సూపర్ రిచ్ ఇండియన్ సీఈఓలు: సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ కంటే ఎక్కువ సంపాదన!
భారత సీఈఓ లకు ప్రపంచవ్యాప్తంగా యమా డిమాండ్ ఉంటోంది. మైక్రోసాఫ్ట్ సీఈఓ గా మన హైదెరాబాదీ సత్య నాదెళ్ల ఎంపిక అయినప్పుడు అహో అంటే... గూగుల్ సీఈఓ గా మరో భారతీయుడు, తమిళ తంబీ సుందర్ పిచాయ్ నియామకం మరో సారి ప్రపంచాన్ని భారత్ వైపు చూసేలా చేసింది. ప్రపంచ ఇంటర్నెట్ రంగాన్ని శాశించే మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి కంపెనీలను నడిపించే నాయకులు మన వారు కావటం నిజంగా విశేషమే.
మరి అంత పెద్ద కంపెనీల సీఈఓ లకు వేతనాలు కూడా వందల కోట్లలో ఉండటం సహజమే కదా. కానీ సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ లతో సంపాదనలో పోటీ పడే భారతీయ సీఈఓ ల సంఖ్య అధికంగానే ఉంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వీరిద్దరికంటే ఎక్కువ సంపాదించే ఇండియన్ సీఈఓ లు ఉన్నారు. ఇలాంటి సూపర్ రిచ్ ఇండియన్ సీఈఓ లతో కూడిన ఒక జాబితాను ఐ ఐ ఎఫ్ ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2019 రూపొందించింది. దీనిని ది ఎకనామిక్ టైమ్స్ ప్రచురించింది. ఆ విశేషాలు తెలుసుకుందామా?
థామస్ కురియన్ : రూ 10,600 కోట్లు
ఇండియన్ ఆరిజిన్ సీఈఓ థామస్ కురియన్ 22 ఏళ్ళ పాటు ఒరాకిల్ లో వివిధ హోదాల్లో పనిచేసి 2018 లో గూగుల్ క్లౌడ్ సీఈఓ గా నియమితులయ్యారు. ప్రిన్స్ టోన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ ... స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. ఈయన ఆస్తుల విలువ రూ 10,600 కోట్లుగా ఉంది.
జయశ్రీ ఉల్లాల్ : రూ 9,800 కోట్లు
వండర్ ఉమెన్ గా పిలిచే జయశ్రీ ఉల్లాల్... ప్రస్తుతం అమెరికాకు చెందిన ప్రముఖ క్లౌడ్ నెట్వర్కింగ్ కంపెనీ అరిష్ట నెట్వర్క్స్ సీఈఓ గా పనిచేస్తున్నారు. ఈ కంపెనీ లో ఆమెకు 5% వాటా కూడా ఉంది. అరిష్ట కంటే ముందు తన 15 ఏళ్ళ కెరీర్లో ఉల్లాల్... చాలా కాలం పాటు సిస్కో సిస్టమ్స్ లో పలు హోదాల్లో సేవలు అందించారు. రూ 9,800 కోట్ల సంపదను పోగు చేశారు.
నీకేష్ అరోరా : రూ 6,000 కోట్లు
సాఫ్ట్ బ్యాంకు ఫౌండర్ మసాయాషి సొన్ కు అత్యంత ప్రీతిపాత్రుడుగా ఉన్న నీకేష్ అరోరా ... సాఫ్ట్ బ్యాంకు నుంచి ఇటీవలే బయటకు వచ్చారు. గతేడాది పాలో ఆల్టో నెట్వర్క్స్ కంపెనీ లో చేరారు. 128 మిలియన్ డాలర్ల (రూ 896 కోట్లు ) వార్షిక వేతనంతో మరో సారి నీకేష్ వార్తల్లోకి ఎక్కారు. ఆయన మొత్తం సంపాదన రూ 6,000 కోట్లుగా ఉంది.
అజయ్ బంగా : రూ 5,200 కోట్లు
2009 లో మాస్టర్ కార్డు సీఈఓ గా చేరిన అజయ్ బంగా ఇప్పటికీ అదే సంస్థలో కొనసాగుతున్నారు. అంతకు ముందు అయన సిటీ బ్యాంకు, నెస్లే, పెప్సికో కంపెనీల్లో వివిధ హోదాల్లో పని చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ, ఐ ఐ ఎం - అహ్మదాబాద్ ల నుంచి డిగ్రీ, పీజీ పట్టాలు పొందారు. రూ 5,200 కోట్ల సంపదకు బాస్ అయ్యారు.
సత్య నాదెళ్ల : రూ 5,100 కోట్లు
హైదెరాబాదీ సత్య నాదెళ్ల 2014 నుంచి మైక్రోసాఫ్ట్ సీఈఓ గా పనిచేస్తున్నారు. స్టీవ్ బామర్ తర్వాత కంపెనీకి మూడో సీఈఓ గా నియమితులయ్యారు. ఆయన కర్ణాకటక లోని ఎం ఐ టీ నుంచి డిగ్రీ , విస్కాన్సిన్ నుంచి ఎం ఎస్ చేసారు. మైక్రోసాఫ్ట్ లో చేరక ముందు సత్య నాదెళ్ల సన్ మైక్రో సిస్టమ్స్ లో పని చేసారు. ఆయనకు మొత్తంగా రూ 5,100 కోట్ల సంపద ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.
శాంతను నారాయణ్ : రూ 4,500 కోట్లు
చాలా మందికి తెలియక పోవచ్చు కానీ... శాంతను నారాయణ్ కూడా మన హైదరాబాదీనే. ప్రఖ్యాత అడోబీ కంపెనీకి సీఈఓ గా వ్యవహరిస్తున్న నారాయణ్ ..యూ సి బెర్కెలీ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో డిగ్రీ, కంప్యూటర్ ఇంజనీరింగ్ లో పీజీ పూర్తిచేశారు. ఒకవేళ అడోబీ లో జాయిన్ అవ్వక పోతే ప్రొఫెషనల్ గోల్ఫ్ ఆడేవాడినని శాంతను చెబుతారు.
సుందర్ పిచాయ్ : రూ 3,300 కోట్లు
సెలబ్రిటీ స్టేటస్ ఎంజాయ్ చేసే సుందర్ పిచాయ్ చెన్నైకి చెందిన వారు. ఈయన సంపద రూ 3,300 కోట్లకు చేరిందని నివేదిక పేర్కొంది. ఇటీవల గూగుల్ సీఈఓ పోస్ట్ వెకేట్ అయిందని ఒక పోర్టల్ లో వార్త వస్తే... దానికి మిలియన్ లలో దరఖాస్తులు వచ్చాయట. ఆ తర్వాత అది ఫేక్ వార్త అని తేలింది. గూగుల్ కు సుందర్ పిచాయ్ మాత్రమే సీఈఓ అని తేలేసరికి అందరూ అవాక్కయ్యారు.
ఇంద్ర నూయి : రూ 3,200 కోట్లు
పెప్సికో మాజీ సీఈఓ ఐన ఇంద్ర నూయి కూడా చెన్నైకి చెందిన వారే. గర్ల్ బాస్ గా బాగా ప్రాచుర్యం పొందిన ఆమె ... ప్రపంచంలోనే అత్యంత ప్రభావిత కంపెనీకి ఎక్కువ కాలం మహిళా సీఈఓ గా పనిచేసి రికార్డు సృష్టించారు. మహిళగా వర్క్ లైఫ్ బాలన్స్ చక్కగా చేసారని అందరూ ఆమెను కొనియాడుతారు. ఇంద్ర నూయి మొత్తం సంపద రూ 3,200 కోట్లుగా ఉంది.
ఇగ్నాటియస్ నెవిల్ నరోన్హా : 2,200 కోట్లు
44 ఏళ్ళ నరోన్హా ... ప్రస్తుతం అవెన్యూ సూపర్ మార్ట్స్ సీఈఓ గా పనిచేస్తున్నారు. అదేనండి డిమార్ట్ సీఈఓ ఈయనే. 2006 నుంచి దానికి హెడ్ గా పనిచేస్తున్నారు. హిందూస్తాన్ యూనీలీవర్ లో పనిచేస్తున్న నరోన్హా ను డిమార్ట్ ఫౌండర్ రాధాకిషన్ దామని తన కంపనీని లీడ్ చేసేందుకు ఎంపిక చేసారు. సూపర్ రిచ్ సీఈఓ ల లిస్ట్ లో భారతీయుడు అయి ఉండి, ఒక భారత్ కంపెనీకు సీఈఓ గా ఉన్న అత్యంత సంపన్నుడు నరోన్హా.
రాబిన్ రైనా : రూ 1,700 కోట్లు
అమెరికా లోని అట్లాంటా కేంద్రంగా పనిచేసే సాఫ్ట్ వేర్ కంపెనీ ఎబిక్స్ చైర్మన్, సీఈఓ ఐన రాబిన్ రైనా... 2000 నుంచి ఈ కంపెనీకి సారథ్యం వహిస్తూ జిలిస్, వయ డాట్ కం, ఇట్స్ కాష్ కొనుగోలు లో కీలక పాత్ర పోషించారు. మున్సి ప్రేమ్ చాంద్ రాసిన నిర్మల ఆయన ఫేవరెట్ పుస్తకం. రాబిన్ సంపద రూ 1,700 కోట్లుగా ఉంది.