తెలంగాణ ఆదాయం డబుల్! కొత్త లిక్కర్ పాలసీ వివరాలు ఇవే...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని గురువారం ప్రకటించింది. 2011 జనాభా గణన ప్రాతిపదికన లైసెన్స్ ఫీజులను ఖరారు చేసింది. ఈ నవంబర్ 1వ తేదీ నుంచి 2021 అక్టోబర్ 30వ తేదీ వరకు అంటే రెండేళ్ల పాటు ఇది అమలులో ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న నాలుగు స్లాబ్స్ను తెలంగాణ ప్రభుత్వం ఆరు స్లాబ్స్గా మార్చింది. ధరఖాస్తు ఫీజును భారీగా పెంచారు. లాటరీ విధానం ద్వారా మద్యం షాపుల ఎంపిక ఉంటుంది.
15 ని.ల్లో పని పూర్తి.. 3 విభాగాలుగా 500 రకాల సేవలు
దరఖాస్తు ఫీజు రూపంలో వందల కోట్ల ఆదాయం
కొత్త మద్యం పాలసీ ప్రకారం నాన్-రీఫండబుల్ అప్లికేషన్ ఫీజును రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచారు. అప్పటి వరకు రూ.50,000గా ఉన్న ఫీజును 2017లో రూ.1 లక్షకు పెంచారు. దీంతో రెండేళ్ల క్రితం 41,000 దరఖాస్తులకు గాను లైసెన్స్ ఫీజు రూపంలో రూ.400 కోట్ల రాబడి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం మరోసారి దానిని రెండింతలు చేసింది. ఆదాయం గతంలో కంటే రెండింతల కంటే ఎక్కువగా వచ్చే అవకాశముంది.
మద్యం దుకాణాలు రాత్రి ఎప్పటి వరకు అంటే?
జీహెచ్ఎంసీ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, ఇతర ప్రాంతాల్లో రాత్రి 10 గంటల వరకు మద్యం షాపులు తెరిచి ఉంటాయి. ఈ నెలాఖరులోగా లాటరీ విధానం ద్వారా లైసెన్స్దారులను ఎంపిక చేస్తారు. ప్రస్తుతం తెలంగాణలో 2,216 మద్యం షాప్స్ ఉన్నాయి. లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు. ఈ నెలాఖరున ప్రక్రియ ముగియనుంది.
ఏడాదికి రూ.5 లక్షలు..
దుకాణదారు లైసెన్స్ రుసుముతో పాటు లెవీ కింద ఏటా మరో రూ.5 లక్షలు అదనంగా చెల్లించవలసి ఉంటుంది. రిటైలర్స్ సాధారణంగా ఆర్డినరీ, ప్రీమియం ఐఎంఎఫ్ఎల్, ఎఫ్ఎల్ పైన 27 శాతం మార్జిన్, బీరు పైన 20 శాతం మార్జిన కలిగి ఉంటారు.
6 స్లాబ్స్ ఇవే...
మద్యం దుకాణాలకు తెలంగాణ ప్రభుత్వం ఆరు స్లాబుల్లో లైసెన్స్ ఛార్జీలను ఖరారు చేసింది. దుకాణ లైసెన్స్ రుసుము ఏడాదికి ఇలా...
- 5,000 లోపు జనాభా కలిగిన ప్రాంతాలకు రూ.50 లక్షలు.
- 5,0001 నుంచి 50,000 జనాభా కలిగిన ప్రాంతాల్లో రూ.55 లక్షలు.
- 50,001 నుంచి లక్ష జనాభా ఉంటే రూ.60 లక్షలు.
- 1 లక్ష నుంచి 5 లక్షల మధ్య ఉంటే రూ.65 లక్షలు.
- 5 లక్షల నుంచి 20 లక్షల జనాభా ఉంటే రూ.85 లక్షలు.
- 20 లక్షలకు పైగా జనాభా ఉంటే రూ.1.1 కోట్లు.
9 నుంచి అప్లికేషన్లు
దరఖాస్తు పత్రాలను ఆయా జిల్లాల్లోని ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ కార్యాలయాల్లో తీసుకోవాలి. నూతన మద్యం విధానం ప్రకారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విక్రయాలు ఉంటాయి. జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం రాత్రి 11 వరకు షాపులు తెరిచి ఉంటాయి. దరఖాస్తు చేసుకొనేవారికి ఈ నెల 9వ తేదీ నుంచి అప్లికేషన్లు అందుబాటులో ఉంటాయి.
కొత్త మద్యం పాలసీ ముఖ్యాంశాలు...
- మద్యం దుకాణదారుల నుంచి లెవీ స్పెషల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ను ఏడాదికి రూ.5 లక్షల చొప్పున ఒక వాయిదాలో వసూలుచేస్తారు. గతంలో ఇది ఏడుసార్లు గడువు నిబంధన ఉంది.
- రిటైల్ మార్జిన్ ఆర్డినరీ బ్రాండ్స్ పైన 27 శాతం, మీడియం, ప్రీమియం బ్రాండ్స్ పైన 20 శాతం, బీర్లపై 20 శాతంగా ఖరారు చేశారు.
- లైసెన్సుదారులు రెండేళ్ల ఎక్సైజ్ ఫీజును 8 వాయిదాల్లో చెల్లించాలి. ఇది గతంలో ఆరు వాయిదాలుగా ఉంది.
- రెండేళ్ల లైసెన్స్ ఫీజులో ఎనిమిదో వంతుకు సమానమైన రెండు ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా బ్యాంకు గ్యారంటీలను ఇవ్వాలి.
- ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిబంధనల మేరకు లిక్కర్ షాపుల్లో రోజూవారీ లావాదేవీలు నమోదు చేసుకొనే వ్యవస్థ అవసరం.
- అన్ని మద్యం షాపుల్లో కౌంటర్ వద్ద, మద్యం నిల్వచేసి ఉన్న ప్రాంతాల్లో కలిపి మూడు సీసీటీవీ కెమెరాలు ఉండాలి. వీటిని ఎక్సైజ్ శాఖ కంట్రోల్ రూంకు అనుసంధానం చేయాలి.
- లిక్కర్ షాప్స్ వద్ద తగిన పార్కింగ్ తప్పనిసరి.