కేంద్రానికి కష్టకాలం! ఆదాయం పెంపు చర్యలు.. సత్ఫలితాలిస్తాయా?
కేంద్ర ప్రభుత్వానికి గడ్డుకాలం వచ్చిపడింది. కార్పొరేట్ పన్ను శాతం తగ్గింపుతో ఆదాయం బాగా తగ్గిపోనుంది. దీనికితోడు జీఎస్టీ వసూళ్లు కూడా నిరాశాజనకంగా ఉన్నాయి. దీంతో మోడీ సర్కారు ఆదాయం పెంపునకు ఉపకరించే మార్గాలపై దృష్టిసారించింది.
ఎందుకంటే, బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవాలంటే మోడీ సర్కారుకు ప్రతి నెలా రూ.లక్ష కోట్లకుపైనే ఆదాయం అందాలి. ఆదాయ, వ్యయాల మధ్య అంతరం బాగా పెరిగితే ద్రవ్యలోటు తప్పదు. మరి ఈ గడ్డు పరిస్థితిని ఎదుర్కొనాలంటే ఏం చేయాలి?
కార్పొరేట్ పన్ను శాతం తగ్గింపుతో...
కేంద్ర ప్రభుత్వం ఇటీవల కార్పొరేట్ పన్ను శాతాన్ని 30 నుంచి 22 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. ఆదాయంలో భారీ కోత పడుతుందని, ఈ ప్రభావం కచ్చితంగా ఖజానాపై పడుతుందని తెలిసినా ఆర్థిక వ్యవస్థలో మందగమనాన్ని పారదోలేందుకు, వాణిజ్యాభివృద్ధి కోసం మోడీ సర్కారు పన్ను శాతాన్ని తగ్గించి పెద్ద సాహసమే చేసింది. ఒక్క కార్పొరేట్ పన్ను శాతం తగ్గింపుతోనే కేంద్రానికి రూ.1.5 లక్షల కోట్ల ఆదాయం తగ్గిపోతుంది.
భారీగా తగ్గిన జీఎస్టీ వసూళ్లు...
అసలే కార్పొరేట్ పన్ను శాతం తగ్గింపుతో ఆదాయం తగ్గుతుందని బాధపడుతుంటే.. మరోవైపు జీఎస్టీ వసూళ్లు కూడా భారీగా తగ్గాయి. గత 19 నెలల్లో ఎన్నడూ లేనంతగా జీఎస్టీ వసూళ్లు తగ్గాయి. ఆగస్టు నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.98,202 కోట్లుగా ఉండగా.. సెప్టెంబర్ నెలలో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.91,916 కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.94,442 కోట్లు. అంటే.. 2.67 శాతం తక్కువ.
ప్రత్యామ్నాయం.. ఆస్తుల విక్రయం?
ఆదాయం బాగా తగ్గడంతో కేంద్రంలోని మోడీ సర్కారు తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. ఈ నేపథ్యంలో ఖజానాను నింపగలిగే ప్రత్యామ్నాయ మార్గాలపై సర్కారు దృష్టిసారించింది. ఆయా రంగాల్లోని తన ఆస్తుల విక్రయం ద్వారా రూ.90,000 కోట్ల వరకు సమకూర్చుకునేందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించుకుంది. విమానయాన రంగంలో రూ.15 వేల కోట్లు, విద్యుత్ రంగంలో రూ.20 వేల కోట్లు, ఓడ రవాణా రంగంలో రూ.7,500 కోట్లు, జాతీయ రహదారుల రంగంలో రూ.25 వేల కోట్లు, రైల్వే రంగంలో మరో రూ.22 వేల కోట్ల విలువైన ఆస్తులను విక్రయించాలని భావిస్తోంది.
పెట్టుబడుల ఉపసంహరణ కూడా...
ఆస్తుల విక్రయంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్యూ)ల్లో తన వాటాల ఉపసంహరణ (డిజిన్వెస్ట్మెంట్) ద్వారా కూడా ఆదాయం సమకూర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.1.05 లక్షల కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలన్నది మోడీ సర్కారు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ సెప్టెంబరు నాటికి కేవలం రూ.12,357.49 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. దీంతో ఈ విషయంలో మరింత జోరు పెంచాలని కేంద్రం నిర్ణయించుకుంది.
వేటిలో వాటాలు విక్రయిస్తారంటే...
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్), షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్సీఐ), టీహెచ్డీసీ ఇండియా, ఎన్ఈఈపీసీలో తనకు ఉన్న వాటాలను కేంద్ర ప్రభుత్వం విక్రయించనుంది. అలాగే కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్)లో కూడా తన 30 శాతం వాటాను విక్రయించనుంది. ఈ వాటాల విక్రయం ద్వారా కేంద్రానికి రూ.66 వేల కోట్లకుపైగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది.