గత నెల కంటే రూ.2,000 తగ్గిన బంగారం, కానీ రూపాయి దెబ్బతీస్తుందా?
అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పాటు పండుగ కారణంగా నేడు (అక్టోబర్ 16) బంగారం ధరలు పెరిగాయి. ఎంసీఎక్స్లో ఉదయం గం.9.15 సమయానికి 10 గ్రాముల బంగారం 0.32 శాతం లేదా రూ.121 పెరిగి 38,157కు చేరుకుంది. పసిడి మంగళవారం రూ.190 తగ్గి రూ.38,036 వద్ద క్లోజ్ అయింది. కిలో వెండి 0.44 శాతం పెరిగి రూ.45,427 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ ధరలు 0.2 శాతం పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో అక్టోబర్ 15న ఔన్స్ బంగారం 1500 డాలర్లుగా, ఔన్స్ వెండి 17.70 డాలర్లుగా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర
అమెరికా - చైనా ట్రేడ్ వార్ విషయమై క్లారిటీ రానంత వరకు బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సుకు 1480 డాలర్ల నుంచి 1530 డాలర్ల మధ్య ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఫెడ్ మానిటరీ పాలసీపై కూడా ఆధారపడి ఉంటుంది. అమెరికా - చైనా మధ్య సానుకూలంగా కనిపించినప్పుడు బంగారం ధరలు తగ్గుతున్నాయని గుర్తు చేస్తున్నారు.
రూపాయి దెబ్బతీస్తుందని ఆందోళన
భారత్లో బంగారం ధర ఏ స్థాయిలో స్థిరపడుతుందనే విషయం డాలర్తో రూపాయి మారకం రేటుపై ఆధారపడి కూడా ఉంటుంది. నెల రోజుల క్రితం వరకు పరుగెత్తిన బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లోను కాస్త తగ్గింది. వాణిజ్య యుద్ధానికి తెరదించేందుకు అమెరికా-చైనా చేస్తున్న ప్రయత్నాలు, అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించడం ఇందుకు కారణం. ఈ రెండు చర్యలతో అమెరికా కరెన్సీ డాలర్ మారకం రేటు పెరిగింది. దీంతో డాలర్ మారకంలో రూపాయి మళ్లీ 71 కంటే ఎక్కువగా ఉంది. ఇది మరింత పెరిగితే ఆ ప్రభావం బంగారంపై పడుతుంది. ఇది దీపావళికి నగల అమ్మకాలను దెబ్బతీసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల ఆందోళన.
రూ.1,900 తగ్గుదల!
గత నెలలో బంగారం ధరలు రూ.40,000 దాటింది. రెండు నెలలుగా కాస్త అటు ఇటుగా 38 వేలకు పైగా ఉంది. ఈ ధరలు కొనుగోలు నుంచి ప్రజలను దూరం చేస్తున్నాయి. బంగారం దిగుమతులు సెప్టెంబర్ నెలలో 62 శాతం తగ్గాయి. 1.36 బిలియన్ డాలర్ల దిగుమతులు మాత్రమే అయ్యాయి. అయితే గత రెండు నెలల అత్యధిక ధరతో పోలిస్తే (రూ.40,000) ఇఫ్పుడు రూ.1900 తగ్గి రూ.38,100కు అటు ఇటుగా ఉంది.
గత నెలతో పోలిస్తే భారీగా తగ్గిన బంగారం...
మరోవైపు, దీపావళి - ధన త్రయోదశి సందర్భంగా పసిడి అమ్మకాలు, పసిడి ఆభరణాల అమ్మకాలు గత ఏడాది కంటే 30 శాతం వరకు తగ్గుతాయని ఆలిండియా బంగారం పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సెప్టెంబర్ నెలలో 99.9 స్వచ్ఛత కలిగిన బంగారం 10 గ్రాములు రూ.40,000 చేరినా ప్రస్తుతం, రూ.38,000కు కాస్త పైగా ఉంది. గత నెలతో పోలిస్తే ధర భారీగా తగ్గింది. ఇది ఊరట కలిగించే అంశమని చెబుతున్నారు.
ఐనా తగ్గనున్న బంగారం విక్రయాలు
కొనుగోలుదార్ల సెంటిమెంట్ బలహీనంగా ఉండటం, 2018లో ఇదే సమయంతో పోలిస్తే ధర చాలా ఎక్కువగా ఉన్నందున ఈసారి అమ్మకాలు 30 శాతం వరకు తగ్గవచ్చునని అంచనా వేస్తున్నారు. ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఈసారి దీపావళికి బంగారం ఆభరణాలు అంతగా ఉండకపోవచ్చునని చెబుతున్నారు. వివాహాల సీజన్ ప్రారంభమవుతుందని, అలాగే పండుగ ఉంది కాబట్టి కొంతమేర డిమాండ్ ఉంటుందని, కానీ గతంలో ఉన్నంతగా ఉండకపోవచ్చునని అంటున్నారు.