'సైరా' వార్-ఆర్థికమందగమనం: ముంబైలో కాబట్టి అలా చెప్పా.. వెనక్కితగ్గిన కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక పరిస్థితికి, సినిమా కలెక్షన్లకు లింక్ పెట్టిన కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. సినిమాల వల్ల భారీగా వ్యాపారం జరుగుతోందని, ఇటీవలే విడుదలైన మూడు బాలీవుడ్ సినిమాలు అతిపెద్ద హిట్ అయ్యాయని, ఈ నెల అక్టోబర్ 2వ తేదీన ఒక్కరోజే ఈ సినిమాలు రూ.120 కోట్ల మేర కలెక్షన్లు సాధించాయని, ఇలాంటప్పుడు మాంద్యం ప్రభావం ఏది అని ఆయన రెండు రోజుల క్రితం అన్నారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకుంటే ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు.
'3 సినిమాలు రూ.120 కోట్లు వసూలు చేశాయి.. ఆర్థికమాంద్యం ఎక్కడ?'
ముంబైలో ఉన్నా.. కాబట్టి అలా చెప్పా
తాను నిన్న (అక్టోబర్ 12న) ముంబైలో సినిమాలపై చేసిన వ్యాఖ్యలు కేవలం మూవీస్కు సంబంధించిన అంశమని, ఇందులో తప్పులేదని, భారీ సినిమాలు నిర్మిస్తూ లక్షలాదిమందికి ఉపాధి కల్పిస్తున్న భారత పరిశ్రమను చూసి తాను గర్విస్తున్నానని చెప్పారు. అందులో భాగంగా అక్టోబర్ 2న ఒకరోజులో మూడు సినిమాలు రూ.120 కోట్లు వసూలు చేశాయని ముంబైలో చెప్పానని, ఇప్పటి వరకు ఇది అత్యధికమని, తాను సినిమా రాజధాని అయిన ముంబైలో ఉన్నా కాబట్టి ఆ విషయం చెప్పానని అన్నారు.
అందుకే వెనక్కి తీసుకుంటున్నా
భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యలను తాను వివరంగా చెప్పానని, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల కోణంలో ఆలోచిస్తుందని చెప్పారు. ప్రజల సున్నితత్వం గురించి ఆలోచిస్తుందన్నారు. తాను ముంబైలో మీడియాతో మాట్లాడిన ఇంటరాక్షన్ వీడియో మొత్తం తన సోషల్ మీడియా వేదికలో అందుబాటులో ఉందన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, అయినా ఎవరైనా వాటిని తప్పుగా భావిస్తే ఉపసంహరించుకుంటున్నానని చెప్పారు. తాను కూడా సున్నితమైన వ్యక్తినని, అలాంటి వ్యక్తిగా తన కామెంట్స్ను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు.
అసలు ఏమన్నాడు?
దేశంలో విడుదలైన మూడు సినిమాలు అక్టోబర్ 2వ తేదీన రూ.120 కోట్లు వసూళ్లు సాధించాయని, దేశం ఆర్థికంగా బలంగా ఉండి ఆర్థిక మందగమనం లేకపోవడం వల్ల ఇది సాధ్యమైందని, దేశంలో ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని NSSO) ఇచ్చిన నివేదిక తప్పుగా ఉందని, IMF నివేదిక కూడా అసంపూర్ణమని, ఆర్థికంగా బలమైన దేశాల్లో భారత్ అయిదో స్థానంలో ఉన్న విషయం మరువొద్దు అని రవిశంకర ప్రసాద్ చెప్పారు. అక్టోబర్ 2న విడుదలైన వార్, సైరా, జోకర్ సినిమాలు విడుదలయ్యాయి. ఇవి రూ.120 కోట్లు వసూలు చేశాయి.
దుయ్యబట్టిన ప్రియాంక
మాంద్యానికి, సినిమా కలెక్షన్లకు లింక్ పెట్టడంపై నెటిజన్ల నుంచి విమర్శలు వచ్చాయి. స్వయంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ఘాటుగా స్పందించారు. కేంద్రమంత్రి సినిమా ప్రపంచం నుండి వాస్తవ ప్రపంచంలోకి రావాలన్నారు. మంత్రి స్థాయిలో ఉండి ఆర్ధికమాంద్యం గురించి అలా మాట్లాడడం చాలా దురదృష్టకరమన్నారు. ఆర్ధిక మాంద్యం వల్ల పలు రంగాల్లో లక్షల ఉద్యోగాలు కోల్పోతున్నారని, ఇక ప్రజల డబ్బులను బ్యాంకుల్లో స్థంభింప చేస్తున్నారని, ప్రజల ఆందోళన, బాధ గురించి ప్రభుత్వం కొంచెం కూడ ఆలోచించడం లేదని దుయ్యబట్టారు. సినిమాలుఎప్పుడు కూడ లాభాపేక్ష మీదనే ఆధారపడతాయన్నారు.
బాలీవుడ్ ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ ఏమన్నారంటే...
రవిశంకర ప్రసాద్ రూ.120 కోట్ల వ్యాఖ్యలపై బాలీవుడ్ ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ కోమల్ నాథ్ స్పందించారు. వాస్తవానికి రవిశంకర ప్రసాద్ చెప్పింది వాస్తవం అని, ఒక రోజులో రూ.120 కోట్లు వసూలు చేయడం ఇదే మొదటిసారి అని, అంతకుముందు బాహుబలి 2 సినిమా ఒక్కటే రూ.112 కోట్లు వసూలు చేసిందని గుర్తు చేశారు. అయితే చిత్రపరిశ్రమ, బాలీవుడ్ కూడా మన ఎకానమీకి చేసే కంట్రిబ్యూషన్ చాలా తక్కువ అన్నారు. మహా అయితే ఒకటి లేదా రెండు శాతం ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు. చిత్ర పరిశ్రమ గణాంకాలు ఎప్పుడూ బయటకు వస్తుంటాయని, ఈ బిజినెస్ ఎప్పుడూ ఆకర్షణీయంగానే కనిపిస్తుందన్నారు. అయితే ఇది కేవలం ఆకర్షణ మాత్రమే అన్నారు. సినిమా పరిశ్రమ భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అంతలా (వారు చెప్పినట్లుగా) తోడ్పడదన్నారు.