ఆకట్టుకోని స్కీం: రాహుల్గాంధీ 'NYAY'సూచన నోబెల్ విన్నర్ అభిజిత్దే!
న్యూఢిల్లీ: పేదరికం నుంచి యావత్ ప్రపంచానికి విముక్తి కలిగించేలా అద్భుత పరిష్కారాలను సూచించిన ప్రవాస భారత ఆర్థికవేత్త అభిజిత్ వినాయక్ బెనర్జీకి నోబెల్ పురస్కారం లభించంది. ఆయన భార్య ఎస్తేర్ డుఫ్లోతో పాటు మరో ఆర్థికవేత్త మైఖేల్ క్రెమర్కు... ముగ్గురికి సంయుక్తంగా ఈ అవార్డును స్వీడిష్ రాయల్ అకాడమీ ఆఫ్ సెన్సెస్ ప్రకటించింది. పేదరిక నిర్మూలకు అభిజిత్ దంపతులు ఓ ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. భారత తాజా ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన అభిజిత్ నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ఉన్నారు.
నోట్ల రద్దుపై ముందే హెచ్చరిక, రూ.2000 నోటుతో ఇల్లీగల్ ఈజీ: మోడీపై నోబెల్ విన్నర్ అభిజీత్ బెనర్జీ
రాహుల్ గాంధీ న్యాయ్ స్కీం...
అభిజిత్ గురించి మరో కీలక విషయం కూడా ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ న్యాయ్ (NYAY) స్కీంతో ప్రజల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఒక్కో కుటుంబానికి నెలకు రూ.12,000 కనీస ఆదాయం ఉండాలని, ఇందుకు ఏడాదికి రూ.72,000 పేదలకు ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించి సంచలనం రేపారు. ఈ స్కీం ద్వారా కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరుతుందని భావించారు. కానీ ఇది ప్రజలను ఆకట్టుకోలేదు. ప్రజలకు ఉచితాల ద్వారా ఎరవేసే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు కూడా వచ్చాయి. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న న్యాయ్ స్కీం ఏమాత్రం ఉపయోగపడలేదు!
ప్రజలను ఆకట్టుకోలేదు...
NYAY స్కీంపై రాహుల్ గాంధీకి లేదా కాంగ్రెస్ పార్టీకి అడ్వైజ్ చేసిన వారిలో అభిజిత్ బెనర్జీ కూడా ఉన్నారు. అయితే ఈ న్యాయ్ స్కీం ఎన్నికల సమయంలో ప్రజలను ఆకట్టుకోలేదు. ప్రజలను ఆకర్షించలేకపోవడానికి, ఆర్థిక ప్రగతికి సూచనలు ఇవ్వడానికి సంబంధం లేదనే విషయం గుర్తించాలి. బీజేపీ 2014 కంటే మరో 30 సీట్లు ఈసారి ఎక్కువగా గెలిచింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి రావాలంటే దేశం విస్తృత ఆర్థిక లోటును బట్టి కొత్త పన్నుల ద్వారా NYAYకు నిధులు సమకూర్చాల్సి ఉంటుంది కూడా సూచించారట.
అభిజిత్కు నోబెల్ రావడంపై రాహుల్ గాంధీ ఏమన్నారంటే?
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ప్రతిపాదించిన కనీస ఆదాయ పథకం (NYAY)కు రూపకల్పన చేసింది అభిజిత్ అని, పేదరికాన్ని నిర్మూలించి, ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం కలిగించేందుకు ఆ పథకాన్ని ప్రతిపాదించారని, అలాంటి అభిజిత్కు నోబెల్ వచ్చినందుకు అభినందనలు అన్నారు.
డిమోనిటైజేషన్
2016 నవంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దును ప్రకటించారు. రూ.1000, రూ.500 నోట్ల రద్దును విమర్శించిన వారిలో అభిజీత్ బెనర్జీ ఒకరు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు పడిన కష్టాలు ఎవరి అంచనాలకు అందవన్నారు. ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుత సంక్షోభానికి మూల కారణాల్లో నోట్ల రద్దు కూడా ఉందన్నారు. అనాలోచిత విధానాలకు ప్రత్యక్ష ఉదాహరణ పెద్ద నోట్ల రద్దు అని అభిజీత్ సతీమణి డఫ్లో అన్నారు. ఆర్థిక శాస్త్రంలో సంయుక్తంగా నోబెల్ అందుకున్న వారిలో ఈమె కూడా ఉన్నారు. ప్రస్తుత ఆర్థిక మందగమనంపై నోట్ల రద్దు ప్రభావం ఉందని అభిజీత్ బెనర్జీ చెప్పారు. నోట్ల రద్దు ఆందోళన మొదట ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉందన్నారు. నోట్ల రద్దుపై హార్వార్డ్ యూనివర్సిటీకి చెందిన నమ్రతా కాలాతో కలిసి పేర్కొన్న ఓ పేపర్లో అభిజీత్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్లో ఎక్కువ ఎకనమిక్ ట్రాన్సాక్షన్లు జరిగే చోట ద్రవ్య లోటు ఏర్పడిందని, దీంతో ట్రాన్సాక్షన్స్ పరిమాణం లేదా సంఖ్య తగ్గుతుందని, ఈ భారం అధికంగా ఇన్ఫార్మల్ సెక్టార్ పైన పడిందని అభిజీత్ అందులో అభిప్రాయపడ్డారు. ఇక్కడే 85 శాతం లేదా అంతకంటే ఎక్కువ భారత శ్రామిక శక్తి పని చేస్తోందన్నారు. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ సంప్రదాయ నగదు రూపంలో జరుగుతాయన్నారు. నోట్ల రద్దుతో అవినీతిని తగ్గించడం అనేది ప్రభుత్వం (ప్రధాని నరేంద్ర మోడీ) ఉద్దేశ్యం అయినప్పటికీ అంతకంటే రెండింతల విలువ కలిగిన నోటును తీసుకు వచ్చారని అభిజీత్ బెనర్జీ చెప్పారు. రూ.500, రూ.1000 నోటును రద్దు చేసినా, రూ.2000 నోటును తీసుకు రావడంపై ఆయన పైవిధంగా స్పందించారు. ఇప్పుడు ఇలా కూడా ఇల్లీగల్ చెల్లింపు సులభమవుతుందన్నారు. పెద్ద నోట్లు కలిగి ఉన్న వారికి నోట్ల రద్దు జరిమానాలా కాకుండా అవినీతిని భవిష్యత్తులో ప్రోత్సహించేలా కనిపిస్తుందని అభిప్రాయపడ్డారు.