భారీగా పెరిగిన ధరలు, 14 నెలల గరిష్టానికి రిటైల్ ద్రవ్యోల్భణం
భారత్ రిటైల్ ద్రవ్యోల్భణం సెప్టెంబర్ నెలలో సెంట్రల్ బ్యాంకు నిర్దేశించుకున్న మీడియం టర్మ్ టార్గెట్ 4 శాతానికి చేరుకుంది. గత 14 నెలల్లో 3.99తో గరిష్టస్థాయికి చేరుకుంది. ఇటీవలి వరకు తగ్గిన ఆహార పదార్థాల ధరలు, మళ్లీ పెరుగుతున్నాయి. కూరగాయలు, పప్పుల ధరలు గత నెలలో పెరిగాయి. దీంతో ద్రవ్యోల్బణం 3.99 శాతానికి ఎగబాకింది. అయినప్పటికీ రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించుకున్న లక్ష్యం కంటే తక్కువ జోన్లో ఉండటం గమనార్హం.
ఆగస్ట్ నెలలో 3.28 శాతంగా నమోదైన వినియోగదారుల ధరల సూచీ, అంతకుముందు ఏడాదిలో ఇదే నెలలో 3.70 శాతంగా ఉంది. జూలై 2018లో నమోదైన 4.17 శాతం తర్వాత ఇది గరిష్టం. గత నెలలో ఆహార పదార్థాల ధరల సూచీ ఏకంగా రెండు రెట్లు పెరిగాయి. దీంతో 5.11 శాతానికి చేరుకుంది. క్రితం ఏడాది ఇది 2.99 శాతంగా ఉంది.
నోబెల్ విన్నర్: నోట్ల రద్దు బాధల్ని హెచ్చరించిన అభిజీత్ బెనర్జీ
ఇందులో కూరగాయల ధరలు 15.40 శాతం అధికం కాగా, పప్పులు, మాంసం, చేపలు ఎక్కువగా పెరిగాయి. చమురు ధరలు మాత్రం పెరగలేదు. ద్రవ్యోల్బణ గణాంకాలు ఆధీనంలో ఉండటంతో ప్రస్తుత ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఆర్బీఐ వడ్డీ రేట్లను వరుసగా అయిదుసార్లు తగ్గించింది. ప్రస్తుతం ఆహార పదార్థాలు భగ్గుమన్నప్పటికీ, వచ్చేది కొత్త సీజన్ కాబట్టి రానున్న రెండు నెలల్లో తగ్గే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
రిటైల్ ద్రవ్యోల్భణం 14 నెలల గరిష్టస్థాయికి చేరుకుంటే టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం మాత్రం మూడేళ్ల కనిష్టానికి పడిపోయింది. చమురు, పలు ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టడంతో సెప్టెంబర్ నెలకుగాను సూచీ 0.33 శాతంగా ఉంది. ఆగస్ట్లో 1.08 శాతంగా నమోదయింది. టోకు ధరల సూచీ గత ఏడాది ఇదే నెలలో నమోదైన 5.22 శాతంతో పోలిస్తే భారీగా తగ్గింది.