అన్ని ప్రభుత్వ కంపెనీల్లో 50% వాటా విక్రయిస్తే బెటర్: వేదాంత బాస్ అనిల్ అగర్వాల్ సూచన
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్ డీ ఏ ప్రభుత్వం ఎయిర్ ఇండియా సహా కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలు విక్రయించే పనిలో పడింది. ఈ మేరకు ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకొంటోంది. అయితే, ప్రస్తుతం పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ అనుకొన్నంత సాఫీగా జరగటం లేదు. ఏదో సమస్యలతో ఇది నిరంతరం వాయిదా పడుతూ వస్తోంది. పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియా సంస్థను విక్రయించాలని కొన్నేళ్లుగా ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఒక అడుగు ముందుకు, మూడు అడుగులు వెనక్కు అన్నట్లు సాగుతోంది ఈ ప్రాసెస్.
అందుకే, ఇలా ఒక్కో సంస్థలో ఒక్కోసారి వాటా విక్రయిస్తే పెద్దగా ప్రయోజనం ఉండదని, ఇకపై మొత్తంగా అన్ని ప్రభుత్వ సంస్థల్లోనూ ఒకేసారి సగం వాటాలు విక్రయించాలని వేదాంత రిసోర్సెస్ గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ ప్రభుత్వానికి సూచన చేసారు. ఈ మేరకు ఆయన ది ఎకనామిక్ టైమ్స్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో వ్యాఖ్యానించినట్లు పత్రిక వెల్లడించింది. ఆ ఇంటర్వ్యూ నుంచి కొన్ని ముఖ్య విశేషాలు ....
IRCTC IPO అదుర్స్: రూ.645 కోట్ల అనుకుంటే రూ.72,000 కోట్ల రాక
20 ఏళ్ళు పడుతుంది...
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే ప్రక్రియ ప్రస్తుతం జరుగుతున్నట్లే కొనసాగితే మరో 20 ఏళ్ళు గడిచినా.. ఆయా కంపెనీ పూర్తిస్థాయిలో కొనుగోలు చేసిన సంస్థలో విలీనం జరగదని అనిల్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ఒక్కో కంపెనీలో ఒక్కోసారి వాటా విక్రయించే ప్రక్రియ చేపడితే, విపరీతమైన ఆలస్యం జరుగుతుందన్నారు. అందుకే, గంపగుత్తగా ఒకేసారి అన్ని ప్రభుత్వ రంగ కంపెనీల్లోనూ 50% వాటాలు విక్రయిస్తే మేలని అయన చెప్పారు. అలాగైతే, కంపెనీల ఆస్తుల మార్పిడి త్వరగా పూర్తి అవడటంతో పాటు ప్రభుత్వానికి కూడా పెద్ద మొత్తంలో ఒకేసారి నిధులు లభిస్తాయన్నారు. అప్పుడు మిగితా కార్పొరేట్ కంపనీల్లాగే వీటిని కూడా పరిగణిస్తారని చెప్పారు. అలాంటి కంపెనీలు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆడిట్ పరిధిలోకి రావని వెల్లడించారు.
బీపీసీల్, కాంకర్ లో వాటా విక్రయం...
ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రభుత్వ రంగ కంపెనీల్లో వ్యూహాత్మక వాటాల విక్రయానికి పచ్చ జెండా ఊపింది. ఈ నెల తొలినాళ్లలో ఈ మేరకు కొత్త ప్రక్రియకు కాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ బీపీసీల్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ సి ఐ ), కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్), నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్, టీ హెచ్ డి సి వంటి సంస్థల్లో వాటాలు విక్రయించనుంది. ఐ ఆర్ సి టీ సి లో వాటా ఉపసంహరణ ద్వారా రూ 650 కోట్లు సమీకరిస్తోంది. ఈ కంపెనీ ఐపీవో కు మంచి ఆదరణ లభించిన విషయం తెలిసిందే.
గురి తప్పని వేదాంత ...
గతంలో వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు పెట్టుబడుల ఉపసంహరణలో పాల్గొన్న వేదాంత గ్రూప్.... తాను కొనుగోలు చేసిన కంపెనీలను విజయవంతంగా లాభాల బాట పట్టించటంతో పాటు వాటిని మరింతగా విస్తరించింది. హిందూస్తాన్ జింక్, బాల్కో వంటి కంపెనీలే ఇందుకు నిదర్శనం. భారత్ లో కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ ను కొనుగోలు చేయడం ద్వారా దేశంలో అతిపెద్ద ఆయిల్ అండ్ గ్యాస్ సంస్థగా ఎదిగింది. అలాగే ఇండియా లో వేదాంత అతిపెద్ద అల్యూమినియం కంపెనీ కూడా కావటం విశేషం. అయితే, ప్రస్తుతం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీల్) వాటాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారా అన్న ప్రశ్నకు అనిల్ అగర్వాల్ నేరుగా సమాధానం ఇవ్వలేదు. పెట్టుబడుల ఉపసంహరణపై ఇంకా స్పష్టత రావాలని పేర్కొన్నారు.
అటవీ అనుమతులు కీలకం...
భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయని అనిల్ అగర్వాల్ తెలిపారు. ముఖ్యంగా పరిశ్రమల ఏర్పాటుకు అటవీ అనుమతులు లభించే ప్రక్రియ సులభతరం కావాలని, వేగం కూడా పెరగాలని సూచించారు. అలాగే దేశానికి ఒక వనరుల విధానం ఉండాలన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భారత్ మరింత ముందుకు వెళ్లాలంటే ఇది తప్పని సరి అని పేర్కొన్నారు.
10 బిలియన్ డాలర్ల ప్రాజెక్టు...
వేదాంత గ్రూప్ ఇండియా లో 10 బిలియన్ డాలర్లు (రూ 70,000 కోట్ల) కొత్త పెట్టుబడికి సిద్ధంగా ఉంది. ఇక్కడ ఎల్ సి డి ప్యానెళ్ల ను తయారు చేసే అతిపెద్ద కర్మాగారం నెలకొల్పాలని భావిస్తోంది. ఇందుకోసం జపాన్ కంపెనీలతో టెక్నాలజీ సహకారం కోసం చర్చలు జరుపుతోంది. ఈ పరిశ్రమ భారత్ లో నెలకొల్పితే విదేశాల నుంచి ఎల్ సి డి ప్యానెళ్లను దిగుమతి చేసుకొనే అవసరం భారీగా తగ్గిపోతుంది. అయితే, ప్రభుత్వ పరంగా సబ్సిడీ లు ఆశించిన మేరకు లేకపోవటంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కే అవకాశాలు తగ్గిపోయాయని వార్తలు వచ్చాయి. కానీ... ఇంకా ఈ ప్రాజెక్టుపై తాము ఆశలు వదులు కోలేదని, మరో మూడు నెలల్లో దీనిపై ఒక ప్రకటన చేస్తామని అనిల్ అగర్వాల్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టును మహారాష్ట్ర లోని నాగపూర్ లో నెలకొల్పనున్నారు.