రూ.100కు పైగా ఉల్లి: భారత్ అవసరం.. చైనాకు సూపర్ అవకాశం
న్యూఢిల్లీ: నేపాల్ నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక వరకు ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆ దేశాల వారికి ఉల్లి కంట నీరు తెప్పిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం భారత్ ఉల్లి ఎగుమతులను బ్యాన్ చేయడమే. వివిధ దేశాలు ఉల్లి కోసం భారత్పై ఆధారపడుతుంటాయి. అయితే భారీ వర్షాలు, వరదలు కారణంగా పంట నష్టం, పంట విస్తీర్ణం తగ్గిన నేపథ్యంలో భారత్లో ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. దీనిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఉల్లి ఎగుమతులను నిలిపేసింది.
దసరా-దీపావళి బంపరాఫర్: కొంటే చాలు 30 రోజుల్లో 30 కార్లు!
అందుకే ఉల్లి ఎగుమతులు నిలిపేసిన భారత్
ఆసియా దేశాలు ఉల్లి లేకుండా వంటను ఆస్వాదంచలేరనే చెప్పవచ్చు. పాకిస్తాన్ చిక్కెన్ కర్రీ అయినా, బంగ్లాదేశ్ బిర్యానీ అయినా, ఇండియన్ సాంబార్ అయినా ఉల్లి తప్పనిసరి. ఈ దేశాలు ఉల్లి కోసం భారత్ పైన ఆధారపడతాయి. కానీ భారత్ ఒక్కసారిగా ఉల్లి ఎగుమతులు నిలిపివేసింది. దీంతో ఆయా దేశాల్లో ఉల్లి ధరలు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో క్వింటాల్ ధర రూ.4,500కు చేరిన నేపథ్యంలో భారత్ గత ఆదివారం నుంచి ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది.
కారణాలివే..
ఉల్లి ధర భారీగా పెరగడం గత ఆరేళ్లలో ఇది తొలిసారి. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా చాలాచోట్ల ఉల్లి పంట నీట మునిగింది. మరికొన్ని ప్రాంతాలలో వర్షాల కారణంగానే పంట కోతలు చేపట్టలేదు. పంట విస్తీర్ణం కూడా తగ్గింది. దీంతో ఉల్లి రాక మార్కెట్లకు ఆలస్యమైంది. ఉల్లి ఎగుమతులపై భారత్ నిషేధం విధించింది.
భారత్ నుంచి పక్క దేశాల వైపు చూస్తున్న దేశాలు
దీంతో బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, శ్రీలంక వంటి దేశాలు ఈజిప్ట్, టర్కీ, చైనా దేశాల వైపు చూస్తున్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత్ 22 లక్షల టన్నుల ఉల్లిగడ్డను ఎగుమతి చేసింది. భారత్ ఉల్లి ఎగుమతుల్ని నిలపివేయడంతో ఇతర దేశాలు ఈ పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్నాయి.
ఉల్లి ధరలు పెరుగుతున్నాయి...
నేపాల్లో కూరగాయల ధరలు పెరుగుతున్నాయని, అలాగే గత నెల రోజులుగా ఉల్లి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయని, ఇది ఆందోళకర అంశమని ఖాట్మాండ్లోని ఓ కూరగాయల షాప్ ఓనర్ అన్నారు.
రూ.100 దాటిన ఉల్లి ధర
బంగ్లాదేశ్లో పదిహేను రోజుల వ్యవధిలో ఉల్లి ధర దాదాపు రెట్టింపు అయింది. 2013 డిసెంబర్ అనంతరం తొలిసారి ఉల్లి ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో బంగ్లాదేశ్ తమ ప్రభుత్వ వాణిజ్య సంస్థ ద్వారా సబ్సిడీ రేట్లపై ఉల్లిని విక్రయిస్తోంది. తక్కువ వ్యవధిలో తమకు ఉల్లిని ఎగుమతి చేసే దేశాల వైపు చూస్తున్నామని బంగ్లా వాణిజ్య సంస్థ ప్రతినిధి తెలిపారు. బంగ్లాదేశ్లో కిలో ఉల్లికి 120 టాకాలు (1.42 డాలర్లు) అంటే దాదాపు రూ.100కు పైగా ఉంది.
ఆ ఉల్లి మార్కెట్కు వచ్చే దాకా ఇదే పరిస్థితి..
భారత్ నుంచి ఎక్కువ మొత్తంలో ఉల్లిని కొనుగోలు చేసే రెండో దేశం మలేషియా. భారత్ విధించిన నిషేధం స్వల్ప కాలమేనని, భయపడాల్సిన అవసరం లేదని మలేషియా వ్యవసాయ మంత్రి తమ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కానీ ప్రస్తుతం భారత్ కూడా ఈజిప్టు నుంచి ఉల్లిని దిగుమతి చేసుకునే పరిస్థితి. గత వేసవిలో వేసిన పంటలు మార్కెట్కు వస్తే తప్ప ఉల్లి ధరలు తగ్గే పరిస్థితి లేదని చెబుతున్నారు. వేసవి ఉల్లి పంట నవంబర్ మధ్యకాలంలో మార్కెట్స్కు రావొచ్చు.
సొమ్ము చేసుకుంటున్న చైనా
భారత్ నుంచి ఎగుమతులు లేనందున ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నామని ట్రేడింగ్ కార్పోరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ అధికార ప్రతినిధి చెప్పారు. టర్కీ ఉల్లి ఎగుమతులు చేస్తున్నాయి. ఈజిప్ట్ నుంచి ఉల్లి రావడానికి నెల రోజులు పడుతుందని, చైనా నుంచి వచ్చేందుకు 25 రోజులు పడుతుందని, భారత్ నుంచి మాత్రం తక్కువ రోజుల్లో వస్తుందని ఢాకా ట్రేడర్ తెలిపింది. కానీ భారత్ నుంచి ఎగుమతులు లేనందున దీనిని ఈజిప్ట్, టర్కీ, చైనా దేశాలు సొమ్ము చేసుకుంటున్నాయి.
శ్రీలంకలోను ఒకటిన్నర రెట్లు పెరిగిన ధర
శ్రీలంకకు కూడా ఇండియా నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో చైనా, ఈజిప్ట్ నుంచి సరఫరా పెరిగింది. అయితే ధరలు భారీగా పెరిగాయి. శ్రీలంకలో ఉల్లి ధర వారంలోనే 50 శాతం పెరిగింది. కిలోకు 280 నుంచి 300 శ్రీలంకన్ రూపీస్ (1.7 డాలర్లు)గా ఉంది.
పాత స్టాక్ డబుల్ ధరకు..
ఐదుగురు కుటుంబ సభ్యులు ఉన్న తమ ఇంట్లోకి తాను ప్రతిసారి 5 కిలోల ఉల్లి కొనుగోలు చేస్తానని, కానీ ఇప్పుడు ధరలు విపరీతంగా పెరగడంతో 3 కిలోలు మాత్రమే తీసుకుంటున్నానని ధాకాకు చెందిన ఓ హౌస్ వైఫ్ వెల్లడించారు. మరో విషయం ఏమంటే వ్యాపారులు పాత స్టాక్ను కూడా రెండింతలకు విక్రయిస్తున్నారని చెబుతున్నారు. ఇది మరీ దారుణం అంటున్నారు.