉండగా... వోడాఫోన్ మూడో స్థానంలో ఉంది. ఈ రెండు కంపెనీలు విలీనం అవటంతో దేశంలోనే అతి పెద్ద టెలికాం ఆపరేటర్ గా ఉమ్మడి కంపెనీ ఆవిర్భవించింది. కానీ రిలయన్స్ జియో తన కస్టమర్ల సంఖ్యను అంతకంతకూ పెంచుకుంటూ దేశంలోనే నెంబర్ వన్ గా అవతరించింది. ఈ ప్రస్థానంలో దశాబ్దాలుగా తోలి స్థానంలో ఉన్న ఎయిర్టెల్ ను సైతం పక్కను నెట్టింది. కాగా, విలీనం జరిగినా వోడాఫోన్-ఐడియా మాత్రం మార్కెట్ లో ఆశించిన మేరకు నిలదొక్కుకోలేక పోయింది.