కస్టమర్ అలర్ట్: 22న బ్యాంకు ఉద్యోగుల సమ్మె, ప్రభావం అంతగా ఉండదా?
న్యూఢిల్లీ: ఇటీవల వివిధ బ్యాంకులను విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ జాతీయ బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 22వ (మంగళవారం) తేదీన దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించాలని రెండు ఆల్ ఇండియా బ్యాంకు ఉద్యోగుల సంఘాలు నిర్ణయించాయి. ఆలిండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA), బ్యాంకు ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BEFI) సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఇండియన్ బ్యాంకు అసోసియేషన్ (IBA)కు నోటీసులు అందించారు. ఆరు అంశాలను పేర్కొంటూ నోటీసులు ఇచ్చాయి.
విలీనం వల్ల అనేకమంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని, అలాగే పదోన్నతులు కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎగవేతదారుల నుంచి రుణాలు వసూలు చేస్తే బ్యాంకుల ఇబ్బందులు, నష్టాలు తీరుతాయని, విలీనం చేయవలసిన అవసరం లేదని చెప్పారు. సంస్కరణల పేరిట సామాన్య వినియోగదారులపై అధిక సర్వీస్ ఛార్జీల వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

22న నిర్వహించ తలపెట్టిన బ్యాంకుల సమ్మెకు తెలంగాణ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య మద్దతు తెలుతున్నట్లు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి రాంబాబు చెప్పారు. ఇటీవల పది ప్రభుత్వ రంగ బ్యాంక్లను 4 బ్యాంకుల్లో విలీనం చేస్తూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ సమ్మె తలపెట్టినట్లు ఆయన తెలిపారు. విలీనాన్ని కేంద్రం విఘాతమైన చర్యగా అభివర్ణించారు. 10 బ్యాంకులు 4 బ్యాంకుల విలీనమైన తర్వాత ప్రభుత్వ రంగం బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12 తగ్గిపోతుందన్నారు.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను తగ్గించడం, విలీనాలతో బ్యాంకుల ప్రయివేటీకరణకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరు వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకుల విలీనంతో ఉద్యోగులు తగ్గిపోతారని, దీంతో నిరుద్యోగ సమస్య పెరుగుతుందన్నారు. సంస్కరణల పేరుతో కేంద్రం కార్పొరేట్ వర్గాలకు దగ్గరవుతోందని, ఇది ఉద్యోగులకు నష్టం చేస్తుందన్నారు.
అంత ప్రభావం ఉండదా?
సమ్మెలో పాల్గొంటున్న తమ బ్యాంకుకు చెందిన ఉద్యోగులు కేవలం కొంతమందేనని, కాబట్టి తమ బ్యాంకు పైన సమ్మె ప్రభావం చాలా చాలా తక్కువగా ఉంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇటీవల స్టాక్ ఎక్స్చేంజ్కు తెలిపింది.
బ్యాంకుల సమ్మె నేపథ్యంలో కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయత్నాలు చేస్తున్నామని, అయినప్పటికీ బ్రాంచీలు, ఆఫీసులలో కొంత ప్రభావం ఉంటుందని సిండికేట్ బ్యాంకు తెలిపింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా కస్టమర్ సర్వీస్ పైన ఆందోళనగా ఉంది. కాగా, ఈ రెండు బ్యాంకు యూనియన్లు తొలుత గత నెల 26, 27 తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చాయి. ఆ తర్వాత వాటిని ఉపసంహరించుకున్నాయి.


Click it and Unblock the Notifications