నరేంద్రమోడీ హామీలో మరో అడుగు: భారత్ చేరిన స్విస్ ఖాతా వివరాలు
న్యూఢిల్లీ: విదేశాల్లోని నల్లధనం తెప్పిస్తానని ప్రధాని నరేంద్ర మోడీ 2014 ఎన్నికలకు ముందు ప్రకటించారు. ఆయన చెప్పిన గడువు సంవత్సరాలు దాటినప్పటికీ ఇది సుదీర్ఘ ప్రక్రియ. కాబట్టి ఆలస్యమవుతోంది. అయితే బీజేపీ ప్రభుత్వం విదేశాల్లోని భారతీయుల ధనం గురించి ఎప్పటికప్పుడు తన ప్రయత్నాలు చేస్తోంది. తాజగా, ప్రధాని మోడీ హామీకి మరో అడుగు పడింది.
స్విస్ బ్యాంకుల్లో ధనం దాచుకున్న భారతీయుల ఖాతాల ఫస్ట్ లిస్ట్ భారత్కు చేరుకున్నాయి. ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (AEOI) విధానం కింద ఈ వివరాలను అందించినట్లు స్విట్జర్లాండుకు చెందిన ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్కు (FTA) చెందిన అధికారి ఒకరు వెల్లడించారు. ఈ విధానం ద్వారా భారత్ ఈ వివరాలు పొందడం ఇదే తొలిసారి. ఇది బ్లాక్ మనీ బయటకు రావడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం భారత్కు అందిన జాబితాలో 2018లో ట్రాన్సాక్షన్స్ జరిపిన, క్లోజ్ చేసిన అకౌంట్స్ వివరాలు ఉన్నాయి. ఆ తర్వాత రెండో జాబితాను 2020 సెప్టెంబర్ నెలలో అందజేస్తారు. ఇప్పుడు అందిన వివరాల్లో అకౌంట్ పేరు, అడ్రస్, అకౌంట్లోని నగదుకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. అయితే ఈ వివరాలను రహస్యంగా ఉంచాలనే నిబంధన ఉంది. రహస్యంగా ఉంచే నిబంధన కిందనే స్విస్ ఈ వివరాలు వెల్లడిస్తోంది.
ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ప్రకారం ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరానికి సంబంధించిన అకౌంట్స్ వివరాలు తొమ్మిది నెలల తర్వాత అందిస్తారు. అంటే వచ్చే ఏడాది సెప్టెంబర్ నెలలో 2019 జాబితా అందిస్తారు. స్విస్ అకౌంట్లలో డబ్బులు దాచుకున్న వారి జాబితా భారత్కు చేరడం మోడీ ప్రభుత్వం ఘనతగా చెబుతున్నారు.
రూ.2,000 నోట్లు రద్దు, రూ.1000 నోట్లు రిలీజ్: ఇందులో నిజమెంత
వచ్చిన వివరాల ప్రకారం లెక్కల్లో చూపని ఆదాయం కలిగిన వారిపై విచారణ జరిపే అవకాశం ఉంది. డిపాజిట్లు సహా ట్రాన్సాక్షన్స్ వివరాలు ఉండటంతో వారిపై చర్యలు తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. తొలి విడతగా వచ్చిన జాబితాలో ఎక్కువగా బిజినెస్మెన్, ఎన్నారైలు ఉన్నారని సమాచారం. మోడీ ప్రభుత్వం నల్లధనం వెలికితీత చర్యలు చేపట్టడం వల్లే గత ఏడాది ఎక్కువమంది ఖాతాలు మూసివేశారని చెబుతున్నారు.
మొత్తంగా FTA దాదాపు 3.1 మిలియన్ ఫైనాన్షియల్ అకౌంట్స్ను వివిధ పార్ట్నర్ స్టేట్స్కు అందించింది. అందులో 2.4 మిలియన్ వివరాలు వివిధ దేశాలు అందుకున్నాయి. కాగా, ఈ ఏడాది నాటికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం నుంచి AEOI కింద వివరాలు అందుకోనున్న దేశాలు 75కు చేరుకున్నాయి.