జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా.. ‘రింగ్’ రింగా రోజెస్!
రిలయన్స్ జియో రాకతో టెలికాం రంగంలో 'టారిఫ్ వార్' మొదలైన సంగతి తెలిసిందే. ఆరంగేట్రంతోనే సంచలన ఆఫర్లతో రిలయన్స్ జియో తన ప్రత్యర్థి టెలికాం కంపెనీలైన భారతి ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్లకు దిమ్మతిరిగేలా చేసింది.. ఇప్పటికీ చేస్తూనే ఉంది.
అయితే తాజాగా ఈ టెలికాం కంపెనీల నడుమ మరో వివాదం రాజుకుంది. అదే 'రింగ్ టైమ్ వార్'. ఫోన్ కాల్ వచ్చినప్పుడు మొబైల్ కొద్దిసేపు రింగ్ అవుతుందనేది అందరికీ తెలిసిందే. అయితే ఈ రింగ్కు నిర్ణీత సమయం ఉంటుంది. ఇప్పుడు ఈ రింగింగ్ టైమే.. టెలికాం కంపెనీల నడుమ పెద్ద రగడగా మారింది.
అసలేమిటీ రింగ్ టైమ్...
ఒక టెలికాం నెట్వర్క్ నుంచి మరొక టెలికాం నెట్వర్క్కు కాల్ వెళ్లినప్పుడు కొంతసేపు మొబైల్ రింగ్ అవుతుంది. దీనికి నిర్ణీత సమయం ఉంటుంది. దీనినే ‘రింగ్ టైమ్'గా వ్యవహరిస్తారు. ఆ రింగ్ టైమ్ పూర్తి అయ్యేలోగా అవతలివాళ్లు కాల్ అందుకుంటే.. ఆటోమేటిక్గా కాల్ కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ రింగ్ కాల వ్యవధిని టెలికాం కంపెనీలు కావాలనే తగ్గిస్తున్నాయనేది ఆరోపణ.
ఎవరెవరు తగ్గించారంటే...
భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు ఇటీవల తమ రింగింగ్ టైమ్ను 25 సెకన్లకు తగ్గించాయి. గతంలో ఈ రింగ్ టైమ్ 30 నుంచి 45 సెకన్లుగా ఉండేది. ఈ టెల్కోలు ఇలా రింగ్ టైమ్ను తగ్గించడానికి కారణం.. ఇటీవల రిలయన్స్ జియో కూడా తన రింగ్ టైమ్ను తగ్గించడమే. జియో ఎప్పుడైతే ఇలా రింగ్ టైమ్ను తగ్గించిందో.. దానికి అనుగుణంగా మిగిలిన టెలికాం కంపెనీలు కూడా తమ రింగ్ టైమ్లో మార్పులు చేశాయి. ఎయిర్టెల్ దేశవ్యాప్తంగా రింగ్ టైమ్ను తగ్గించగా.. వొడాఫోన్ ఐడియా మాత్రం దేశంలోని కొన్ని ప్రాంతాల్లోనే రింగ్ టైమ్ను తగ్గించింది.
రింగ్ టైమ్ తగ్గిస్తే ఏంటి లాభం?
రింగ్ టైమ్ను ఎందుకు తగ్గించారు? అనే కోణంలో కన్నా.. ఇలా తగ్గించడం వల్ల టెలికాం కంపెనీలకు లాభమేమిటి? అనే కోణంలో ఆలోచించాలి. అప్పుడే దీనివెనుక ఉండే లోగుట్టు మనకు అర్థమవుతుంది. ఎలాగంటే, ఒక నెట్వర్క్ నుంచి మరొక నెట్వర్క్కు కాల్ వెళ్లినప్పుడు ఇంటర్ కనెక్ట్ యూసేజ్ ఛార్జి(ఐయూసీ) చెల్లించాల్సి వస్తుంది. మరింత వివరంగా చెప్పాలంటే.. కాల్ చేసిన నెట్వర్క్ వారు కాల్ ముగిసిన నెట్వర్క్కి ఈ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
తగ్గించినప్పుడు ఏం జరుగుతుంది?
ఉదాహరణకు.. జియో నెట్వర్క్ నుంచి ఎయిర్టెల్ నెట్వర్క్కు కాల్ చేశారనుకుందాం. జియో రింగ్ టైమ్ ముగిసేలోపే ఎయిర్టెల్ కాల్ అందుకోవాలి. అందుకుంటే.. కాల్ వ్యవధిని బట్టి జియో ఈ ఐయూసీని ఎయిర్టెల్కు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ జియో రింగ్ టైమ్లోగా కాల్ కనెక్ట్ అవకపోతే.. ఆ వెంటనే ఫలానా నంబర్ నుంచి మీకు కాల్ (మిస్ కాల్) వచ్చిందంటూ ఒక మెసేజ్ వినియోగదారుడికి అందుతుంది. దీంతో సహజంగానే అవతలి వ్యక్తి (ఎయిర్టెల్) తిరిగి తనకు కాల్ చేసిన వ్యక్తి (జియో)కి కాల్ చేస్తారు. ఇప్పుడు కాల్ కనెక్ట్ అయితే.. ఎయిర్టెల్ ఈ ఐయూసీని జియోకు చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. తన రింగ్ టైమ్ను తగ్గించడం ద్వారా జియో ఐయూసీని తప్పించుకోవడమే కాకుండా.. ఎయిర్టెల్ నుంచి ఐయూసీని అందుకుంటుంది.
దే ‘రింగ్ టైమ్ వార్'...
టెలికాం కంపెనీల నడుమ అసలు వివాదం ఇక్కడే మొదలైంది. ఈ ఇంటర్ కనెక్ట్ యూసేజ్ ఛార్జి(ఐయూసీ)ని తప్పించుకునేందుకు కావాలనే జియో తన రింగ్ టైమ్ను తొలుత 20 సెకన్లకు తగ్గించి.. మళ్లీ తిరిగి 25 సెకన్లకు పెంచిందని భారతి ఎయిర్టెల్ ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఈ ఐయూసీ వల్ల ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా బాగా లాభపడుతున్నాయి. అత్యధికంగా ఐయూసీ చెల్లిస్తున్నది జియోనే. దీంతో ఈ ఐయూసీని తప్పించుకునేందుకే జియో రింగ్ టైమ్ను తగ్గించిందని ఎయిర్టెల్, వొడాఫోన్లు ఆరోపిస్తున్నాయి.
రంగంలోకి ట్రాయ్...
అయితే జియో మాత్రం ఎయిర్టెల్, వొడాఫోన్ల ఆరోపణలను కొట్టిపారేస్తోంది. అసలు అంతర్జాతీయ నిబంధనల ప్రకారం రింగ్ టైమ్ అనేది 15-20 సెకన్లు ఉంటే చాలని జియో వాదిస్తోంది. ఈ నేపథ్యంలో టెలికాం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) రంగంలోకి దిగింది. ఈ రింగ్ టైమ్పై టెలికాం కంపెనీలన్నీ ఓ ఒప్పందానికి రావాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై త్వరలోనే ఓ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.