మహాత్మా గాంధీ సంతకంతో రూ.1000 నోటు, ఇది ఫేక్
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త రూ.1,000 నోటును తీసుకు వస్తోందని వాట్సాప్, సోషల్ మీడియా వేదికల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ కరెన్సీ నోట్లను ఎంతోమంది.. కొత్త నోటు వస్తోందంటూ వాట్సాప్లలో ప్రచారం చేస్తున్నారు. అయితే ఇది ఫేక్ అని తేలింది. ఆర్బీఐ రూ.1000 నోటును విడుదల చేసిందంటూ ట్విట్టర్ వేదికగా పలువురు పోస్టులు కూడా పెట్టారు. అయితే ఎవరో ఒకరు సృష్టించిన ఈ ఇమేజ్లు తమ వద్దకు రాగానే ఉత్సాహంతో ఫార్వార్డ్ చేస్తున్నారు. కానీ ఇవి ఫేక్ నోట్లు. ఆర్బీఐ ఎలాంటి రూ.1000 నోట్లు విడుదల చేయలేదు.
ప్లాస్టిక్ బదులు.. వెదురు నీళ్ల బాటిల్స్, ధర ఎంతో తెలుసా?
ఏ అంశమైనా ఆర్బీఐ వెబ్ సైట్లోకి వెళ్లి చూసుకోవచ్చు. కానీ రూ.1000 నోటును విడుదల చేసినట్లు ఈ వెబ్ సైట్లో ఎలాంటి సమాచారం లేదు. గ్రీన్ నోట్లతో పాటు మరో రకమైన నోట్లు కూడా వైరల్గా మారాయి. నోట్ల రద్దు అనంతరం ఆర్బీఐ రూ.1000 నోటును ముద్రిస్తోందని, మార్కెట్లోకి విడుదల కానుందని పోస్టులు పెడుతున్నారు. ఇది చూసిన చాలామంది నిజమని భావిస్తున్నారు.
కొత్త రూ.1000 నోటు ఎలా ఉంటుందో కూడా ఓ ఎడిటింగ్ ఫోటోను చూపిస్తూ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. ఆర్బీఐ రూ.1000 నోటుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక్కడ మరో విషయం ఏమంటే నోట్ల పైన ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉంటుంది. కానీ ఇక్కడ ప్రచారం జరుగుతున్న కొత్త నోట్లపై మహాత్మా గాంధీ సంతకం ఉండటం గమనార్హం.
ఈ నోటును నిషితంగా పరిశీలిస్తే ఫేక్ అని ఇట్టే తెలిసిపోతుంది. అంతేకాదు, కుడి వైపు పైన కార్నర్లో ఆర్టిస్టిక్ ఇమాజినేషన్ అని ఉంటుంది. ఇది ఫేక్ నోట్ అని తెలియడానికి ఇదొక్కడే చాలు.
2016 నవంబర్ 8వ తేదీన రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ కొత్త రూ.2000, రూ.500 నోట్లను ప్రవేశపెట్టింది. పాత రూ.100, రూ.50, రూ.10 నోట్లను కొనసాగిస్తూనే కొత్త నోట్లను చలామణిలోకి తీసుకువచ్చింది. కొత్తగా రూ.200 నోటును తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆర్బీఐ రూ.2000 నోట్ల ముద్రణ నిలిపివేసిందని వార్తలు వచ్చాయి. ఈ సమయంలో మళ్లీ రూ. 1000 నోటును మార్కెట్లోకి తీసుకు వస్తుందని భావిస్తున్నారు.