2008 కంటే అతిపెద్ద సంక్షోభం, 20 నెలలు ఇంతే: గోల్డ్మన్ శాక్స్ షాకింగ్
ముంబై: భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు 2008 కంటే ఎక్కువ సంక్షోభంలో ఉందని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ గోల్డ్మన్ శాక్స్ పేర్కొంది. ఇది అతిపెద్ద ఆర్థిక సంక్షోభమని తెలిపింది. ప్రస్తుతం కన్సంప్షన్ భారీగా పడిపోయిందని, ఇది ఎకానమీకి అతిపెద్ద సవాల్ అన్నారు. ఇటీవల గోల్డ్మన్ శాక్స్ భారత వృద్ధి రేటు అంచనాను 6 శాతానికి తగ్గించింది. ప్రస్తుత మాంద్యం 2008 కంటే పెద్దదని, అలాగే పెద్ద నోట్ల రద్దు రూపంలో ఎదురైన అవరోధాలతో పోలిస్తే చాలా భిన్నమైనదని అభిప్రాయపడింది.
SIP రిటర్న్స్: రూ.300 ఇన్వెస్ట్తో కోటీశ్వరులు కావొచ్చు!
20 నెలల పాటు మందగమన ప్రభావం
నోట్లరద్దు, 2008 సమయంలో ఎదురైన సవాళ్లు తాత్కాలికమైనవని, ప్రస్తుత మందగమన స్థితి ఇప్పటి నుంచి 20 నెలల పాటు కొనసాగే అవకాశం ఉందని గోల్డ్మన్ శాక్స్ అభిప్రాయపడింది. వినియోగం పెద్ద ఎత్తున పడిపోవడం భారత ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడానికి ప్రధాన కారణమని తెలిపింది. అలాగే, వినియోగ క్షీణతకు NBFC సంక్షోభానికి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఐఎల్ అండ్ ఎఫ్ఎల్ పరిణామం కంటే ముందే వినియోగం తగ్గుతూ వస్తోందని తెలిపింది.
NBFCకి సంబంధం లేదు...!
2018 జనవరి నుంచి వినియోగం తగ్గుతోందని, NBFC రంగంలో ద్రవ్య లభ్యత సమస్యకు కారణమైన ఐఎల్ అండ్ ఎఫ్ఎల్ అంశం 2018 ఆగస్టులో చోటు చేసుకుందని గోల్డ్మన్ శాక్స్ గుర్తు చేసింది. NBFC సంక్షోభానికి, మాంద్యానికి సంబంధం లేదని గోల్డ్ మన్ శాక్స్ ఆర్థికవేత్త ప్రాచీ మిశ్రా అన్నారు. గత ఏడాది జనవరి నుంచి వినియోగం తగ్గితే, ఐఐ అండ్ ఎఫ్ఎల్ సంక్షోభం గత ఏడాది సెప్టెంబర్లో వస్తే రెండింటికి సంబంధం ఎలా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
కారణాలు ఎన్నో...
పెట్టుబడులు, ఎగుమతులు ఎప్పటి నుంచో నేలచూపులు చూస్తున్నాయని, ఈ రెండింటితో పోలిస్తే దేశీయ వినియోగం క్షీణించడమే ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థను ఎక్కువగా దెబ్బతీస్తోందన్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగమనం, నిధుల కొరత కూడా మందగమనానికి జత కలిశాయన్నారు. ప్రస్తుత ఆర్థిక మందగమనాన్ని నోట్ల రద్దు నాటి పరిస్థితితో పోల్చరాదన్నారు. ప్రస్తుత ఆర్థిక పతనానికి 40 శాతం అంతర్జాతీయ పరిస్థితులు, 30 శాతం దేశీయ వినియోగం తగ్గడమే కారణమన్నారు.
ఆర్బీఐ, మోడీ ప్రభుత్వం ఉద్దీపనలతో పుంజుకుంటుంది...
అంతర్జాతీయ మందగమనం సహా ఇతర సవాళ్ల నేపథ్యంలో వృద్ధి నెమ్మదించడం వినియోగం క్షీణతకు మూడొంతులు కారణమని, ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని, వృద్ధి రెండు శాతం మేర తగ్గిందని గోల్డ్ మన్ శాక్స్ ముఖ్య ఆర్థికవేత్త ప్రాచీ మిశ్రా తెలిపారు. రెండో అర్ధభాగంలో వృద్ధి పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వరుసగా ఐదుసార్లు వడ్డీ రేట్లు తగ్గించడం, నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా కార్పోరేట్ పన్ను తగ్గింపు సహా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే ఉద్దీపనలు ప్రకటించిందని ఇది గోల్డ్ మన్ శాక్స్ అభిప్రాయపడ్డారు. మరిన్ని ఉద్దీపనలు అవసరమన్నారు. రెండో అర్ధబాగంలో కాస్త వృద్ధి పుంజుకుంటుందన్నారు.